21, ఏప్రిల్ 2014, సోమవారం

Thiruvalangadu Temples


      శ్రీ వడారన్యేశ్వర స్వామి ఆలయం - తిరువలంగాడు 







సర్వేశ్వరునికి ఎన్నో ఆలయాలు ఇలలో ఉన్నాయి. 
పంచ భూత క్షేత్రాలు, పంచారామాలు, నవ కైలాసాలు, అష్ట వీరట్ట స్థలాలు ఇలా ఎన్నో ఉన్నాయి. 
వాటిల్లో ఒక వరుస ఆలయాలు పంచ నాట్య సభలు. 
శివుడు తన ఆనంద తాండవాన్ని ప్రదర్శించిన అయిదు క్షేత్రాలనే పంచ నాట్య సభలు అంటారు. 
అవే తిరువలంగాడు (రత్న సభ ), చిదంబరం ( కనక సభ ), మదురై (వెండి సభ), తిరునల్వేలి ( తామ్ర సభ), కుర్తాళం (చిత్ర సభ). 
ఒక్కో క్షేత్రంలో ఒక్కో భంగిమలో ఉత్సవ మూర్తి నటరాజ స్వామి దర్శనమిస్తారు.







                                    కుర్తాళం, మదురై, తిరువలంగాడు, చిదంబరం, తిరునల్వేలి 








ఈ సభల వెనుక ఉన్న పురాణ గాధ ఒకటే !
పాలకడలిలో నిరంతరం శ్రీ మహా విష్ణువుకు పాన్పుగా ఉండే ఆదిశేషువుకు ఒకనాడు స్వామి హటాత్తుగా బరువు పెరిగినట్లుగా అనిపించినది. 
అదే విషయాన్ని శ్రీ హరికి తెలిపి, కారణమడిగాడు. 
చిద్విలాసంగా నవ్వి మనో నేత్రంతో నట రాజ ఆనంద తాండవం  వీక్షిస్తున్నానని, ఆ మనోహర నాట్యం కలిగించిన సంతోష కారణంగా తన బరువు పెరిగినట్లుగా తెలిపారు. 
విన్న నాగరాజుకి నటరాజ నృత్యం చూడాలన్న ఆకాంక్ష కలిగింది. 
శ్రీ మన్నారాయనుని సలహా మేరకు పతంజలి మహర్షి రూపంలో భూలోకానికి వచ్చి  వ్యాఘ్ర పాద మహా ముని తో కలిసి దీర్ఘ కాలం తమాచారించిన తరువాత పరమేశ్వర అనుగ్రహంతో ఆయన అద్భుత సుందర ఆనంద తాండవం వీక్షించే'సదవకాశం లభించినది.
ఇది మూల కధ.
కాకపొతే అయిదు సభలలో నృత్యం చేయడానికి సంబంధించి వేరు వేరు గాధలు ప్రచారంలో ఉన్నాయి.
తిరువలంగాడు ప్రాంతంలో ఒకప్పుడు సుంబ, నిసుంబ అనే అసురులిద్దరు అనేక విధములుగా ప్రజలను, మునులను ఇక్కట్లకు గురిచేస్తూ ఉండటంతో వారంతా కైలాసమెగి పార్వతీ దేవిని శరణం కోరారు.
ఆమె వారికి అభయం ఇచ్చి తన శక్తులతో భద్రకాళిని సృష్టించినది.
భద్రకాళి భూలోకానికి వచ్చి రాక్షసులను సంహరించి ఇక్కడే ఉండిపొయినది.
తదనంతర కాలంలో మంజు కేశ మహర్షి కోరిక మేరకు ఈ క్షేత్రంలో స్థిర నివాసం ఉండ తలిచారు గంగాధరుడు. అప్పటికే అక్కడ స్థిరపడిన భద్రకాళి తనను నాట్యంలో ఓడిస్తే ఇక్కడ ఉండవచ్చును లేకుంటే లేదు అన్న షరతు విదించినది. ఇరువురి మధ్యా అద్భుత రీతిలో నృత్య సమరం సాగింది.
అపరిమిత వేగంతో అనేక భంగిమలను నటరాజు ప్రదర్శిస్తున్నప్పుడు కర్ణాభరణం నేల మీద పడగా దానిని తన ఎడమ కాలితో తీసి నాట్యం ఆపకుండానే అలానే చెవికి పెట్టుకొన్నారు.
దీనినే ఊర్ధ్వ తాండవ భంగిమ అన్నారు. ఇక్కడి ఉత్స విగ్రహం ఇదే భంగిమలో ఉండటం విశేషం.
స్త్రీ అయినందున ఆ విధమైన భంగిమ ప్రదర్శించడానికి సిగ్గుపడినా ఆయన అపూర్వ నాట్యానికి తన ఓటమిని అంగీకరించి ఆ ప్రాంత భాద్యతలను భవనాశనునికి అప్పగించినది.
ప్రతిగా ఈశ్వరుడు ఆమెను సందర్శించిన తరువాతనే తన దర్శనానికి రావాలి అని అన్నారు.
అందుకే ముందుగా భద్రకాళి ని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది.
ఈ ఆలయం ప్రధాన ఆలయానికి వాయువ్య దిశలో పుష్కరణికి సమీపంలో ఉంటుంది.











