29, ఏప్రిల్ 2016, శుక్రవారం

Sri Kunti Madhava Swamy Temple, Padmanabham

           శ్రీ కుంతీ మాధవ స్వామిఆలయం, పద్మనాభం 

ఎక్కడో ఉత్తర భారత దేశంలో ఉన్న హస్తినా పురి కి చెందిన పాండవుల నిర్మాణాలుగా పేర్కొనే ఎన్నో ఆలయాలు దక్షిణ భారత దేశంలోని అయిదు రాష్ట్రాలలో కనిపిస్తూ ఉండటం ఎంతో అబ్బురంగా అనిపిస్తుంది. 
రవాణా సదుపాయాలు అతి తక్కువగా, ప్రయాణంలో లెక్కలేనన్ని ఇబ్బందులు ఉండే ఆ కాలంలో వారు ఇంత దూరాలు ఏ విధంగా ప్రయాణించారో  !!!
తమిళనాడు మహాబలిపురం లోని పంచ పాండవ రధాలు, కేరళ లోని పంచ పాండవ శ్రీ కృష్ణ ఆలయాలు వీటిల్లో కొన్ని ! మన తెలుగు రాష్ట్రాలలో కూడా కొన్ని పాండవ నిర్మిత ఆలయాలు కనపడతాయి. 










మన రాష్ట్రంలో ఒడిస్సా సరిహద్దులలో ఉన్న మహేంద్ర గిరులలో ఉన్న పెక్కు పురాతన నిర్మాణాలను పాండు నందనులచే నిర్మించబడినవిగా తెలుస్తోంది. 
అదే కోవకు చెందిన మరో చరిత్ర ప్రసిద్ద  స్థలం "పద్మనాభం". 
సుందర సాగర తీర నగరం విశాఖ పట్టణానికి సుమారు ముప్పై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మనాభంలో తమ తల్లి కుంతీ దేవితో పాటు పంచ పాండవులు వనవాస కాలంలో కొంత కాలం ఇక్కడ నివసించారని స్థానికంగా ప్రచారంలో ఉన్న గాధలు తెలుపుతున్నాయి. 








ఆ సమయంలో నిత్య పూజల నిమిత్తం వారు విగ్రహ రూపంలో ప్రతిష్టించుకొన్న శ్రీ మహా విష్ణువు  నేడు శ్రీ కుంతీ మాధవ స్వామిగా పూజలందుకొంటున్నారు.
ఈ ఆలయాన్ని విజియనగరాన్ని రాజధానిగా చేసుకొని పాలించిన పూసపాటి వంశపు రాజులు నిర్మించారు. వారి అధీనంలో ఉన్న నూటికి పైచిలుకు దేవాలయాలలో పద్మనాభం లోని శ్రీ కుంతీ మాధవ స్వామి కూడా ఒకటి.









సువిశాల ప్రాంగణంలో కళింగ నిర్మాణ శైలిని ప్రదర్శించే నిర్మాణాలతో ఉన్న ఈ ఆలయం చరిత్రతో విడదీయలేని బంధం కలిగి ఉన్నది.
కప్పం కట్టడానికి నిరాకరించిన స్థానిక పాలకుడైన పూసపాటి విజయరామ గజపతి రాజు మీద వలస పాలకులైన ఆంగ్లేయులు యుద్ధం ప్రకటించారు. 09. 07. 1794 వ సంవత్సరంలో ఇక్కడ జరిగిన సమరంలో గజపతి రాజు వీర మరణం పొందినట్లుగా తెలుస్తోంది.
ఆంద్ర ప్రాంతంలో ఆంగ్లేయులతో జరిగిన  భీకర పోరాటాలలో ఒకటిగా చరిత్రకారుల గుర్తింపు పొందినది పద్మనాభంలో జరిగిన ఆ యుద్ధం.  








ఈ ఆలయాభివృద్దికి విజయనగర  రాజులు యెనలేని'కృషి చేసారు.
రాయి సున్నంతో నిర్మించిన ఆలయంలో కొద్ది శిల్పాలు గర్భాలయ వెలుపలి గోడలలో కనిపిస్తాయి తప్ప మరెలాంటి శిల్ప సంపద గోచరించదు.
















