18, ఆగస్టు 2016, గురువారం

King Vallala Deva, Tiruvannamalai

                                   పుత్రుడైన పరమేశ్వరుడు 

పరమేశ్వరుడు తలచుకొంటే ప్రసాదించలేనిది అంటూ ఏదీ లేదు !
ఎనలేని అనుగ్రహాన్ని కురిపించగలరు.కన్నప్ప,మార్కండేయుడు,శిబి ఇలా ఎందరో మహానుభావులు అలాంటి కృపకు నోచుకొన్నవారే !!
వారి కోవకు చెంది, మహేశ్వరుని మమతానురాగాలకు అర్హత పొందిన మరో భాగ్యశాలి వళ్ళాల దేవ మహారాజు.  



శ్రీ కృష్ణ దేవరాయలు



వెయ్యి కాళ్ళ మండపం మరియు వళ్ళాల గోపురం 

వీర వళ్ళాల దేవ రాజు - 3 దక్షిణ భారత దేశాన్నిపాలించిన శక్తివంతమైన "హొయసల "రాజ వంశానికి చెందిన వాడు. వీరి తొలి రాజధాని నేటి మైసూరుకు సమీపంలోని "హళిబేడు". ఆ రోజుల్లో దాని పేరు "ద్వార సముద్ర". 
 1233 నుండి 1346 వరకు (వంద సంవత్సరాలకు పైగా) వీరు నేడు కర్ణాటక, ఆంద్ర, తమిళనాడు, తెలంగాణాగా పిలవబడుతున్న ప్రాంతాలలోని  అధిక భూభాగాన్ని తమ పాలనలో ఉంచుకొన్నారు. హొయసల రాజులలో అత్యంత కీర్తిప్రతిష్టలు పేరొందిన పాలకుడు "వళ్ళాల దేవ రాజు - 3". ఈయన పోరాట పరాక్రమ విజయాలకు గుర్తింపుగా ప్రజలు "వీర వళ్ళాల"గా పిలిచేవారు.  
1292 వ సంవత్సరం నుండి 1342 దాకా పాలించిన వళ్ళాల రాజు తన పాలనను తొలి రోజులలో ద్వార సముద్ర నుండే సాగించాడు.  కానీ అల్లా ఉద్దీన్ ఖిల్జీ సేనానాయకుడైన "మాలిక్ ఖాఫర్ " 1311వ సంవత్సరంలో జరిపిన దక్షిణ దేశ దండయాత్రలో అతని చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. తన సమస్త సంపదలను మాలిక్ ఖాఫర్ కు సమర్పించుకున్నాడు.
సుల్తాన్ మూకలు ద్వార సముద్ర నగరాన్ని సమూలంగా నేలమట్టం చేశారు.
శివ భక్తుడైన వళ్ళాలుడు తదనంతర కాలంలో సుల్తాన్లకు సామంతునిగా ఉంటూ తిరువణ్ణామలై ని తన రెండవ రాజధానిగా చేసుకొని దక్షిణాన తాను కోల్పోయిన ప్రాంతాలను చాలా మటుకు తిరిగి గెల్చుకొన్నాడు.
ఈయన శివ భక్తి గురించి " అరుణాచల పురాణం "లోని ఏడవ అధ్యాయంలో విపులంగా తెలుపబడినది. ఆ వివరాలు తెలుసుకొందాము.





