13, ఫిబ్రవరి 2016, శనివారం

Sri Jalakhanteswara Swami Temple, Vellore

                 శ్రీ జలకంఠేశ్వర స్వామి ఆలయం, వెల్లూరు 


  

   భారత దేశంలో ఎన్నో పురాతన కోటలు దర్శనమిస్తాయి. అవన్నీ వివిధ వంశాల రాజులు రాజ్య రక్షణ, ప్రజా క్షేమం కోరి నిర్మించినవి. కొన్ని ఆడంబరాలకు, మరికొన్ని విశ్రాంతి మందిరాలుగా కూడా ఉపయోగించబడినాయి. 
ఎన్నో ప్రత్యేకతలకు ప్రసిద్ది చెందిన అవన్నీ నేడు ప్రముఖ సందర్శక ప్రదేశాలుగా మారి దేశ విదేశ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.    

                                       




అలాంటి వాటిల్లో తమిళనాడు లోని వెల్లూరు, వేలూరు లేదా రాయ వేలూరు గా పిలవబడే ప్రముఖ కూడలి లోని కోట ఒకటి.
భౌగోళికంగా తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ మరియు కర్నాటక రాష్ట్రాలను సరిహద్దులలో ఉంటుందీ పట్టణం.
పూర్వ కాలంలో రాజకీయంగా అత్యంత కీలక సైనిక స్థావరంగా పరిగణించ బడినది.
ఈ ఊరి చరిత్రలానే పేరు కూడా ఎన్నో కధలను తెలుపుతుంది.






క్రీస్తు పూర్వం నుండీ పాలారు నదీ తీరంలో జనావాసాలు ఉండేవని త్రవ్వకాలలో లభించిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.
తమిళ సంగమ కాల రచనల ప్రకారం కొన్ని శతాబ్దాల క్రిందట "వేలన్" అనే వృక్షాలతో నిండి ఉండేదట. అలా వేలూరు వచ్చినది అని పేర్కొనబడినది. వేలన్ అంటే తెలుగులో నల్ల తుమ్మ చెట్టు.







పురాతన తమిళ గ్రంధం "పరిపాడల్ " ప్రకారం ఈ ప్రాంతాన్ని "కురింజి నాడు" అని దీనికి అధిపతి "శ్రీ కుమార స్వామి". ఆయన ఆయుధం "వేల్ ". అలా వేలూరు అని పిలవసాగారు.
ప్రముఖ శివ భక్తుడు, కవి, గాయకుడు అయిన "అరుణ గిరి నాథర్" ఇక్కడికి సమీపంలోని తిరువన్నమలై దివ్య క్షేత్రంలో నివాస మున్నారు.  అక్కడే ఆయనకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్కారం లభించినది. ఆయన కూడా తన కీర్తనలో ఈ క్షేత్రాన్ని వేలూరు అనే ఉదహరించారు.







చాలా కాలం విజయనగర రాజుల అధీనంలో ఉండడం వలన "రాయ వేలూరు " అని కూడా పిలుస్తారు.
ఈ వంశానికి చెందిన సదాశివ రాయలు కట్టించినదే వేలూరు కోట. రాజుగారి ఆదేశం ప్రకారం సామంత రాజైన "చిన్ని బొమ్మ నాయకుడు" 1566 వ సంవత్సరంలో నిర్మించాడు అని శాసనాలు తెలియజేస్తున్నాయి.
అత్యంత ఊహాత్మక, దుర్భేద్యమైన, సంపూర్ణ రక్షణ నిచ్చే కోటగా చరిత్రకారుల ప్రశంసలు పొందిన కోట.





నూట ముప్పై ఆరు ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించిన ఈ కోట చుట్టూ గ్రైనేట్ రాళ్ళతో బురుజులతో కూడిన పటిష్టమైన గోడ నిర్మించారు. గోడ చుట్టూ లోతైన కందకం త్రవ్వించారు. నేటికీ నీటితో నిండి ఉండే ఈ కందకంలో ఒకప్పుడు వేల సంఖ్యలో మొసళ్ళు ఉండేవట. గోడల మీద నిరంతరం సైనిక పహారా ఉండేదిట. నాడు ఉన్న సైనికుల ప్రదేశాలలో సిపాయిల బొమ్మలను ఉంచారు.