ప్రధాన ఆలయానికి నలువైపులా మండపాలు ( శ్రీ కూర్మం, రామ తీర్ధం, అరసవెల్లి లో మాదిరి) ఉంటాయి.
గర్భాలయంలో శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి స్థానక భంగిమలో నేత్ర పర్వంగా దర్శనమిస్తారు.












ప్రతి నిత్యం నియమంగా పూజలు నిర్వహిస్తారు.శ్రీ కృష్ణ జన్మాష్టమి, శ్రీ రామ నవమి, వైకుంఠ ఏకాదశి పర్వదినాలలో పాటు వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఇతర పూజలతో పాటు ధనుర్మాస పూజలను కూడా ఘనంగా జరుపుతారు.






పక్కనే ఉన్న కొండ మీద సాల గ్రామ శిలా రూపంలో స్వయంవ్యక్త శ్రీ అనంత పద్మనాభ స్వామి కొలువై ఉంటారు.
రెండువేల పైచిలుకు సోపాన మార్గంలో పైకి వెళ్ళే సదుపాయం ఉన్నది. ప్రతి నిత్యం అర్చకులు ఉదయాన్నే పర్వత పై భాగానికి వెళ్లి అర్చన, నివేదన జరిపి తిరిగి వస్తారు.
ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే ఆఖరి అమావాస్య రోజున సహస్ర దీపారాధన పేరిట  అత్యంత ఘనంగా మెట్ల పూజ ఏర్పాటు చేస్తారు.









ప్రతి మెట్టు మీదా దీపాలు వెలిగిస్తారు. అమావాస్య నాటి చీకట్లను తొలగిస్తూ దేదీప్య మానంగా వెలిగిపోయే పద్మనాభం పర్వతాన్ని ఆ రోజున వీక్షించడం ఒక జీవిత కాల అనుభవంగా పేర్కొనాలి.
స్థానిక, దూరప్రాంతాల నుండి లక్షలాదిగా భక్తులు తరలి'వస్తారు.












విశేష పౌరాణిక చారిత్రక నేపథ్యం కలిగిన పద్మనాభం గ్రామంలో శ్రీ కుంతీ మాధవ స్వామి ఆలయానికి దగ్గరలో పురాతన శివాలయం ఉంటుంది. నిత్య పూజలు జరుగుతాయి. 






ఇంతటి విశేషమైన గుర్తింపు కలిగి ఉన్నపద్మనాభం క్షేత్రానికి విశాఖపట్నం నుండి మరియు సింహాచలం నుండి సులభంగా రహదారి మార్గంలో చేరుకొనే సదుపాయం ఉన్నది. బస్సులు లభిస్తాయి. 
కానీ ఎలాంటి వసతి సౌకర్యాలు లభించవు కనుక దర్శనం చేసుకొని తిరిగి వచ్చేయడం ఉత్తమం. 
ఒక అద్భుత పురాతన ఆలయ సందర్శన భాగ్యం పద్మనాభం ఆలయం కలిగిస్తుంది. 

కృష్ణం వందే జగద్గురుం !!!!!




Nandyal - Nava Nandi Kshetram

                                 నవనందుల క్షేత్రం - నంద్యాల 

మన దేశంలో నెలకొన్న అనేకానేక ఆలయాలలో ప్రధాన అర్చనామూర్తి తో పాటు ఉప దేవతలు ఎందరో కొలువు తీరి ఉంటారు. 
అందరినీ సందర్శించి సేవించుకోవడం శుభప్రదంగా భావిస్తారు భక్త జనం. 
కానీ ఒకే దైవం ఒక ప్రాంత పరిసరాలలో లేదా కొన్ని పవిత్ర ప్రదేశాలలో ఒకే కారణంతో లేదా ప్రత్యేక విశేషంతో కొలువై ఉండిన దివ్య క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. 
అష్ట వీరట్ట క్షేత్రాలు, సప్త మాంగై స్థలాలు, పంచ భూత స్థలాలు, పంచ  నాట్య సభలు, నవ కైలాసాలు, పంచ పాండవ ఆలయాలు, పంచ ధర్మశాస్త ఆలయాలు లాంటివి తమిళనాడు మరియు కేరళలోనెలకొని ఉండగా   పంచారామాలు, పంచ భావన్నారాయన, పంచ శ్రీ వల్లభ క్షేత్రాలు, పంచ నారసింహ ఆలయాలు  మన రాష్ట్రంలో ఉన్నాయి. 
ఇవన్నీ ఒక ఎత్తయితే కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి సుమారు ముప్పై కిలోమీటర్ల పరిధిలో నేకొని ఉన్న నవ నందులు విశేష పౌరాణిక మరియు చారిత్రిక కలిగినవిగా పేర్కొనవచ్చును. 