వళ్ళాల గోపురం శ్రీ బ్రహ్మ లింగేశ్వర ఆలయం వద్ద నుండి 

వళ్ళాల రాజు అనేక విధములైన కైకర్యాలు అణ్ణామలై స్వామికి సమర్పించుకున్నాడు.  ఎన్నో నిర్మాణాలను పునః నిర్మించాడు. కొత్తవి చేపట్టాడు. ఎంతటి వీరుడో  అంతటి దైవ భక్తుడైన మరెంతో దాన శీలి కూడా !
పేదవారికి, అంధులకు ధన సహాయం,  సాధువులకు సన్యాసులకు, మఠాలకు ఎన్నో భూరి విరాళాలు అందించాడు.
ఈ కాలంలోనే పెక్కు నిర్మాణాలు అరుణాచలేశ్వర ఆలయంలో నిర్మించబడ్డాయి.
అన్నింటి లోనికి గొప్ప నిర్మాణంగా ఆ రోజుల్లో కీర్తించబడినది " వళ్ళాల గోపురం". ( మొదటి ప్రాకారం నుండి రెండో ప్రాకారం లోనికి వెళ్లేటప్పుడు ఉంటుంది. వేయ్యి కాళ్ళ మండపం, పెరియ నంది దాటినా తరువాత).
అప్పట్లో అదే ప్రధాన ద్వారం. ఈయన తరువాత మూడు వందల సంవత్సరాలకు శ్రీ కృష్ణ దేవరాయలు ప్రధమ ప్రాంగణ ప్రహరీ గోడను, నేటి తూర్పు రాజ గోపురాన్ని నిర్మించారు. మిగిలిన  గోపురాలు అయిన పేయి, తిరుమంజన మరియు అమ్మణి అమ్మన్ గోపురాలు అనంతర కాలంలో నిర్మించబడ్డాయి).
ప్రజలందరూ రాజు గారి శివ భక్తికి, ఆలయాభివృద్ది పట్ల చూపిస్తున్న శ్రద్ధకు ఎంతో ప్రశంసించారు. అప్పటికే ఆ గోపురాన్ని చూసి మురిసిపోతున్నవళ్ళాల రాజు ఈ ప్రస్తుతింపులకు మరింత పొంగిపోయాడు. ఆయనలో గర్వం పెరిగిపోయింది.
తాను కాబట్టి ఇంతటి అద్భుత నిర్మాణం నిర్మించగలిగాడు. మరొకరికి సాధ్యం కాదు. అని అనుకోసాగాడు. నిండు సభలో ప్రస్తాపించాడు.
భక్తి భావం స్థానంలో అహంకారం తలెత్తడం గమనించిన సర్వేశ్వరుడు దానిని తొలిగించాలని నిర్ణయించుకొన్నారు.
దానికి తగిన సమయం కూడా వచ్చినది.











అమ్మని అమ్మన్ గోపురం (ఉత్తర)

ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సాయంత్రం దేవేరీ సమేతులై శ్రీ అన్నామలైయార్ పుర వీధులలో విహరించడం ఆనవాయితీ. తొలి రోజు సాయంత్రం ఆది దంపతులు ఉపస్థితులైన పల్లకీ వళ్ళాల గోపుర ద్వారం గుండా వెళ్లలేక పోవడంతో నిర్వాహకులు మరో మార్గం ద్వారా నగర సంచారానికి తీసుకొని వెళ్లారు.
తొమ్మిది రోజుల పాటు అలానే జరిగింది. సుందర నిర్మాణంగా రాజు గర్వపడుతున్న గోపురం గుండా స్వామి వెళ్ళలేదు.  రాజుకు గర్వం తొలగిపోయి స్వామి వారి సన్నిధి చేరుకొని తెలిసీ తెలియక చేసిన తప్పులు ఏమన్నా ఉంటే క్షమించి గోపుర ద్వారం గుండా పుర విహారానికి వెడల వలసినదిగా ప్రార్ధించాడు.  ఆ విన్నపాలకు భక్త సులభుడు కరిగిపోవడం వలన నాటి సాయంత్రం ఇంతకు వచ్చిన అవాంతరాలు రాకుండా ఆపడం వలన పల్లకీ
 వళ్ళాల గోపుర ద్వారం గుండానే వెలుపలికి వెళ్ళినది.
నేడు అలాంటి ఆటంకాలు ఏమీ లేకున్నా తొలి తొమ్మిది రోజులూ మరో ద్వారం గుండానే స్వామి ఆలయం వెలుపలికి వెళతారు.
నాటి నుండి అహంకారం పూర్తిగా తొలగిపోయిన మహారాజు మరింతగా శివ సేవలో నిమగ్నమైనాడు. ప్రజలకు పన్నుల భారం తగ్గించాడు. వారికి అనేక వసతులు, ఆసరాలు అందించాడు. ఇంతటి దైవభక్తి, ధర్మ ప్రవృతి కలిగి, ప్రజా శ్రేయస్సు కోరుకొనే రాజుకు ఉన్నకొరత సంతానం లేకపోవడం. అది ఆయనను ఎంతో బాధించేది. ఇద్దరు భార్యలతో కలిసి ఎన్నో వ్రతాలు, యాగాలు పూజలు చేసినా సంతాన భాగ్యం కలుగలేదు. ఈ విషయంలో రాజు నిత్య చింతితునిగా ఉండేవాడు.
పండితులతో, సాధువులతో తగిన పరిష్కారం గురించి తరచు సంప్రదింపులు జరిపేవాడు. వారు చెప్పినదల్లా తూచా తప్పకుండా ఆచరించేవాడు. అయినా ఎలాంటి ఫలితము కలుగ లేదు.
ప్రతి నిత్యం ఉదయాస్తమాన పూజలలో శ్రీ అరుణగిరి నాదర్ ను దీనంగా తన కోరికను విన్నవించుకొనేవాడు.
భక్తవత్సలుడు వళ్ళాలుని ప్రార్ధనకు కరిగిపోయారు.అయినా అంతిమంగా ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించుకొన్నారు.
తానూ తాపసి రూపం లోనికి మారి, కుబేరుని శిష్యునిగాను, ప్రమథ గణాలను అనుచరులుగా  చేసుకొని తిరువణ్ణామలై చేరుకొన్నారు కైలాసనాధుడు. నగరంలో ఉన్న వేశ్యావాటికలకు, దేవదాసీ నివాసాలకు వెళ్లి అందరికీ కోరినంత ధనాన్ని ఇచ్చి ఒక్కో అనుచరుని వారితో ఉంచి తానూ ప్రధమ శిష్యుని వెంటబెట్టుకొని రాజాస్థానానికి వెళ్లారు.
సాధుసంతుల పట్ల అపార గౌరవాన్ని చూపే మహారాజు వారిని సాదరంగా ఆహ్వానించి అతిధి సత్కార్యాలను చేసి వారు వచ్చిన పని ఏమిటో ? దానికి తానూ ఎలా సహాయ పడగలనో? తెలుపమని ప్రార్ధించాడు. 


