11, సెప్టెంబర్ 2015, శుక్రవారం

Manglagiri Temples

                       శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆలయం, మంగళగిరి 

                                              ( మంగళగిరి పానకాల స్వామి ఆలయం )

మన రాష్ట్రంలో వేల ఎకరాల భూములను సస్య శ్యామలం చేసే జీవ నది కృష్ణా  తీరంలో ఎన్నోదర్శనీయ  స్థలాలు

నెలకొని ఉన్నాయి.


వాటిల్లో శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి స్థిర నివాసం ఏర్పరచుకొన్న పంచ నారసింహ క్షేత్రాలు ప్రముఖమైనవి.


అవే వేదాద్రి, మట్టపల్లి, వాడపల్లి, కేతవరం మరియు మంగళగిరి.


లోకాలను కాపాడే క్రమంలో దీనజన భాంధవుడు, ఆర్త రక్షకుడు అసురలను సంహరించి భక్తుల మొరలాలకించి

 అదే ప్రదేశంలో అర్చారూపంలో మానవాళికి అభయ ప్రదాతగా ప్రకటితం అయ్యారు.







ఈ పంచ నారసింహ క్షేత్రాలలో ఒక్కో క్షేత్రానికి ఒక్కో పురాణ గాధ, క్షేత్ర ప్రాముఖ్యత, విశేష చారిత్రాత్మక నేపద్యం


కలిగి ఉన్నాయి. మంగళగిరి మహాత్యం ప్రత్యేకం. ప్రపంచం లోనే అత్యంత పుణ్య ప్రదమైన వైష్ణవ స్వయం వ్యక్త


క్షేత్రాలు ఎనిమిది ఉన్నాయి.


అవి శ్రీరంగం, శ్రీ ముషినం, నైమిశారణ్యం, పుష్కర్, సాలగ్రామం, తోతాద్రి, నారాయణవనం మరియు వెంకటాద్రి.


వీటిల్లోని నాటి  తోతాద్రే నేటి మంగళగిరి. అత్యంత మంగళకరమైన క్షేత్రంగా యుగయుగాలుగా కీర్తించబడుతూ


వస్తోంది.


ఈ క్షేత్రంలో ఉన్న ఎగువ మరియు దిగువ సన్నిధులకు రెండు వేరు వేరు  యుగాలకు చెందిన పురాణ గాధలతో


సంబంధం కలిగి ఉన్నది.











పురాణ కాలంలో "నముచి" అనే రాక్షసుడు విధాత బ్రహ్మ దేవుడు ప్రసాదించిన వర గర్వంతో దేవతలను,

మహర్షులను, భూలోక వాసులను అష్టకష్టాలకు గురి చేయసాగాడు. దేవేంద్రుని సారధ్యంలో దేవతలు మునులు

వైకుంఠము వెళ్లి శ్రీమన్నారాయణుని సహాయాన్ని అర్ధించారు.

ఆయన వారికి అభయమిచ్చి తన సుదర్శన చక్రాన్ని అసురుని మీదకు ప్రయోగించారు. మిరుమిట్లు గొలిపే

కాంతులను వెదజల్లుతూ తన మీదకు వస్తున్న సుదర్శనాన్ని చూసి తనకు ఏ ఆయుధం తోనూ మరణం లేదన్న

విషయాన్ని మరచిపోయాడు నిముచి. భయంతో సప్తలోకాలు తిరగసాగాడు. అతను ఎక్కడికి వెళితే అక్కడికి


చక్రాయుధం వెంటాడింది.






తిరిగి తిరిగి చివరికి భూలోకంలోని ఈ పర్వత గుహ లోనికి ప్రవేశించాడు. అప్పటికే  శ్రీ హరి అక్కడ శ్రీ నార సింహ


రూపంలో ఉన్నారు. లోపలి వచ్చిన అసురుని తన వాడి గోళ్ళతో చీల్చిసంహరించారు.

గగన తలం నుండి ఈ భీకర సమరం చూసిన దేవతలు భువుకి దిగివచ్చి  లోక భీకర రీతిలో ఉగ్రరూపంలో ఉన్న

స్వామి వారిని చూసి భయభ్రాంతులయ్యారు. సృష్టి కర్త ఆకాశ గంగతో అభిషేకం చేసి అమృతాన్ని అందించారు.

