18, డిసెంబర్ 2014, గురువారం

Kotappakonda

                        చేదుకో____  కోటయ్యా____  చేదుకో 





శుభకరమైన "శివ" శబ్దం సకల చరాచర సృష్టిలోని సమస్త జీవకోటికి ఆధారం.
 రూపరహితుడైన నాగాభరణధరుణికి భూలోకంలో ఎన్నో ఆలయాలు నిర్మించబడినాయి.
పురాణ గాధల ఆధారంగా ఈ పవిత్ర క్షేత్రాలలో చాలా చోట్ల సర్వేశ్వరుడు స్వయంభూ లింగంగా ఉద్భవించినవే !
ఒక్కో క్షేత్రానిది ఒక్కో ప్రత్యేకత.
మిగిలిన వాటికి పూర్తిగా భిన్నమైనదిగా పేర్కొనదగిన మహోన్నత క్షేత్రం ఒకటి మన రాష్ట్రంలో ఉన్నది.








 దేశ నాయకుల, దేవీ దేవతల, చలన చిత్ర తారల పటాలు పెట్టిన పెద్ద పెద్ద ప్రభలు కట్టుకొని ఎడ్ల బండ్ల లేదా ట్రాక్టర్ల మీదో అలంకరించి మేళ తాళాలతో, నృత్య గానాలతో, సంపూర్ణ భక్తిభావంతో తమ గ్రామాల నుండి తండోపతండాలుగా శివరాత్రికి త్రినేత్రుని సేవకు శతాబ్దాలుగా తరలి వస్తున్న క్షేత్రం "కోటప్ప కొండ".  



 




ప్రతి నిత్యం భక్తుల సందడితో కోలాహలంగా ఉండే కోటప్పకొండ శివరాత్రికి మహాద్భుత ఉత్సవ వాతావరణం సంతరించుకొంటుంది. కోటప్ప కొండ తిరనాళ్ల అంటే ఆంధ్రాలో తెలియని వారు లేరంటే అతిశయోక్తి లేదు.
"చేదుకో కోటయ్యా చేదుకో!" అంటూ లక్షలాదిగా కదలి వస్తారు భక్త జనులు.









భక్తులకు అభీష్ట సిద్ధిని ప్రసాదించే అతి ప్రాచీన ప్రసిద్ద శైవ క్షేత్రం కోటప్ప కొండతో ముడిపడి ఉన్న పురాణ గాధ కృత యుగం నాటిదిగా తెలుస్తోంది.  







దక్ష యజ్ఞం కధ అందరికీ తెలిసినదే !
దక్ష ప్రజాపతి అల్లుడైన పరమేశ్వరుని పిలవకుండా తలపెట్టిన యజ్ఞంకి సతీ దేవి వచ్చి అవమానింపబడి తట్టుకోలేక యజ్ఞ గుండంలో దూకినదట. 
విషయం తెలిసిన రుద్రుడు మహోగ్రరూపంతో వీరభద్రుని సృష్టించి గణాలతో పాటు పంపి దక్ష యజ్ఞాన్ని భగ్నం చేసారు. 






గంగాధరుని ఆగ్రహం తట్టుకోలేక దేవతలు మునులు స్తోత్రం చేసి శాంతింప చేసారు. 
శాంతించిన సదాశివుడు బాల వటువు రూపంలో దక్షిణామూర్తిగా త్రికూటాచలంగా పిలవబడే ఇక్కడి రుద్ర శిఖరం మీద  బ్రహ్మాది దేవతలకు, మునులకు, సిద్దులకు, జ్ఞాన భోధ చేసారట.  
సహజంగా జ్ఞాన ప్రదాత అయిన దక్షిణా మూర్తి శివాలయాలలో విమానము మీద, గర్భాలయ వెలుపల దక్షిణా ముఖుడై కొలువై ఉంటారు. 
విద్యను ప్రసాదించే గురు దక్షిణామూర్తి, జ్ఞానదక్షిణా మూర్తి, మేధో దక్షిణామూర్తి, యోగ దక్షిణా మూర్తి ఇలా ఎన్నో పేర్లతో పిలవబడి కొలవబడుతున్నారు. 









సర్వ విద్యలకు మూలం ఈయనే !
కోటప్ప కొండ లో కొలువైన దక్షిణా మూర్తి రూపుడైన త్రికోటేశ్వర స్వామి భక్తుల ఇహలోక అభిలాషలను నెరవేర్చి ముక్తి మార్గం వైపుకు మళ్ళిస్తారన్నది నమ్మిక. 