పాండు వంశానికి చెందిన నంద రాజులు పాలించిన ప్రాంతం కావున నందుల రాజ్యంగా పిలవబడి కాలక్రమంలో "నంద్యాల"గా  స్థిరపడింది. తదనంతర కాలంలో చంద్ర గుప్తా మౌర్యుడు వీరిని ఓడించి ఈ ప్రాంతాన్ని తన అధీనం లోనికి తీసుకొన్నట్లుగా పెక్కు శాసనాలు లభించాయి.  
నంద రాజు పాలనా కాలంలో ఆయనకు గల గో మందలను దాపుల ఉన్న అటవీ ప్రాంతానికి మేతకు తీసుకొని వెళ్ళేవాళ్ళు గోపాలకులు. ఒకనాడు మందలోని ఒక ఆవు సమీపంలోని పుట్ట వద్దకు వెళ్లి నిలబడగానే పొడుగు నుండి పాలు వాటంతట అవే ధారగా రావడం పుట్ట నుండి ఒక బాలకుడు వెలుపలికి వచ్చి ఆ క్షీరాన్ని స్వీకరించడం చూసిన పశు పాలకుడు రాజుకు ఆ విషయాన్ని తెలిపాడు. 
అద్భుతమైన ఆ దృశ్యాన్ని చూడటం కొరకు  మరుసటి రోజు రాజు అరణ్యం లోనికి వెళ్ళారు. పాలను స్వీకరిస్తున్న బాలుని మరింత దగ్గరగా చూడాలన్న కుతూహలంతో ముందుకు రావడం వలన కలిగిన అలికిడికి గోవు బెదరి పుట్టాను తొక్కుకుంటూ  వెళ్ళగా బాలుడు అదృశ్యమయ్యాడు.
తన దురదృష్టానికి చింతిస్తూ నిద్రించిన నందునికి నాటి రాత్రి మహేశ్వరుడు స్వప్నంలో దర్శనం ప్రసాదించి ఆ బాలుడు తానేనని శిలాద మహర్షి తనయుడైన మహా నంది ఇక్కడ తపస్సు చేసి తన వాహనం అయ్యే వరం కోరుకోన్నాడని తెలిపారు.  అతని పేరు మీద ఈ క్షేత్రం మహా పుణ్య తీర్థ ప్రదేశంగా పేరు పొందుతుందని, పుట్ట రూపంలో ఉన్న తన  రూపానికి  నిర్మించమని చెప్పారట. 
అంటే కాకుండా తానూ అతని రాజ్యంలో మరో ఎనిమిది దివ్య స్థానాలలో వివిధ కారణాల వలన  రూపంలో వెలసి ఉన్నానని వాటిని కూడా ప్రజలకు అందుబాటు లోనికి తేవలసినదిగా ఆదేశించారట. 
ఆనందించిన నందుడు సర్వేశ్వరుని ఆనతి ప్రకారం అన్ని చోట్ల ఆలయాలు నిర్మించారు. ఈ వంశం వారి తరువాత పాలించిన వెలనాటి చోళులు, విజయనగర రాజులు ఈ ఆలయాల అభివృద్దికి విశేష కృషి చేసారని లభించిన శాసనాలు తెలుపుతున్నాయి. 
ఈ నవ నంది క్షేత్రాలు వరుసగా మహానంది, ప్రధమ నంది, నాగ నంది, సోమనంది, సూర్య నంది, శివ నంది, విష్ణు నంది, గరుడ నంది మరియు వినాయక నంది. 
ఈ తొమ్మిది ఆలయాలలో మూడు నంద్యాల పట్టణంలో మూడు, మహానంది లో మూడు రెండింటికి మధ్య ఉన్న మార్గంలో మిగిలిన మూడు ఆలయాలు ఉంటాయి. 
సోమవారం, పౌర్ణమి, మాస శివరాత్రి, త్రయోదశి రోజులలో నుండి సాయంత్రం లోపల నవ నందుల క్షేత్ర సందర్శనం శుభాదాయకంగా భక్తులు పరిగణిస్తారు. శివరాత్రి నాడు అన్ని చోట్లా విశేషంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. 
ఈ నవ నంది యాత్రకు బయలుదేరే ముందు నంద్యాల పట్టణంలోని "శ్రీ సాక్షి మల్లిఖార్జున స్వామి" కి మొక్కి ఆరంభించాలని అంటారు. 