అప్పుడు శాంత పడిన నారసింహుడు ముందు యుగాల వారిని కాపాడటానికి తానిక్కడే స్థిరపడుతున్నానని, సత్య
యుగంలో అమృతం, త్రేతాయుగం లో గోఘ్రుతం, ద్వాపరయుగంలో గోక్షీరం, కలియుగంలో పానకం సమర్పించాలని
తెలిపారు.
నాటి నుండి నేటి వరకు స్వామి వారి ఆదేశాల మేరకే జరుగుతోంది.
ఈ గాధ బ్రహ్మ వైవర్తన పురాణంలో పేర్కొనబడినది. శంకరుడు పార్వతీ దేవికి స్వయంగా ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని
గురించి  వివరించినట్లుగా తెలుతోందీ  పురాణం.







పర్వత మధ్య భాగంలో ఉన్న ఎగువ సన్నిధి చేరుకోడానికి సోపాన మరియు రహదారి మార్గాలు ఉన్నాయి. మెట్ల


దారిలో శివాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి, శ్రీ చైతన్య ప్రభువుల పాద మండపం కొన్ని శాసనాలు


కానవస్తాయి. శ్రీ కృష్ణ భక్తులైన శ్రీ చైతన్య ప్రభువులు క్రీస్తు శకం పదిహేను వందల పన్నెండో సంవత్సరంలో

మంగళగిరి క్షేత్రాన్ని సందర్శించుకోన్నారని ఆధారాలు తెలుపుతున్నాయి.

దక్షిణ దిశగా ఉన్న ఆలయ ప్రధాన ద్వారం గుండా గుహ అంతర్భాగం లోనికి వెళితే పదమ దిశగా కొలువుతీరిన శ్రీ


నారసింహ స్వయంవ్యక్త రూపం స్వర్ణ కవచ అలంకరణలో రమణీయ పుష్పాలంకరణలో దర్శనం ఇస్తారు. భక్తులు


తమ శక్తి మేరకు పానకాన్ని సమర్పిస్తారు.అర్చక స్వాములు శంఖంతో ఆ పానకాన్ని స్వామి వారి నోటిలో మూడు

సార్లు పోసి మిగిలినది ప్రసాదంగా భక్తులకు ఇస్తారు.


స్వచ్చమైన మంచి నీరు, బెల్లము, మిర్యాలు మరియు యాలక్కాయల సమ్మేళనంతో చేసే పానకం సత్వ, రాజ,


తమో గుణాలకు సంకేతం. ఈ మధుర రసం నివేదించడం వలన జ్ఞాన సంపద వృద్ది చెందుతుందని పెద్దలు


చెబుతారు.


ఆయుర్వేదం పరిమితం పానక సేవనం వలన మానవ శరీరంలోని  వాత, పిత్త, శ్లేష్మ గుణాలు అదుపులో


ఉంటాయని ఉత్సాహాన్నీ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అని తెలుపుతోంది.


ప్రతి నిత్యం ఎన్నో బిందెల తయారు చేసి సమర్పిస్తున్నా ప్రాంగణంలో ఒక చీమ కానీ ఈగ కానీ లేకపోవడం విశేషంగా


చెప్పుకోవాలి.












స్వామి వారి సన్నిధికి పైన శ్రీ రాజ్య లక్ష్మి అమ్మవారి సన్నిధి ఉంటుంది. పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం నిర్మించారు.


మధ్యలో శ్రీ వీరాంజనేయ స్వామి భక్తులకు అభయం ఇస్తుంటారు.


చిన్న గుహలో అమ్మవారు కొలువై ఉంటారు. శ్రీ లక్ష్మీ దేవి ఈ క్షేత్రంలో జ్ఞాన ప్రదాయని. నిత్యం కుంకుమ పూజ


ఇతర పూజలు మరియు అలంకరణలు అమ్మవారికి చేస్తారు.


అమ్మవారి కోవెల పక్కనే శ్రీ రంగాబాద స్వామి గుహాలయం. ఈ రెండింటికీ మధ్యలో పెద్ద గుహా మార్గం


కనపడుతుంది. ఆ మార్గం నేరుగా కృష్ణా తీరం వరకు వెళుతుందని అంటారు. ప్రస్తుతం మూసివేసారు. కొన్ని


విగ్రహాలను ఉంచారు. ఈ గుహలో ఎందరో భక్తులు గత శతాబ్దంలో తపమాచారించి స్వామి కృపకు పాత్రులైనట్లుగా

తెలుస్తోంది.