ఎటునుంచి చూసినా మూడు శిఖరాలుగా కనిపించే త్రికూటాలయం త్రిమూర్తులకు ఆవాసం. 
మధ్యలో ఉన్న రుద్ర శిఖరం పైన స్వామి తొలుత ప్రకటితమైనది, సర్వ దేవతలకు జ్ఞాన భోధ చేసినది.  అందుకే ఇక్కడి లింగాన్ని "పాత కోటయ్య'"అని పిలుస్తారు.
ప్రస్తుతం అక్కడికి కొండలలో నడక దారి ఏర్పాటు చేయబడినది. 









ఆయన ప్రస్తుత స్థానానికి రావడానికి సంబంధించిన కధ కలియుగానిదే!
స్వామి రుద్ర పర్వతం పైన ఉండగా ఆయన సేవా భాగ్యం కోరుతూ శ్రీ హరి తపమాచారించారట. 
సంతుష్టుడైన సర్వేశ్వరుడు ప్రత్యక్షం కాగా శ్రీ మన్నారాయణుడు స్వామిని అక్కడే కొలువు తీరమని అర్ధించారట. 
తన శూలంతో రాతి మీద పొడిచి ఉద్భవించిన జలంలో స్నానమాచరించిన వారి పాపాలు ప్రక్షాళన అవుతాయని తెలిపారు. అందుకని ఆ జలధారను "పాప నాశన తీర్థం" అని అక్కడ ఉన్న లింగేశ్వరుని "పాప నాశేశ్వర స్వామి" అని అంటారు. 



 


ఈశాన్యము లో ఉన్నఈ పర్వతాన్నే "విష్ణు శిఖరం" అంటారు. దూరానికి పాపనాశేశ్వర ఆలయం కనపడుతుంది. 
ప్రస్తుత ఆలయం ఉన్న పర్వతం మీద బ్రహ్మ పరమేశ్వరుని గురించి తపమాచరించి, ప్రత్యక్షం అయిన భక్త సులభుని తన పేరు మీద ఉన్న శిఖరం మీద కొలువు తీరమని కోరగా కలియుగంలో నెరవేరుతుందని తెలిపారట.
కొండ పైకి వెళ్ళే రహదారి పక్కన పెద్ద కమలాసనుని విగ్రహం అమర్చారు. 















కోటప్ప కొండకు వెళ్ళే మార్గంలో కొండకాపూరు అనే గ్రామం ఉన్నది. 
శతాబ్దాల క్రిందట అది పశుపాలకుల గ్రామం. వారి నాయకుడైన సునందుని గారాల పట్టి "ఆనందవల్లి"చిన్నతనం నుండి శివభక్తి కలిగినది. నిరంతరం శివ నామస్మరణ చేస్తూ మిగిలిన పిల్లల చేత కూడా చేయించేది. 
ఒక శివరాత్రి నాడు రుద్ర శిఖరము మీద కొలువైన శ్రీ త్రికోటేశ్వర స్వామిని సందర్శించిన తరువాత ఆమె జీవన శైలి పూర్తిగా మారిపోయినది.
ప్రతి నిత్యం పాపనాశన తీర్ధం నుండి జలాన్ని, ఇంటి నుండి గో క్షీరాన్ని తీసుకొని పర్వతాగ్రం చేరి భక్తి శ్రద్దలతో శివాభిషేకం చేసి ఆ ఆభిషేకజలాన్ని స్వీకరించేది. 
నియమంగా క్షీరాన్ని శివునికి సమర్పించడంతో అందరూ ఆమెను "గొల్ల భామ" అనే వారు ప్రేమతో.  









ఒక నాడు నీటి పాత్ర మీద కాకి వాలడంతో నీరు నేలపాలైనాయి. ఆగ్రహించిన ఆనందవల్లి ఈ క్షేత్రంలో వాయసాలకు స్థానం లేదని శపించినది.

నేటికీ ఇక్కడ వాయస సంచారం కనిపించదు. 

శునకాలు, మార్జాలాలు, మర్కటాలు నిర్భయంగా సంచరిస్తుంటాయి.  కానీ కాకులు మాత్రం కనపడవు. 
భక్తవశంకరుడు బాలిక భక్తికి పరీక్ష పెట్టదలచి పురుష స్పర్శ ఎరుగని ఆమె గర్భవతి అయ్యేలా చేసారు.
కించిత్తు భాద పడక అలానే కొండ పై భాగానికి వెళ్లి శివ పూజ చేసుకొనేది. 