రెండు వేల సంవత్సరాల క్రిందటి నిర్మాణంగా పేర్కొనే ఈ ఆలయం చాలాకాలం భూమిలో ఉండిపోయి కొన్ని సంవత్సరాల క్రిందట స్థానిక భక్తుల శ్రమదానంతో  సంతరించి కొన్నది. 
స్వామి వారితో పాటు శ్రీ భ్రమరాంబ దేవికి, నూతనంగా నిర్మించిన ఆలయంలో కొలువైన హరిహర పుత్ర  శ్రీ ధర్మ శాస్త ని పూజించి యాత్ర ఆరంభిస్తారు భక్తులు. 
నవ నందులలో తొట్టతొలుత సందర్శించ వలసినది "ప్రధమ లేదా పద్మ నంది". 
రైల్వే స్టేషన్ కు బస్సు స్టాండ్ కు సమ దూరంలో కర్నూల్ రోడ్ లో  ప్రధాన రహదారి కి కొద్దిగా లోపలికి ఉంటుందీ ఆలయం. సృష్టి కర్త బ్రహ్మ దేవుడు పరమేష్టి సందర్శనాభిలాషతో ఇక్కడ తపస్సు చేసి సాక్షాత్కారం పొందారట. 
ముఖ మండపంలో ఉన్న పెద్ద నంది తల మీద పేరుకు తగినట్లుగా పెద్ద పద్మం చెక్క బడి ఉంటుంది. 
విఘ్ననాయకుడు, శ్రీ ప్రధమ నందీశ్వరుడు, శ్రీ కేదారేశ్వరి దేవి మూడు సన్నిధులలొ కొలువు తీరి కనపడతారు. 
నవ గ్రహ మండపం, శ్రీ ఆంజనేయ, శ్రీ గాయత్రీ మాత, శ్రీ వెంకటేశ్వర స్వామి ఉపాలయాలు ఉంటాయి. 
పడమర దిశలో నిర్మించబడిన ఈ ఆలయంలో ఒక నిర్మాణ చాతుర్యం కార్తీక మాసంలో ఆవిష్కారమవుతుంది.    పరమేశ్వర ప్రియ మాసంలో ప్రతి నిత్యం సాయం సంధ్యా సమయంలో సూర్య కిరణాలు నేరుగా లింగాన్ని తాకుతాయి. 
రెండవది "నాగ నంది". నంద్యాల బస్సు స్టాండ్ దగ్గరలోని శ్రీ ఆంజనేయ సమేత కోదండరామ స్వామి ఆలయంలో కొలువై ఉంటారు. శ్రీ వారి వాహనమైన గరుడుని బారి నుండి తమను కాపాడమని నాగులు కొందరు నాగాభరణుని ప్రార్ధించిన స్థలంగా పేర్కొంటారు. శ్రీ నాగ నందీశ్వర స్వామిగా కొలుస్తారు. ఇక్కడ ప్రధాన అర్చనా మూర్తి శ్రీ హనుమంతుడు. శ్రీ కృష్ణ దేవరాయల గురువైన శ్రీ వ్యాసరాయల ప్రతిష్టిత వాయు నందనుని విరాట్ రూపం రమణీయ అలంకరణతో నేత్ర పర్వంగా ఉంటుంది. 
ఇక్కడ శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనం కూడా నెలకొల్పారు. 
మూడవదైన "సోమ నంది" పట్టణంలోని ఆత్మకూరు బస్సు స్టాండ్ దగ్గరలోని శ్రీ జగజ్జనని మాత ఆలయానికి చేరువలో ఉంటుంది. మామ గారైన దక్ష ప్రజాపతి ఇచ్చిన శాప ప్రభావం తగ్గించు కోడానికి చంద్రుడు ఇక్కడ తపస్సు చేశారన్నది స్థల పురాణం. అనుగ్రహించి అతనిని తన శిరస్సున ఉంచుకొని చంద్ర శేఖరునిగా కీర్తించబడుతున్నారు. 
నంద్యాలకు మహానందికి మధ్యలో తుమ్మెద పల్లి గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉంటుంది సూర్య నంది ఆలయం. ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్య భగవానుడు సర్వేశ్వర దర్శనాన్ని అపేక్షిస్తూ తపస్సు చేసిన స్థలమిది. ప్రతి నిత్యం