శ్రీ కృష్ణ దేవ రాయ నిర్మిత కళ్యాణ మండపం 
వీర వళ్ళాల దేవ రాజు - 3




దానికి ఆ ముని సంవత్సరాల తపస్సు చేయడం వలన తాను స్త్రీ సంగమానికి దూరం అయ్యాను, గనుక నాకో చక్కని సుందరి పొందును ఏర్పాటు చెయ్యమని కోరారు.  అతిధుల కోర్కెలు ఎంతటి అసమంజసమైనవి అయినా వాగ్దానం ఇచ్చిన తరువాత నెరవేర్చడం గృహస్థు దర్మం. 
అంగీకరించిన రాజు అతిధులను విడిదికి, సైనికులను వారకాంతల వీధికి పంపారు. కానీ ఒక్కరు కూడా వారితో రావడానికి అంగీకరించలేదు.  వారి మాటలను విశ్వసించని రాజు మంత్రి పంపాడు. మంత్రి వెళ్ళీ సరికి అక్కడ ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైనది. 
ధ్యానముద్రలో ఉన్న విటులకు (?) ఉపచర్యలు చేస్తూ కనిపించారు వేశ్యామణులందరూ.  
అబ్బురపడిన మంత్రి ఆ మహిళతో రాజాజ్ఞ గురించి తెలిపాడు. 
దానికి వారు రాజాజ్ఞను ధిక్కరిస్తే మరణం ఉంటుందో ఉండదో తెలీదు కానీ మాట తప్పితే నరక ప్రాప్తి తప్పదు. అందునా అడిగినంత ధనం ఇచ్చిన ఈ శివ భక్తులను తాము మోసం చెయ్యలేము. మరునాటికి రాజుగారి ఆజ్ఞ మేరకు దేనికైనా సిద్దము అని తెలిపారు. 



 
చిన్న నంది మండప స్థంభం మీద  వళ్ళాల రాజు 

నిస్సహాయంగా వెనుతిరిగిన మంత్రి రాజుకు విషయం విన్నవించాడు. రాజునై కూడా అతిధి కోరిన కోర్కె తీర్చిలేక పోతున్నాను అన్న వ్యాకులతో అంతః పురానికి వెళ్ళాడు వళ్ళాలుడు. ఆయన వదనం చూడగానే భార్యలకు  భర్త ఏదో తీవ్ర సమస్యతో సతమతమవుతున్నాడు అన్న విషయం బోధపడింది. అడగగా రాజు అతిధి సత్కార్యంలో  ఎదురైనా అడ్డంకిని తెలిపాడు.
మరో మాట లేకుండా ఆయన చిన్న భార్య "సళ్ళమ దేవి" అతిధి కోర్కె నెరవేర్చడానికి తాను సిద్ధం అని తెలిపింది.
ఆనందంతో భార్యను అభినందించిన రాజు ఆమెను విడిది గృహానికి పంపాడు.