ఆమె దీక్షకు సంతసించిన నంది వాహనుడు యతి రూపంలో దర్శనమిచ్చి భిక్ష కోరారు. ఆమె సంతోషంగా ఇంటికి ఆహ్వానించినది.
దానికి ఆ యతీశ్వరుడు "నువ్వు వెనకకు చూడకుండా వెళ్ళు, నీ వెనక వస్తాను. వెనుకకు చూసావా నేను అక్కడే ఆగి పోతాను" అని హెచ్చరించారట.
శివ నామ స్మరణ చేస్తూ నిండు గర్భిణి నడవలేక నడుస్తూ కొండదిగ సాగినది.
ఆమె వెనక ప్రణవ స్వరూపుడు నడుస్తూ వస్తుంటే సమస్త భువనాలు కంపించేలా దేవదుందుభులు మ్రోగసాగాయి.
దుర్బల శరీరం పైగా గర్భం. అలసటతో ఆగి ఆసక్తితో వెనక్కి తిరిగి చూసినదట.
అంతే యతి అదృశ్యం. ఆకాశం నుండి "నీవు మాట తప్పినందున నేను ఇక్కడే ఆగి పోతున్నాను. ఇదే కలియుగంలో కోటేశ్వరుని నూతన నివాసం. నీవు నాయందు అమరిమిత భక్తి కలిగివున్నందున నీకు ఏమి కావలెనో కోరుకో" అన్న స్వరం వినిపించినదట.
ఆమె తన తప్పిదనానికి చింతించుతూ ప్రాయోపవేశం చేయడానికి నిర్ణయించుకోగా భవబంధనాశనుడు ఎదుట సాక్షాత్కరించి దీవించగా ఆమె గర్భం నుండి శిశువు జన్మించడం వెంటనే అదృశ్యం అవ్వడం జరిగింది. ఆమె అమితానందంతో స్తోత్రం చేసి నిరంతర శివ సాన్నిధ్య యోగం ప్రసాదించమని కోరిందట. అనుగ్రహిస్తూ కైలాసనాధుదు "నీకు ఈ క్షేత్రంలో స్థిరవాసం అనుగ్రహిస్తున్నాను. భక్తులు నిన్ను దర్శించిన తరువాతే నా దర్శనానికి రావలెను" అని తెలిపా రట.
సోపాన మార్గంలో పర్వత పైభాగానికి చేరుకొనే చోట శ్రీ గొల్ల భామ ఆలయం ఉంటుంది. 










భక్తురాలిని అనుగ్రహిస్తూనే గతంలో సృష్టికర్త కు తనిచ్చిన మాట నిలబెట్టుకొన్నారు శ్రీ కోటేశ్వరస్వామి. 








ఎలమందకు చెందిన సాలంకయ్య శివ భక్తితత్పరుడు. కోటప్ప కొండలలో కట్టెలు కొట్టి తెచ్చుకొని అమ్మి వచ్చిన దానితో  సాదు సంతుల సేవ చేసుకొంటూ సంతృప్తిగా జీవనం సాగించేవాడు. 
ఒకనాడు రుద్ర శిఖరం మీద లింగాన్ని సేవించుకొని వస్తుండగా ఒక జంగమ దేవర కనిపించగా ఆయనను  సాదరంగా తన గృహానికి ఆహ్వానించాడు. 
ఆయన కొంతకాలం సాలంకయ్య ఇంటిలో ఉండిపోయారు. కేవలం పాలను మాత్రమే స్వీకరించేవారు. 
ఆయన అక్కడ ఉండగానే సాలంకయ్యకు అడవిలో నిధి లభించినది. 
అతను అంతా కోటయ్య కృప అని తలచాడు. 
ఒకనాడు అతిధి జంగమయ్య ఇంట లేకపోవడంతో కొండా కోనా గాలించిన సాలంకయ్య అలసి పోయి అడవిలో సొమ్మసిల్లి నిద్ర లోనికి వెళ్ళగా స్వప్న దర్శనమిచ్చి "నీ ఇంట ఆతీద్యం తీసుకొన్న జంగమయ్యను  నేనే! మీ అందరి కోసం బ్రహ్మగిరి లో కొలువుతీరాను. నీవక్కడ కోవెల నిర్మించు " అని తెలిపారట.   

 













శివాజ్ఞ మేరకు సాలంకయ్య ఆలయాన్ని నిర్మించి తన సోదరులతో మిగిలిన కుటుంబ సభ్యులతో ఆజన్మాంతం  సర్వేశ్వరుని సేవలో గడిపి కైలాసం చేరుకొన్నాడు.
గర్భాలయం వెనుక సాలంకయ్య లింగ మరియు మండపం చూడవచ్చును.