ఎగువ సన్నిధిలో మరికొన్ని ప్రత్యేకతలు కనిపిస్తాయి.

సహజంగా వైష్ణవాలయాలలో మూల విరాట్టుకు ఎదురుగా ముఖ మండపం దగ్గర గరుడాళ్వార్ మరియు


ధ్వజస్తంభం నిలుపుతారు. కానీ ఇక్కడ ఈ రెండూ ఆగ్నేయ దిశలో దూరం ఒక విధంగా చెప్పాలంటే  గర్భాలయానికి


వెనక పక్కన ఉంటాయి.


మూలవిరాట్టుకు ఎదురుగా మరో గుహలో  యోగ బంధంలో శ్రీ యోగాంజనేయ స్వామి దర్శనమిస్తారు.


హనుమంతుని విగ్రహాలలో అత్యంత అరుదైన భంగిమలో కనిపించే మూర్తి ఇది.

అంజనా తనయుడే ఈ క్షేత్ర పాలకుడు.









మరో ప్రత్యేకత ఏమిటంటే ఎగువ సన్నిధి ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహాన్నం పన్నెండు గంటల వరకే తెరిచి


ఉండేది. ఈ మధ్య సాయంత్రం నాలుగు గంటల వరకూ పెరుగుతున్న భక్తుల సౌలభ్యార్ధం తెరిచి ఉంచుతున్నారు.


సాయం సంధ్య పూజలు ఇక్కడ ఉండవు. ఆ సమయం దేవతలకు, మహర్షులకు కేటాయించబడినది అని


అంటారు.


ఏ కాలంలో అయినా పర్వత పైభాగం నుండి దినదినాభివృద్ది చెందుతున్న మంగళగిరిని, దూరంగా కనిపించే పచ్చని


పొలాలను, జాతీయ రహదారి మీద వేగంగా దూసుకు పోయే వాహనాలను చూడటం చక్కని అనుభూతిని కలిగించే


దృశ్యాలు.











పర్వత పాదాల వద్ద ఉంటుంది దిగువ సన్నిధి. ఇక్కడ శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి కొలువై ఉంటారు.


మాయా జూదంలో ఓడిపోయి అడవులలో ఉంటూ దేశం నలుమూలల తిరుగుతూ ఇక్కడికి వచ్చి కొంత కాలం

గడిపినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో దిగువ సన్నిధిని  భీమదేవుడు నిత్యం ఆరాధించే శ్రీ లక్ష్మీ నారసింహ


అర్చా మూర్తిని ఉంచి ఆలయాన్ని నిర్మించినట్లుగా పురాణ గాధ. తదనంతర కాలంలో ఎన్నో రాజ వంశాలు, స్థానిక

భక్తులు ఆలయాభివృద్దిలో పాలుపంచుకొన్నారు.




జగద్గురువు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్యులవారు ఎనిమిదో శతాబ్దంలో మంగళగిరి శ్రీ లక్ష్మీ నార సింహుని సేవించారు. 

క్రీస్తు శకం పదిహేనువందల యాభై ఎనిమిదో సంవత్సరంలో నేటి ఒడిషా పాలకులైన శ్రీ సిద్ది రాజు రాజయ్య దేవర 


స్వామిని సందర్శించి ఆలయ నిర్వహణ నిమిత్తం ఎంతో భూమిని దానం చేసారని ముఖ మండపం వద్ద ఉన్న శీలా 


శాసనం తెలుపుతోంది. 

క్రీస్తు శకం పదిహేను వందల తొంభై నాలుగో సంవత్సరంలో గోల్కొండ నవాబు సేనాపతి కుతుబ్ ఆలి స్వామి వారిని 


దర్శించుకొన్నారు. 

దక్షిణ భారత దేశంలో ఎన్నో ఆలయాల నిర్మాణాలకు, అభివృద్దికి ఎంతో పాటుపడిన శ్రీ కృష్ణ దేవరాయలు కూడా 

మంగళగిరి పానకాల స్వామిని దర్శించి సేవించుకొని  దిగువ సన్నిది లోని ప్రస్తుత ముఖ మండపాన్ని నిర్మించారు. 


ఈయన వేయించిన శాసనం ఎగువ సన్నిధికి వెళ్ళే మెట్ల మార్గంలో చూడవచ్చును. 




ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన రాజ గోపురంగా ప్రసిద్ది చెందినా ఈ ఆలయ తూర్పు గోపురాన్ని అమరావతిని


రాజధానిగా చేసుకొని పాలించిన రాజ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పద్దెనిమిది వందల ఏడో సంవత్సరంలో


నిర్మించారు.


దక్షిణ భారత దేశంలో కనిపించే అనేక ఆలయాల రాజగోపురాలకు భిన్నంగా ఉంటుందీ గోపురం. గోపుర ద్వారం


దగ్గర  శ్రీ నాయుడు గారి వర్ణ చిత్రాన్ని చూడవచ్చును.




ఆలయ పురాణ గాధ, చారిత్రిక విశేషాలను సంక్షిప్తంగా రాసి ద్వజస్తంభము వద్ద ఉంచబడినది.

విశాల ప్రాంగణంలో తూర్పు, దక్షిణ మరియు ఉత్తర దిక్కులలో గోపురాలతో, వాటిని కలుపుతూ నిర్మించిన ఎత్తైన


దుర్భేద్యమైన గోడతో కోట లాంటి నిర్మాణం ఇది.


ఏకారణం చేతనో పడమర గోపురం అసంపూర్ణంగా నిలిచిపోయింది.

ప్రదక్షిణా ప్రాంగణంలో శ్రీ కోదండ రామ స్వామి ఉపాలయం దక్షిణం వైపున, శ్రీ మహలక్ష్మీ దేవి ఉపాలయం ఉత్తరం


వైపునా నిర్మించారు.

ముఖమండపం విజయనగర నిర్మాణ శైలి ప్రస్పుటంగా కానవస్తుంది. గాయక భక్తులు, పూజ్యనీయులైన పన్నిద్దరు


ఆళ్వారుల సన్నిధి ఇక్కడే ఉంటుంది.










గర్భాలయంలో ఉపస్థిత భంగిమలో, వామాంకం మీద ఉపస్తితురాలైన  శ్రీ లక్ష్మీ దేవి తో కలిసి రమణీయ


పుష్పాలంకరణ తో శ్రీ లక్ష్మీ నార సింహ స్వామి శాంత సుందర రూపంతో భక్తులకు దర్శనం అందిస్తారు.


నిత్యం నియమంగా నిర్దేశించిన అభిషేకాలు, పూజలు, అలంకరణలు జరుపుతారు.

ప్రతి నిత్యం వందలాది భక్తులు శ్రీవారి దర్శనార్ధం రాష్ట్రం నలుమూలల నుండి తరలివస్తుంటారు.


స్వాతి నక్షత్రం నాడు విశేష పూజలు నిర్వహిస్తారు. నృశింహ జయంతిని వైశాఖ మాసంలో వైభవంగా జరుపుతారు.





















అన్ని హిందూ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మంగళగిరి తిరునాళ్ళుగా ప్రసిద్ది కెక్కిన స్వామి వారి

బ్రహ్మోత్సవాలను ఫాల్గుణ మాసంలో పది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. లక్షలాదిగా భక్తులు పాల్గొంటారు.

మంగళగిరి లో ధనుర్మాస పూజలు, తిరుప్పావై గానం నియమంగా చేస్తారు.  వైకుంఠ ఏకాదశి నాడు లక్షలాది

మంది భక్తులు శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించి, దక్షిణా వృత శంఖంతో ఇచ్చే తీర్ధాన్ని స్వీకరించడానికి

బారులు తీరుతారు.








అత్యంత మంగళకరమైన ఆధ్యాత్మిక అనుభవాలను ఇహపర సుఖాలను  ప్రసాదించే పావన మూర్తి శ్రీ లక్ష్మీ

నారసింహ స్వామి స్థిర నివాసమైన మంగళ గిరి గుంటూరు జిల్లాలో విజయవాడకు వెళ్ళే జాతీయ రహదారిలో

ఉన్నది. ప్రతి పది నిముషాలకు గుంటూరు, విజయవాడ మరియు తెనాలి పట్టణాల నుండి బస్సులు లభిస్తాయి.

కొన్ని ముఖ్యమైన రైళ్ళు కూడా ఇక్కడ ఆగుతాయి.


ఓం శ్రీ లక్ష్మీ నార సింహాయ నమః !!!


































కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...