సళ్ళమ దేవి 


ఆమె అక్కడికి వెళ్లే సరికి అతిధి పూర్తిగా ధ్యాన సమాధిలో ఉన్నాడు. ఈమె రాకను గుర్తింపలేదు. సమయానికి రాక పోవడం వలన ఆగ్రహం ప్రదర్శిస్తున్నాడని అనుకొన్నది రాణి.  అతని మీద సుగంధ జలాలను, పూలు, అత్తరు  చల్లింది. మధురంగా గానం చేసింది. అయినా ఆయన ధ్యానం చెదరలేదు.  చివరి ప్రయత్నంగా ఆమె ఆ తాపసిని  తన కౌగిలి లోనికి తీసుకోబోయినది.
అంతే ముని కాస్తా ముద్దులు ఒలికే బాలునిగా మారి పోయాడు.
ఆనందంతో తబ్బిబ్బు అయిన రాణి రాజు వద్దకు వెళ్లి పసి బాలకుని చూపించింది.
వాత్సల్యం పెల్లుబుకగా బాలుని చేతుల లోనికి తీసుకు ప్రేమగా ఆప్యాయతతో ముద్దాడాడు రాజు.
ఆయన తృప్తి చెందక పూర్వమే బాలకుడు అదృశ్యమయ్యాడు.
దొరికినట్లే దొరికి దూరమైన పెన్నిధి పోయినవారి మాదిరిగా రాజు రాణి దుఖః సముద్రంలో మునిగి పోయారు.
పూజా మందిరానికి వెళ్లి అరుణ గిరి స్వామీ ని పరిపరివిధాల వేడుకొన్నారు.

  
 గోపుర ద్వారం పైన వళ్ళాల రాజు 




సంతృప్తి చెందిన పరమేశ్వరుడు వారికి దర్శన భాగ్యం ప్రసాదించి నేను మీకు బాలునిగా లభించి పుత్ర స్పర్శానుభవాన్ని ప్రసాదించాను. అందువలన వీకు పుత్రుడనే !
మరణానంతరం తల్లి తండ్రులకు పుత్రుడు ఏ రకమైన శ్రద్దా భక్తులతో శ్రాద్ధ కర్మలు జరుపుతాడో అలా నేను మీకు జరపగలను అని వరం ప్రాసాదించారు.
నాటి నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం మాసి ( ఫిబ్రవరి - మార్చి) నెలలో తిరువణ్ణామలై కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న "పళ్ళికొండ పట్టు"లో ఉన్న యేటి ఒడ్డున ఆబ్దికం పెడతారు.
ముందు రోజు సాయంత్రం పూజారులు వళ్ళాలరాజు తిధి గురించి స్వామికి తెలియచెబుతారు.
మరునాటి ఉదయం పల్లకీలో స్వామిని తీసుకొని పళ్ళికొండ పట్టు చేరుతారు. కార్యక్రమం పూర్తి అయిన తరువాత నీటిలో స్నానం చేసిన స్వామి ఆలయానికి చేరుకొంటారు.
ఎందరో భక్తుల్లో ఆ రోజు ఆ యేటిలో స్నానం చేస్తారు.
ఎంతటి భక్త వత్సలుడో శ్రీ అరుణాచలేశ్వరుడు !!!!





ఇంతటి అదృష్టానికి నోచుకొన్న వళ్ళాల రాజు విగ్రహాలు వళ్ళాల గోపురంలో మరియు చిన్న నంది మండప స్థంభం పైన చూడవచ్చును. 
ఈ నంది క్రింద రాజు గారి కుటుంబ సభ్యుల రూపాలు కూడా ఉన్నాయి కానీ నిరంతర దీపాల కారణంగా రూపం కోల్పోయాయి. 
తిరువణ్ణామలై ఆలయంలో జరిగే ఉత్సవాలలో ఇదొకటి. మరే  ఇతర ఆలయంలో కూడా ఇలాంటి ప్రత్యేకత కానరాదు. 
అందుకే ఇలలో కైలాసం అరుణాచలం !!  ప్రత్యక్ష దైవం అరుణగిరి నాధుడే   !!!