ఉదయాన్నే తోలి కిరణాలతో శ్రీ సూర్య నందీశ్వర స్వామిని అభిషేకిస్తారు ఆదిత్యుడు. 
నాలుగోది అయిన "శివ నంది" మహానంది ప్రధాన రహదారిలో వచ్చే కడమల కాల్వ పక్క నున్న మట్టి మార్గంలో నాలుగు కిలోమీటర్లు ప్రయాణిస్తే చేరుకోవచ్చును. ప్రశాంత అటవీ వాతావరణం లో ఉండే రుద్ర లేదా శివ నంది ఆలయంలో పురాతన నిర్మాణాలు, శాసనాలు కనపడతాయి. 
  నవ నందులలో ఆరవది అయిన విష్ణు నంది కి శివ నంది నుండి అడవిలో ఒక మార్గం ఉన్నా అది ప్రమాద భరితం. 
అందుకని యాత్రీకులు తిరిగి ప్రధాన రహదారి చేరుకొని తరువాత వచ్చే  కాలువ పక్కనున్న రహదారిలో మూడు కిలో మీటర్లు ప్రయాణించి శ్రీ మహా విష్ణువు శ్రీ పమేశ్వరుని ఆరాధించిన విష్ణు నంది చేరుకుంటారు. 
సుందర ప్రకృతి. స్వచ్చ జలాలతో  పుష్కరణి. అనేక పురాతన మండపాలు. నిలువెత్తు పాలరాతి నంది విగ్రహం అన్నీ అద్భుతంగా ఉంటాయి. 
ఏడవదైన "శ్రీ గరుడ నంది" మహానంది గ్రామం లోనికి ప్రవేశిస్తుండగానే కనపడుతుంది. దాస్య విముక్తి కలిగించ దానికి దాయాదులైన నాగులు కోరిన అమృత భాండం తేవడానికి  వెళ్ళడానికి సిద్ద పడ్డాడు గర్త్మంతుడు. తల్లి వినత సలహా మేరకు తన ప్రయత్నం విజయవంతం కావాలని నంది వాహనుని అనుగ్రహం కొరకు గరుడుడు ప్రార్ధించిన స్థలమిది అని చెబుతారు. 
యెమిదవది అయిన వినాయక నంది శ్రీ మహా నందీశ్వర స్వామి ఆలయ ప్రాంగణం లోనే ఉంటుంది. 
అన్నింటిలోనికీ ప్రసిద్ది చెందిన శ్రీ శ్రీ మహా నందీశ్వర స్వామి ఆలయానికి వెలుపల త్రిమూర్తి గుండాలు ఉంటాయి. సర్వ కాల సర్వావస్థలలొ ఒకే పరిమాణంలో ఉండే నీటికి అనేకానేక ఔషధ గుణాలు ఉంటాయి అన్న నమ్మకంతో భక్తులు  వీటిల్లో స్నానమాచరించిన తరువాత శ్రీ స్వామి వారి దర్శనానికి వెళతారు. 
చక్కని శిల్పాలతో నిండిన ఆలయం భక్తులలో ఆధ్యాత్మిక అనుభూతులను ఇనుమడింప చేస్తుంది. 
లింగం మీద ఉన్న ఆవు గిట్టల గుర్తులను చూడాలంటే ప్రత్యేక దర్శనం ద్వారా  సాధ్యం. 
ఇక్కడ శివరాత్రికి బ్రహ్మోత్సవాలు, శ్రీ రామ నవమికి ప్రత్యేక ఉత్సవాలు, రధ యాత్ర, వేలాది మంది భక్తుల సమక్షంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. 
నంద్యాల మరియు మహా నందిలో ఉండటానికి తగిన వసతులు మరియు భోజన సదుపాయం లభిస్తాయి. 
నంద్యాల పట్టణానికి రాష్ట్రం నలుమూలల నుండి బస్సు లేదా రైలు మార్గాల ద్వారా సులభంగా చేరుకోనవచ్చును. 
ఈ వ్యాసానికి సంబంధించిన చిత్రాలు ఈ బ్లాగులో ఉన్నాయి. 

నమః శివాయ !!!!!

    


Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...