ఆలయ ప్రవేశ ద్వారం దక్షిణ దిశగా ఉన్నా అమ్మవారు ఉత్తరాముఖిగా దర్శనమిస్తారు.














శ్రీ వడారన్యెశ్వర స్వామి వారి తొలి ఆలయం అయిదవ శతాబ్దం నుండి ఉన్నదని శాసన ఆధారాలు లభించాయి.







ప్రస్తుత నిర్మాణం చోళ రాజులు పన్నెండవ శతాబ్దంలో కట్టించినది.   వారి కాలంలో అనేక మడులు మాన్యాలు ఆలయ నిర్వహణ నిమిత్తం ఇచ్చినట్లు తెలిపే శాసనాలు ఆలయ గోడలపైన ఉంటాయి.
తదనంతర కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన అనేక రాజ వంశాలు ఆలయాభివ్రుద్దికి తమ వంతు కృషి చేసాయి. విజయనగర సార్వభౌముడు శ్రీ కృష్ణ దేవరాయలు శ్రీ వడారన్యెశ్వర స్వామిని సేవించి అనేక కానుకలు సమర్పించుకొన్నారు అని తెలుస్తోంది.


   





విశాల స్థలంలో నిర్మించిన ఆలయ సముదాయం మొత్తం ఎత్తైన ప్రాకారంలో అయిదు అంచెలలో ఉంటుంది. 











తూర్పున మాత్రమే ఉన్న ప్రవేశ ద్వారం ఉంటుంది. ప్రవేశ ద్వారాన్ని, రాజ గోపురాన్నికలుపుతూ నిర్మించిన ఎత్తైన తొలి ప్రాకారం మొదటిది. 
చిన్న స్వాగత ద్వారానికి ఇరుపక్కలా పెద్ద పెద్ద అరుగులు, కుడి పక్క దాని మీద పెద్ద గణేష మూర్తిని ఉంచారు. 
లోపలి ప్రవేశించిన తరువాత కుడి పక్కన ఆలయ కార్యాలయము, ఎడమ వైపున వాహన శాల కనిపిస్తాయి. దీనిని  రెండో ప్రాకారంగా పరిగణించవచ్చును.  















ఇక్కడే అయిదు అంతస్తుల రాజ గోపురం సుందర శివ లీలల శిల్పాలతో సగర్వంగా భక్తులకు స్వాగతం పలుకుతుంది. గోపురానికి ఇరుప్రక్కలా శివ పార్వతుల ప్రియ పుత్రులైన వినాయక, కుమార స్వామి కొలువుతీరి దర్శనమిస్తారు. అష్ట భుజ వల్లభ గణపతి కుడి పక్కన, వల్లీ దేవసేన సమేత పన్నెండు చేతుల, ఆరు శిరస్సుల షణ్ముఖుడు కొలువుతీరి ఉంటారు. ఈ ఆలయంలో వీరిరువురకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడినది. ఎన్నో సన్నిధులలొ వివిధ భంగిమలలో వీరు కొలువు తీరి   కనపడతారు. 











రాజ గోపుర ద్వారానికి చెక్కబడిన సుందర శిల్పాలు కనువిందు చేస్తాయి.  













మూడో ప్రాకారం లో బలి పీఠం, ధ్వజస్తంభం, నంది మండపం వరసగా కనపడతాయి. 
ఎడమపక్కన ఉత్సవ మండపం, కుడి వైపున కొన్ని పురాతన మూసివేసిన నిర్మాణాలు  బహుశా   ఒక్కప్పుడు పరి వార దేవతల సన్నిధులై ఉంటాయి. నాలుగో ప్రకారం లోనికి దారి తీసే చిన్న  గోపురానికి ఇరుపక్కలా శివ కళ్యాణ దృశ్యాలను మనోహరంగా మలచారు. 






























నాలుగో ప్రాకారంలో ఎదురుగా ప్రధాన ఆలయం లోనికి దారి తీసే ద్వారం పైన అయిదు నాట్య సభల నటరాజ రూపాలను చక్కగా నిలిపారు.
చిదంబర ఆలయాన్ని తలపించే పెద్ద గుమ్మటం (ఉత్సవ మూర్తుల సన్నిధి ) కూడా స్పష్టంగా కనపడుతుంది.
కుడిపక్కన అమ్మవారు శ్రీ వండారు కులై అమ్మన్ సన్నిధి.  ముఖ మండపానికి రెండు వైపులా ఉన్న స్థంభాలకు గణేష మరియు సుబ్రహ్మణ్య స్వామి రూపాలను చెక్కారు.
వాటిని ప్రత్యేకంగా ఛిన్నగుడిగా రూపొందించారు. (చిత్రంలో చూడండి )
గర్భాలయంలో అమ్మవారు ఉపస్థిత భంగిమల స్వర్ణ ఆభరణ భూషితగా భక్తుల గాచే అమ్మల గన్న అమ్మగా ప్రసన్న రూపంతో కొలువై ఉంటారు.