ఓం అరుణాచలేశ్వరాయనమః !!

UP Dates 2



అందరికీ నమస్కారం.  
గత నాలుగు రోజులలో మరి కొంత మంది దాతలు మహా పుస్తక క్రతువుకు వారి విరాళాలను  పంపినారు. 
1. అజ్ఞాత భక్తులు, హైదరాబాద్   -----         Rs. 516/-
2. V S Kumar, USA              -----              Rs. 1330/- ( 20 Dollars)
3. Ramana, U S A                 -----              Rs. 2000/- ( 30 Dollars)

వీరందరికీ శ్రీ అరుణాచలేశ్వరుని కృపాకటాక్షాలు సర్వవేళలా లభించాలని ప్రార్ధిస్తున్నాను. 
అందరినీ ఈ పవిత్ర కార్యక్రమంలో పాలు పంచుకోవాలని మరోసారి అర్ధిస్తున్నాను. 



8, ఆగస్టు 2016, సోమవారం

Up-dates

కృతజ్ఞతలు. 

శ్రీ అరుణాచలేశ్వరుని (తిరువణ్ణామలై)మీద పుస్తకం ప్రచురించి ఉచితంగా భక్తులకు అందించాలన్న సత్సంకల్పంతో ధన సహాయం కొరకు నేను చేసిన అభ్యర్థనకు తొలి స్పందన ఈ రోజు వచ్చినది. 
అజ్ఞాత భక్తులు ఒకరు Rs.665.38 ( 10 Dollars) పంపారు. 
ఆ సోదరుని కుటుంబానికి  సర్వేశ్వరుడు సకల శుభాలను ప్రసాదించాలని కోరుకొంటున్నాను. 
ఈ మహా పుస్తక క్రతువులో పాల్గొనాలని మరొక్కసారి అందరికీ సవినయ విన్నపం. 


ఇలపాలవులూరి వెంకటేశ్వర్లు 


6, ఆగస్టు 2016, శనివారం

Ashta Dikpaalakas Lingam Temples, Tiruvannamalai


అష్ట దిక్పాలక లింగ ఆలయాలు - తిరువణ్ణామలై 

పరమేశ్వరుడే పర్వత రూపంలో వెలసిన మహాద్భుత క్షేత్రం తిరువణ్ణామలై. 
తిరువణ్ణామలై లో పర్వత పాదాల వద్ద ఆలయం నిర్మించినా భక్తులు గిరి ప్రదక్షిణం చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. 
భగవాన్ శ్రీ రమణ మహర్షి స్వయంగా గిరి ప్రదక్షణం చేయడమే కాక ప్రదక్షిణా ఫలం గురించి సవివరంగా తన శిష్యులకు తెలిపారు. (గిరివలయం ఎలా చేయాలి, ఏ రోజు చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది అన్నది ఈ బ్లాగ్ లోని గిరివలయం శీర్షిక లో వివరించాను). అనేక పురాణాలలో అరుణాచల మహత్యం గురించి తెలుపబడినది. 
ప్రధాన ఆలయం నుండి ప్రారంభించే ఈ ప్రదక్షిణా పధంలో ఎన్నో పురాతన నూతన ఆలయాలు, మందిరాలు, మండపాలు ఎదురవుతాయి. 
వీలైనంత వరకూ అన్నింటినీ సందర్శించడం అభినందనీయం. అలా చేయలేని పక్షంలో అష్ట దిక్పాల లింగాలు ఎనిమిది మరియు లోకాలను వెలుగును ప్రసాదించే సూర్య ప్రతిష్ఠిత లింగం, నిరంతరం చంద్రశేఖరుని శిరస్సున ఉంటూ తన వెన్నెల వెలుగులతో ఆహ్లాదాన్ని పంచి ఇచ్చే  చంద్ర స్థాపిత లింగాన్నిదర్శించడం తప్పనిసరి.