గత అయిదు శతాబ్దాలలో విజయనగర రాజులు, సుల్తానులు, మరాఠాలు, నవాబులు చివరగా ఆంగ్లేయులు తమ అధీనంలో ఉంచుకొన్నారు. ప్రస్తుతం పురావస్తు శాఖ వారు స్వాధీనం చేసుకొన్న ఈ కోట ఎన్నో చారిత్రాత్మక సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి.
మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ ఆంగ్లేయులతో జారిన యుద్దంలో మరణించాడు. ఆయన తల్లి, భార్య మరియు కుమారులను ఇక్కడ బంధించారు.





అదే సమయంలో ఇంగ్లీష్ వారి వద్ద సైనికులుగా పనిచేస్తున్న భారతీయులు అనేక అవమానాలకు గురి అయ్యారు.
మత సంబంధిత వస్తువులను ధరించరాదు. విశ్వాసాలకు అతీతంగా మీసం గడ్డం లేకుండా ఉండాలి. తలపాగాలను తీసి వేసి ప్రత్యేకంగా తయారు చేసిన టోపీలను పెట్టు కోవాలి అని అధికారులు ఆదేశించారు.
అదే సమయంలో టోపీలు ఆవు లేదా పండి చర్మాలతో తయారు చేసారు అన్న వార్త ప్రబలింది. అప్పటికే అసహనంతో రాలుగుతున్న సైనికుల సహనం ఈ వార్తతో పూర్తిగా హద్దులు దాటింది.





1806 జూలై పదో తారీకున తిరగబడిన సిపాయిలు ఆంగ్లేయ అధికారులను, సిపాయిలను అంతం చేసి కోటను తమ అధీనం లోనికి తెచ్చుకొన్నారు. నిర్బంధంలో ఉన్న టిప్పు సుల్తాన్ కుమారులను తమకు సారధ్యం వహించమని కూడా కోరారట. కానీ ఆర్కాట్ నుండి తరలి వచ్చిన మరో ఇంగ్లిష్ సైనిక బృందం అత్యంత క్రూరంగా తిరుగుబాటును అణిచి వేశారు.  తిరగబడిన సైనికులను దారుణంగా చంపివేశారు.
ఒకరకంగా ఇది ఆంగ్లేయుల మీద భారతీయుల తొలి తిరుగుబాటుగా పేర్కొనవచ్చును.





టిప్పు సుల్తాన్ కుమారులను కలకత్తా తరిలించారు. ఆయన తల్లి, భార్య కొందరు బంధువులు ఇక్కడే మరణించారు.
శ్రీలంకను పాలించిన ఆఖరి నాయక రాజ వంశపు పాలకుడు "శ్రీ వికారం రాజ సింఘే" ఆంగ్లేయులతో జరిగిన పోరాటంలో ఓడిపోయి పట్టుపడ్డారు. ఆయనను కుటుంబంతో సహా భారత దేశానికి తెచ్చి వేలూరు కోటలో బంధించారు
అనారోగ్యంతో కొన్ని సంవత్సరాల నిర్బంధం అనంతరం ఆయన ఈ కోట లోనే తుది శ్వాస విడిచారు. పాలారు నది వడ్డున ఉన్న "ముత్తు మండపం"లో ఆయన సమాధిని సందర్శించవచ్చును.