ఎడమ వైపున పురాతన మండపాలు ఉంటాయి. 
ప్రదక్షిణా పధంలో సుందర శిల్పాలతో నిండిన రాతిమండపం, ఆలయ వృక్షం అయిన మర్రి చెట్టు క్రింద నాగ ప్రతిష్టలు, శివ లింగం, నంది ఉంటాయి. ఊడలకు మహిళలు తల్లి కావాలన్న కోర్కెతో పమిట చెంగుతో ఊయలలు కడతారు. ఇక్కడ ఒక నాట్య మండపాన్ని నూతనంగా నిర్మించారు. యాగ శాల కూడా ఉంటుంది.


























ప్రదక్షిణలు పూర్తి చేసుకొని లోనికి ప్రవేశించితే చక్కని శిల్పాలతో కూడిన స్తంభాలు కనపడతాయి. మండప స్తంభాల పైన  శివ పురాణ, రామాయణ ఘట్టాలను, భక్త కన్నప్ప, మార్కండేయ లాంటి భక్తుల, సాధువుల, సప్త ఋషుల శిల్పాలను చెక్కారు. 
కుడిపక్కన మండపంలో ఉండే ఉత్సవ విగ్రహాలకు మొక్కి  ముందుకు వెళితే గర్భాలయానికి ఉన్న ప్రదక్షిణా పధం చేరుకొంటాము. అక్కడి మండపాలలో నయన్మారులు, సిద్దులు, వివిధ నామాల, రూపాల శివలింగాలు,శ్రీ వీర భద్రుడు,గణపతి, శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య  స్వామి, షణ్ముఖుడు, శ్రీ గజ లక్ష్మి, శ్రీ మహా విష్ణువు కొలువుతీరి కనపడతారు. గర్భాలయ      వెలుపలి గోడలలో శ్రీ దక్షిణా మూర్తి, శ్రీ తాండవ గణపతి, శ్రీ హరి, శ్రీ దుర్గ, శ్రీ చెండీశ్వరుడు ఉంటారు. 
గర్భాలయంలో   శ్రీ వడారన్యెశ్వర స్వామి లింగ రూపంలో ధవళ వర్ణ వస్త్రాలను ధరించి చందన,  వీభూధి కుంకుమ లేపనాలతొ పాటు వివిధ వర్ణ పుష్ప మాలాలంకృతులై దివ్య మంగళంగా దర్శనమిస్తారు.
ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు నిరవధికంగా భక్తుల సందర్శనార్ధం తెరిచివుండే ఆలయంలో ప్రతి నిత్యం ఎన్నో అభిషేకాలు, అర్చనలు, పూజలు నియమంగా జరుగుతాయి. మాస శివరాత్రి, ప్రదోష పూజలు విశేషంగా జరుగుతాయి. 
ప్రతి రోజు వివిధ ప్రాంతాల నుండి భక్తులు రోజూ  స్వామి దర్శనార్ధం తరలి వస్తుంటారు. 
ముఖ్యంగా భరణి నక్షత్రంలో జన్మించిన వారు సంవత్సరానికి ఒకసారైనా ఈ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు పొందుతారు. 
ఆలయానికి వెనుక పెద్దదైన పుష్కరణి కలదు. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి వారికి తెప్పోత్సవం ఇక్కడే జరుగుతుంది. 








పుష్కరణి పక్కన శ్రీ ధర్మరాజ స్వామి ఆలయం ఉంటుంది.
గర్భాలయంలో సుక్షత్రియ వేష ధారణలో పాండవాగ్రజుడు కొలువై ఉంటారు.












విశిష్టమైన ఆలయాలలో ఒకటిగా మరియు పంచ నాట్య సభలలో అగ్రస్థానంలో ఒకటిగా గుర్తింపు పొందిన తిరువలంగాడు ఆలయం చెన్నైకి సుమారు యాభై కిలో మీటర్ల దూరంలో ఉన్నది.
చెన్నై అరక్కోణం మార్గంలో వెళ్ళే అన్ని లోకల్ ట్రైన్స్ ఇక్కడ ఆగుతాయి.
అరక్కోణానికి మూడు స్టేషన్ల ముందు వస్తుంది. రైల్వే స్టేషన్ నుండి ఆలయం అయిదు కిలో మీటర్లు. సదుపాయాలు అంటూ ఏమీ లభించవు. స్టేషన్ దగ్గర ఫలహారం అమ్మే చిన్న హోటళ్లు రెండు ఉంటాయి.
స్టేషన్ నుండి ఆలయం చేరుకోడానికి ఆటోలు లభిస్తాయి. యాత్రికులు చెన్న లేదా అరక్కోణం నుండి వెళ్లి రావడం ఉత్తమం.



నమః శివాయ !!!

1 కామెంట్‌:

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...