గిరివలయంలో అష్ట దిక్పాలక లింగాలు నెలకొన్న విధానం 




ఈ లింగాల  అమరిక ఎంత శాస్త్ర బద్దంగా ఉంటుంది అంటే ఇంద్రలింగం తూర్పున, యమ లింగం దక్షిణంలో, వరుణ లింగం పడమరలో, కుబేర లింగం ఉత్తరంలో ఉండగా ఆగ్నేయంలో అగ్ని లింగం, నైరుతిలో నైరుతి లింగం, వాయువ్యంలో వాయు లింగం ఈశాన్యంలో ఈశాన లింగం ఉంటాయి. 
ఈ ఆలయాలన్నీ ఏనాడో నిర్మించబడినవిగా తెలుస్తోంది. 
కానీ కాల గమనంలో శిథిలావస్థకు చేరుకొని నిత్య పూజలు కూడా కరువై చాలాకాలం అలా ఉండిపోయాయి. 
1968 ప్రాంతాలలో తిరునెల్వేలి కి చెందిన "మూపనార్ స్వామి" తిరువణ్ణామలై వచ్చారు. ఆలయంలో ధ్యానం చేసుకుంటూ తన దగ్గరకు వచ్చిన వారికి ఆధ్యాత్మిక విషయాల గురించి చెబుతుండే వారు. 




ఇంద్ర లింగం లోపల 

అగ్ని లింగం 



క్రమం తప్పకుండా అరుణాచలానికి ప్రదక్షణం చేసే ఆయన మార్గంలో ఉన్న ఈ అష్ట దిక్పాల ఆలయాలు శిధిలావస్తలో ఎవరికీ పట్టకుండా ఉండటం గమనించారు. వాటి పురుద్ధరణ తాను  శివునికి చేసే సేవలలో ఒకటిగా భావించి స్థానిక భక్తుల, అణ్ణామలయ్యారు ఆలయ అధికారుల సహాయంతో ఆనతి కాలం లోనే పునః నిర్మించారు. 
అలా శ్రీ మూపనార్ స్వామి చేపట్టిన పురుద్ధరణ కార్యక్రమం వలన మనం ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయాలను నేడు సందర్శించుకోగలుగుతున్నాము. ఈ అష్ట దిక్పాల ఆలయాలలో ఈయన చిత్రం ఉండటం చూడవచ్చును. ప్రాతస్మరణీయులు. 
గ్రహగమనాలు  మానవ జీవితాల మీద చూపే  ప్రభావాన్ని అంచనా వేసి, పరమేశ్వర రూపమైన అరుణగిరి ప్రదక్షణ చేసే సమయంలో వీటిని దర్శిస్తే మావవులకు చేకూరే ఇహలోక శాంతిని అంచనా వేసి  ఏనాడో పెద్దలు నిర్మించిన ఈ ఆలయాల సందర్శన అభిలషణీయం.  ఒక్కో  ఆలయ సందర్శన ఒక్క విధమైన శుభ ఫలితాన్ని ఇస్తుంది అని తెలుస్తోంది. 
ఒక్కో లింగానికి ఒక్కో గ్రహం అధి దేవత గా ఉండి ఆ లింగ దర్శనం వలన భక్తులు ఉత్తమ ఫలితాలు పొందటం జరుగుతుంది అన్నది పెద్దల వాక్యం.   



యమ లింగం 




అష్ట దిక్పాల ఆలయాలలో మొదటిది ఇంద్ర ప్రతిష్ఠిత ఇంద్ర లింగం. ఈ ఆలయం ప్రధాన ఆలయానికి చేరువలో రధం వీధిలో ఉంటుంది. గిరివలయంలో వచ్చే అష్ట దిక్పాలక లింగ ఆలయాలలో తొలి ఆలయం. అమరావతికి, స్వర్గానికి,దేవతలకు అధిపతి. ఈ లింగాన్ని సేవించడం వలన అజ్ఞానం తొలగి జ్ఞాన మార్గం లభిస్తుంది. ఈ క్షేత్రానికి శుక్రుడు మరియు సూర్యుడు అధిదేవతలు. వీరు భక్తులకు ఉద్యోగపరంగా అత్యున్నత స్థానాన్ని మరియు దీర్గాయువును అనుగ్రహిస్తారు.
రెండవది అగ్నిలింగం. ఈ ఆలయం చింగమ్ రోడ్డులో శ్రీ శేషాద్రి స్వామి ఆలయానికి దగ్గరలో ఉంటుంది. ఇక్కడొక గమనించదగిన అంశం ఏమిటంటే ఈ ఆలయం తప్ప మిగిలిన దిక్పాలక ఆలయాలు దారికి ఎడమ పక్కన ఉండగా ఇదొక్కటే కుడి వైపున నెలకొని ఉంటుంది.
అగ్నిని ఆరాధించడం యుగాల నుండి వస్తున్న ఆచారం. మానవ జీవితాలలో అగ్ని కి ప్రాధాన్యత ఇంత అని చెప్పలేము. చంద్రుడు ఈ క్షేత్రానికి అధిపతి. అగ్ని లింగాన్ని ఆరాధించడం వలన పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. అంతే కాకుండా ఆపత్సమయాలలో సరి అయిన మార్గనిర్ధేశికం లభించి ఆ ప్రమాదం నుండి కాపాడుతుంది.