ఇలా ఎన్నో చారిత్రక సంఘటనలు చోటు చేసుకొన్న వేలూరు కోటలో మూడు మతాలకు చెందిన ప్రార్ధన స్థలాలు ఉన్నాయి. చర్చిని రాబర్ట్ క్లైవ్ నిర్మించగా, ఆర్కాట్ నవాబు మసీదును ఏర్పాటు చేసారు. మూడవది శ్రీ జలకంటేశ్వర స్వామి ఆలయం, ఎన్నో విశేషాలకు నిలయం.
కోటకు ఎంత చరిత్ర ఉన్నదో అంతకన్నా ఎక్కువ ఈ ఆలయానికి ఉన్నది అని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
తొలుత పల్లవులు, పాండ్యులు, చోళులు ఈ ఆలయ నిర్మాణాన్ని అంచెలంచెలుగా చేపట్టారు.
కోట నిర్మించిన తరువాత చిన్నిబొమ్మి నాయుడు రాజానుమతితో ఆలయ నిర్మాణం చేపట్టారు. అందుకే అణువణువునా విజయనగర నిర్మాణశైలి ప్రస్పుటంగా కనపడుతుంది.








కోటలో దాదాపుగా ఈశాన్య భాగంలో కొద్దిగా క్రిందకి ఉండే ఈ ఆలయానికి అయిదు ప్రాకారాలు ఉంటాయి. 
వెలుపలి ప్రాకారానికి దక్షిణాన ఏడు అంతస్థుల రాజగోపురం దానికి అనుసంధానంగా ఎత్తైన గోడలు. ఈ గోడల మీద నంది మరియు శృంగి బృంగి రూపాలను చెక్కారు. 
రాజగోపురం వద్ద ఆలయ చరిత్రను ఆంగ్ల మరియు తమిళ భాషలలో లిఖించి భక్తుల సౌకర్యార్ధం ఉంచారు. 
రెండో ప్రాకారంలో మరో గోపురం ఉంటుంది. మరో వరుస ప్రహరి గోడలను నిర్మించారు. వాటి మీద కూడా నంది గణపతి, ప్రమధ గణాల రూపాలను చెక్కారు. 






అసలు విశేషం ఈ ప్రాంగణంలోనే ఉన్నది. ముందు తరాల శిల్పులకు ఒక పాఠ్య గ్రంధంగా పరిగణింపదగిన కళ్యాణ మండపం.
దక్షిణ భారత దేశంలోని ఆలయాలలో మధురై ,హంపి, తిరునెల్వేలి, కోయంబత్తూర్ సమీపంలోని పేరూర్ లోని ఈశ్వరన్ కోవెల లలోని కళ్యాణ మండపాలు అత్యంత సుందరమైనవిగా ప్రసిద్ది.
శ్రీ జలకంటేశ్వర స్వామి ఆలయం లోని కళ్యాణ మండపం వాటితో సరి పోల్చతగినది.









యలి లాంటి పురాణ కాల జీవుల నుండి అశ్వాలు, గజాలు, సింహాలు లాంటి మృగాలు, అనేకానేక దేవీ దేవతల రూపాలు, రామాయణ భాగవత దృశ్యాలు ఇలా రాతిని ఒక చిన్న ముక్క కూడా వృధాకాకుండా మలచిన శిల్పులు ఎంత నేర్పరులో కదా అనిపిస్తుంది.











ఈ మండప గొప్పదనాన్ని తెలియచెప్పే ఒక విశేషం స్థానికంగా వినిపిస్తుంది.
ఆంగ్లేయులు ఈ శిల్ప సౌందర్యానికి పరవశులై మండపాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టి ఇంగ్లండు తరలించడానికి పధకం రచించారు. దానికి రాణీ గారి అనుమతి కూడా లభించినదట. కానీ కొన్ని అనుకోని ఘటనల వలన వారు ఈ తరలింపు యత్నాన్ని విరమించుకోన్నారట.









కొద్దిగా ఎత్తులో ఉండే వేదిక పైన చెక్కిన కూర్మ సింహాసనం ఒక అద్భుతం. 
అదే కాదు ఈ మండపానికి అనుబంధంగా ఏర్పరచిన అలంకార మండపాలు మరియు ఆగ్నేయం లో ఉన్న వసంత మండపం దాకా అన్ని వీక్షకులను చకితులను చేస్తాయి. 
పైకప్పుకు చెక్కిన పెద్ద పెద్ద పుష్పాలు మరింత మురిపిస్తాయి. 