అలా తోలి ఆలయ నిర్మాణం జరిగినది. తదనంతర కాలంలో చోళులు, శాతవాహనులు, చాళుక్యులు, విజయనగర రాజులు, ఎందరో జమిందారులు ఆలయాభివ్రుద్దికి తమ వంతు కృషి చేసినట్లుగా లభించిన శాసనాలు తెలుపుతున్నాయి.












స్వామి బాల వటువు గనుక ఇక్కడ అమ్మవారి సన్నిధి ఉండదు.
పర్వతం పైన ఎన్నో తీర్దాలు లింగాలు ఉంటాయి అంటారు.
ఉపాలయాలలొ శ్రీ మేధో దక్షిణామూర్తి, శ్రీ గణపతి, శ్రీ కార్తికేయ, శ్రీ గొల్లభామ, నాగ పుట్ట ఉంటాయి. ధ్యాన మందిరం, అన్నదాన మండపం, ఉత్సవ మండపం కూడా నిర్మించారు.
కానీ ధ్వజస్తంభం ఉండదు.























పర్వత పాదాల వద్ద శ్రీ వినాయక, శ్రీ బొచ్చు కోటయ్య శ్రీ ప్రసన్న కోటేశ్వరుడు, శ్రీ నీలకంఠ స్వామి, శ్రీ విజయసిద్ది గణపతి, శ్రీ శనేశ్వర, శ్రీ రామ, శ్రీ షిరిడి సాయి ఆలయాలు ఉంటాయి. 
మెట్ల మరియు రహదారి మార్గంలో కొండ పైకి చేరుకొనవచ్చును. 
రమణీయ ప్రకృతి కోటప్ప కొండ సొంతం. 








ఒకప్పుడు కనీస వసతులు కూడా లేని కోటప్ప కొండ నేడు యాత్రీకులకు సంపూర్ణ ప్రశాంత యాత్రా ఫలం దక్కే విధంగా అభివృద్ధి చెందినది. 
రహదారిని సుందరంగా తీర్చిదిద్దారు. పిల్లలకు మనోల్లాసం కలిగించేవిధంగా ఉద్యానవనాలు, జంతు ప్రదర్శనశాలలు, ఆట స్థలాలు  నిర్మించారు.  
దారిలో బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు, ముగురమ్మల సుందర రూపాలు, పైన శ్రీ గణపతిని నిలిపారు. 
నేడు కొండపైన ఉండటానికి అతిధి గృహాలు నిర్మించబడినాయి. 










దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అన్నప్రసాదం లభిస్తుంది. 
కొండ క్రింద అన్ని కులాలకు చెందిన సత్రాలు ఉన్నాయి. భక్తులకు ఉచిత భోజన మరియు వసతి సౌకర్యం అందిస్తారు. 















































ప్రతినిత్యం వందలాదిగా, పర్వదినాలలో వేలాదిగా, శివరాత్రికి లక్షలాదిగా భక్తులు అన్ని ప్రాంతాల నుండి "చేదుకో .... కోటయ్యా ..... ఆదుకో " అంటూ కోటప్ప కొండ చేరుకొంటారు. 













ఈ క్షేత్రం ఈ నాడు ఇంత అభివృద్ధి చెందడానికి ముఖ్య కారకులు మన రాష్ట్ర శాసన సభా పతి గౌరవనీయులు  డాక్టర్ కోడెల శివ ప్రసాదు గారు. వారికి భక్తలోకం తరుపున నమస్సుమాంజలులు. 












ప్రతి నిత్యం నియమంగా అభిషేకాలు, అలంకరణలు చేస్తారు. ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు ఆలయం భక్తుల సౌలభ్యం కొరకు తెరిచి ఉంటుంది. సోమవారాలు, పౌర్ణమి రోజుల్లో, మాస శివరాత్రి, కార్తీక మాసంలో, పెద్ద సంఖ్యలో భక్తులు  శ్రీ కోటేశ్వర స్వామి దర్శనార్ధం వస్తుంటారు. 
శివరాత్రి నాడు వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుండి కూడా వస్తారు.   ఎంతో  ప్రశస్థ్య క్షేత్రం అయిన కోటప్ప కొండ  గుంటూరు జిల్లా లోని నరసరావు పేటకు పదు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 
నరసరావుపేట కు రాష్ట్రం నలుమూలల నుండి బస్సు లేదా రైలు మార్గంలో సులభంగా చేరుకొనవచ్చును. 







నమః శివాయ !!!!!










కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...