నైరుతి లింగం 





మూడవది అయిన  యమ లింగం గిరివలయం లోనికి ప్రవేశించడానికి కొద్దిగా ముందు స్మశానానికి దగ్గరలో వస్తుంది.  ఆయువు తీరిన జీవుల పాపపుణ్యాల లెక్కలు తేల్చే యమధర్మ రాజ ప్రతిష్ట. కుజుడు అధిపతి.
యమ లింగాన్ని ఆరాధించడం వలన ప్రమాదాల బారి నుండి తప్పించుకోవచ్చును. అంటే వాహన ప్రమాదాలు లాంటివి. (ముఖ్యంగా పదే  పదే ప్రమాదాల కారణంగా ఎముకలు విరక్కొట్టుకునే వారు దర్శిస్తే మంచి ఫలితం ఉంటుంది ). అంతే కాకుండా మంగళుడు ఆర్ధిక బాధల నుండి గట్టెక్కిస్తాడు. ఋణ భాధలు ఎదుర్కొంటున్నవారు ఇక్కడ "అంగారక ఋణ విమోచన స్త్రోత్రం" పఠిస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చును.
నైరుతి లింగం నాలుగవది. రాక్షస రాజైన నైరుతి ప్రతిష్టించిన ఈ లింగ క్షేత్రానికి అధిపతి రాహువు.
భక్తులు ఆలయం పక్కన ఉన్న నైరుతి పుష్కరణిలో(నీరు అపరిశుభ్రంగా ఉంటుంది) కనీసం పాదాలైన కడుక్కొని పూజిస్తే అన్ని జన్మల కర్మఫలం తొలగి పోతుంది. రాక్షస, పిశాచ, దుష్ట గ్రహ పీడలనుండి విముక్తి కలిగి ఇహపరాలలో అమిత కీర్తి ప్రతిష్టలను పొందుతారు.
నైరుతి లింగం పిదప వచ్చే కూడలిలో తిరునెరు శ్రీ అణ్ణామలై, శ్రీ ఉన్నామలై అమ్మన్, శ్రీ గాయత్రి దేవి ఆలయాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ పదునాల్గున సూర్య కిరణాలు నేరుగా లింగాన్ని తాకుతాయి. సహజంగా ఆ రోజున తమిళ ఉగాది పర్వదినం వస్తుంటుంది. ఎందరో భక్తులు ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించడానికి ఉదయాన్నే వస్తారు.


 