అవ్వడానికి ఇది శివాలయం అయినా ఈ మండపంలో ఎక్కువగా శ్రీ మహా విష్ణువుకు సంబంధించిన శిల్పాలు ఉండటం బహుశా విజయనగర రాజులు వైష్ణ సిద్దాంతాన్ని అనుసరించడం కావచ్చును.
అపురూప శిల్పాలను, అతి సూక్ష్మ చెక్కడాలతో నిండిన ఈ మండపాన్ని అంగుళం అంగుళం వర్ణించడం ఎవరికైన అసాధ్యం. సందర్శించడమే మార్గం !

















ప్రదక్షిణ పూర్తి చేసుకొని మూడో ప్రాకారం లోనికి ప్రవేశిస్తే ఎదురుగా విఘ్ననాయకుడు. తొండము కుడి వైపు తిరిగి వుండే ఈయనను "వలంపురి వినాయకుడు" అని పిలుస్తారు. కొలిచినంతనే కోర్కెలు సిద్ధింప చేస్తారని ప్రతీతి.
ఎడమ పక్కన ఉన్న మూడు ఉపాలయాలలొ శ్రీ సిద్ది గణపతి, శ్రీ తిరుమల బాలాజీ, శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి కొలువుతీరి ఉంటారు.





















ఆలయ వాయువ్య భాగంలో అమ్మ వారు శ్రీ అఖిలాండేశ్వరి ఉపస్తితులై దర్శనమిస్తారు.
ఎదురుగా నవ అఖండ దీపాలు వెలుగుతుంటాయి. ఇవి నవగ్రహాలకు ప్రతి అని చెబుతారు.
ఇక్కడ మండపంలో పికప్పుకు కంచి లో మాదిరి బల్లులను చెక్కారు. మనిషికి రెండు రూపాయలు చెల్లించి తాక వచ్చును.
తూర్పు ముఖంగా ఉన్న ఆలయానికి అటు ద్వారం ఉండదు. ఉత్తరం వైపు నుండి ప్రధాన ఆలయం లోనికి ప్రవేశించాలి.
ముఖ మండపంలో నిలువెత్తు ద్వారపాలకులు, నంది.
అర్ధమండపంలో మరో నంది. ఎదురుగా గర్భాలయంలో విరాట్ లింగరూపంలో శ్రీ జలకంటేశ్వర స్వామి.
నేడు ప్రతి నిత్యం  ఎన్నో అభిషేకాలు పూజలు జరుగుతున్న ఈ ఆలయంలో 1981 వ సంవత్సరం వరకూ చాలా సంవత్సరాలు ఎలాంటి పూజలూ జరిగేవి కావు అస్సలు ఎలాంటి దేవతా మూర్తు ఉండేవి కావు అని తెలిస్తే నమ్మశక్యం కాదు. కానీ నిజం. ఎవరి పాలనలో జరిగిందో కానీ అన్ని విగ్రహాలను తీసివేసారు.
భక్తులు ఎన్నో ప్రయాసలు పది చివరి 16. 03. 1981 న పునః ప్రతిష్ట చేసారు.





తూర్పున ధ్వజస్తంభం, నటరాజ మండపం, అరవై మూడు మంది నయమ్మారులు , సప్త మాతృకలు ప్రత్యేక స్థలాలలో దర్శనమిస్తారు.
ఇన్ని విశేషాల శ్రీ జలకంటేశ్వర స్వామి ఆలయం వేలూరు పట్టణం నడి బొడ్డున ఉన్న "కొట్టై " (స్థానికంగా కోట ను అలా అంటారు.)లో ఉంటుంది.
ప్రముఖ కూడలి అయిన "కాట్పాడి" రైల్వే స్టేషన్ కు మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది.అన్ని సదుపాయలు లభిస్తాయి. 





పురాతన నిర్మాణాలు, ఆలయాలు, శిల్పాలను చూడాలి అనే ఆకాంక్ష ఉన్నవారినే కాదు ప్రతి ఒక్కరిని ఆకర్షించే వేలూరు కోట మరియు శ్రీ జలకంటేశ్వర స్వామి ఆలయం తప్పక సందర్శించవలసిన గొప్ప నిర్మాణాలు. 
నమః శివాయ !!!! 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...