తిరునెరు శ్రీ అన్నామలై స్వామి ఆలయం 
అరుణాచలం 
సూర్య లింగం 


గిరివలయంలో వచ్చే తరువాతి ఆలయం ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్యనారాయణుడు ప్రతిష్టించినది. 
ఇక్కడ చేసే ఆదిత్య స్తోత్ర పఠన సంపూర్ణ ఫలితాలను'ఇస్తుంది. సూర్య నామస్మరణ చేస్తూ చేసే ప్రదక్షణ ఆరోగ్యకరం. 
సూర్యలింగం దాటిన వెంటనే ఉంటుంది వరుణలింగం. జీవులకు ప్రాణాధారమైన జలానికి అధిపతి.   
శని అధి దేవత. ఈ లింగానికి చేసే అభిషేక జలాన్ని స్వీకరిస్తే ఉబ్బసం లాంటి శ్వాసకోశ వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక్కడ లభించే ప్రదోష పూజ తాలూకు విభూది ధారణ సర్వ పాపాలను తొలగిస్తుంది అని అంటారు. 
వరుణ లింగం దాటిన తరువాత వచ్చే ఆది అన్నామలై గ్రామం లోనికి వెళితే అక్కడ "శ్రీ అణ్ణామలై స్వామి ఆలయం" ఉంటుంది. సృష్టి కర్త బ్రహ్మ డెవ్వఁడు ప్రతిష్టించిన ఈ లింగ దర్శనం శుభకరం. చక్కని శిల్పకళ ఈ ఆలయ సొంతం. 
గిరివలయంలో దర్శించవలసిన అష్ట దిక్పాలక ఆలయాలలో వరుణ లింగం అనంతరం వాయు లింగం. 
పంచ భూతాలలో జీవుల మనుగడకు అత్యవసరమైనది గాలి. (నా అనుభవం లేదా అనుభూతి చెప్పదలిచాను.  గిరివలయం చేసిన ప్రతిసారీ కొద్దిసేపు ఈ ఆలయం వద్ద కూర్చుంటాను. ఎంతటి చల్లని గాలి వీస్తుందో చెప్పలేను. ఎంత ఎండ ఉండి వాతావరణం ఉక్కబోతగా ఉన్నా సరే ఇక్కడ మాత్రం మందగమనంతో వాయుదేవుడు చరిస్తాడు). 
ఈ క్షేత్రానికి అది దేవత కేతువు. ఈ లింగ దర్శనము వలన ఉదార కోశ, శ్వాశ కోశ మరియు హృదయ సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. 



వరుణ లింగం 
వాయు లింగం 

శ్రీ ఆది అన్నామలై స్వామీ ఆలయం 




వాయు లింగం అనంతరం వచ్చేది చంద్ర లింగం. చంద్రుడు మహేశ్వరుని శిరస్సు నందు స్థిర నివాసమేర్పరచుకొన్న గ్రహం. ఈ కారణంగా స్వామిని సోమశేఖరుడు లేదా చంద్రశేఖరుడు అని పిలుస్తారు. 
చంద్రుడు ప్రతిష్టించిన ఈ లింగాన్ని ఆరాధించడం వలన జీవితంలో ఎదుర్కొనే కష్టనష్టాల కారణంగా ఏర్పడే మానసిక వేదన నుండి ఉపశమనం లభిస్తుంది. అస్థిర పరిస్థితులు తొలగిపోతాయి. మానసిక స్థిరత్వం ఏర్పడుతుంది. ముఖ్యంగా సోమవారం సందర్శిస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చును. 
చంద్ర లింగం తరువాత వచ్చేది కుబేర లింగం. క్షేత్ర అధిదేవత బృహస్పతి (గురువు). విద్యా కారకుడు. అదే విధంగా కుబేరుడు ప్రత్యేకంగా ధనాన్ని సృష్టించాడు.  తన సంపదలను భక్తులకు పంచుతాడని ప్రతీతి. 
ఈ క్షేత్రంలో జరిపించే పూజలు భోగభాగ్యాలను ప్రసాదిస్తాయని భక్తుల విశ్వాసం. 





చంద్ర లింగం 

కుబేర లింగం 


అరుణాచలం 


అష్ట దిక్పాలక లింగాలలో ఆఖరిది ఈశాన్య లింగం. బుధుడు అధి దేవత. ఈశ్యాన్యుడు సప్త రుద్రులలో ఒకడు. 
భూత గణాలకు అధిపతి, దుష్ట గ్రహ ప్రభావాలను తొలగించి శాంతిని ప్రసాదిస్తారు. 
ముఖ్యంగా సంసారంలో, వ్యాపార ఉద్యోగ రీత్యా సమస్యలు ఏర్పడుతున్న తరుణంలో ఈ ఆలయంలో అభిషేకాలు జరిపిస్తే పరిస్థితులు  సవ్యంగా సజావుగా మారుతాయి అని అంటారు. 



ఈశాన లింగం 

శ్రీ అణ్ణామలై స్వామి ఆలయం 
అరుణగిరి నుండి ఆలయ సంపూర్ణ దృశ్యం 
పద్నాలుగు కిలోమీటర్ల గిరివలయం లో నెలకొని ఉన్న అష్ట దిక్పాలక లింగాలను సందర్శించుకొన్న తరువాత దర్శనం శ్రీ అరుణాచలేశ్వరునిదే !!
(గిరివలయం గురించిన వివరణ ఈ బ్లాగ్లో వివరించబడినది)

నమః శివాయ !!!



























Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...