4, ఏప్రిల్ 2014, శుక్రవారం

Sri Ram Temple, Kota ( Rajasthan )

                              "కోట"లో కొలువైన కోదండ రాముడు 

భారతీయులు దైవ భక్తిపరులు. 
ముఖ్యంగా తన ప్రజలను కన్నబిడ్డల మాదిరి పాలించిన రఘుపతి అంటే అంతులేని ఆరాధన. 
అందుకే తమను రామునిలా పాలించే పాలకుడు రావాలని, వచ్చి రామ రాజ్యం నిర్మించాలని  కోరుకొంటూవుంటారు.
రామ రాజ్యం కోసం కలలుకంటూ, ఆ కలలను నిజం చేయమంటూ కళ్యాణరాముని వేడుకోటానికి  ఆలయాలను  నిర్మించుకోవడం మొదలు పెట్టారు.
బహుశా ఈ కారణం వల్లనేమో రామాలయం లేని ఊరు మన దేశంలో కనిపించదు.
సాధారణ ఆలయాలుగా స్థాపించబడిన వాటిల్లో కొన్ని వివిధ కారణాల వలన ప్రత్యేకతలను సంతరించుకొని జన బాహుళ్యంలో విశేష గుర్తింపును పొందాయి.
అలాంటి వాటిల్లో ఒకటి రాజస్తాన్ రాష్ట్రం లోని ప్రముఖ వ్యాపార మరియు విద్యా కేంద్రం అయిన "కోట" లో నెలకొని ఉన్నది.
ప్రజలకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం వహించటమే కాకుండా అనేక ఇతర విషయాలలో కూడా సహాయకారిగా నిలబడటం పేర్కొనదగ్గ అంశం.
వస్త్రాలకు మరో పేరైన "కోట " చదువులకు కూడా ప్రసిద్ది.
చంబల్ నదీతీరం ఉంటుందీ పట్టణం.
సుమారు వంద సంవత్సరాలకు పూర్వం స్థానికుల హృదయాలలో కలిగిన స్పందనకు ప్రతిరూపమే ఈ మందిరం.
అప్పట్లో చిన్న భజన కేంద్రంగా ఆరంభించబడి భక్తులకు లభించిన అనేక శుభ అనుభవాల వలన నేడు ఒక సంస్థానంగా రూపుదిద్దుకొన్నది.
పట్టణంలోని అనేక మంది ప్రతి నిత్యం నియమంగా క్రమం తప్పకుండా ఇక్కడికి వస్తారు.
సమీప గ్రామాల నుండి వ్యాపార అవసరాల నిమిత్తం కోట వచ్చే ప్రతి ఒక్కరూ మొదట ఈ మందిరాన్ని సందర్శించిన తరువాతే తమ పనులను ఆరంభిస్తారు అంటే ఇక్కడ కొలువైన శ్రీ కోదండ రాముని మీద వారికున్న భక్తి విశ్వాసాలను అర్ధం చేసుకొనవచ్చును.


సువిశాల ప్రాంగణంలో నిర్మించబడిన అనేక నిర్మాణాలుంటాయి.


సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రునితో పాటు అనేక మంది దేవీ దేవతలు కొలువుతీరి కనపడతారు.
ప్రధాన అర్చనా మూర్తులతో పాటు విఘ్ననాయకుడు, శ్రీ లక్ష్మీనారాయణులు, శ్రీ పార్వతి సమేత గౌరినాధుడు తూర్పు ముఖంగాను, శ్రీ దుర్గా మాత, శ్రీ వీరాంజనేయ, శ్రీ సంకట మోచన హనుమాన్ దక్షిణ ముఖంగాను పాలరాతి మందిరాలలో కొలువుతీరి దర్శనమిస్తారు.
శ్రీ వీరాంజనేయ స్వామి సింధూర వర్ణం పోసిన రాతిలోను, శ్రీ సంకట మోచనుడు పాలరాతి విగ్రహ రూపంలో ఉండటం ఒక ప్రత్యేకత.

దక్షిణాదిన మాదిరి ధ్వజస్తంభం, బలిపీఠము, నమస్కార మండపాలు ఉత్తరాదిన అన్ని ఆలయాలలో కనిపించవు.
మందిర గోపురము పైన పతాకాన్ని ఎగురవేస్తారు.
 పాల రాతి విగ్రహాలకు వివిధ వర్ణ పట్టు బట్టలతో రమణీయంగా అలంకరించుతారు.


ప్రస్తుత సీత లక్ష్మణ హనుమత సమేత శ్రీ రామ విగ్రహాలను రెండు సంవత్సరాల క్రిందటే ప్రతిష్టించారు.
శతాబ్ద కాలంగా పూజలందుకొంటున్న చిన్న విగ్రహాలను మందిరంలో ఉంచి పూజలను కొనసాగిస్తున్నారు.
ఈ మందిరంలోని మరో ప్రత్యేకత రస లింగం.
అభిషేక ప్రియుడైన సదా శివుడు వివిధ లింగ (సైకత, శిల, స్పటిక) రూపాలలో ఉంటారు అన్న విషయం తెలిసినదే!
ఒక్కో లింగారాదనలో ఒకో రకమైన పలితం లభిస్తుంది అని పెద్దలు చెబుతారు.
వీటికి భిన్నంగా తంత్ర ప్రధాన పూజా విధానంలో శీఘ్రంగా కరుణించే పరమేశ్వరుని లింగం " రస లింగం" అని తెలుస్తోంది. అలాంటి అరుదైన రస లింగాన్ని ఇక్కడ ప్రతిష్టించారు.


రాజస్థాన్ లోని ఒకే ఒక్క రసలింగానికి భక్తులు నేరుగా అభిషేకాలు, పత్ర పుష్పార్చన చేసుకొనే సౌకర్యం ఉన్నది.
ఆలయ ఉత్తరం పక్కన యాగ శాల కలదు. అక్కడే రెండు ఉపాలయాలు ఉంటాయి.
ఒక దానిలో శ్రీ శని భగవానుడు కొలువై ఉంటారు.
చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే "శని భగవాను"ని వాహనం "వాయసం" ( కాకి ) అని అందరికి తెలిసిన సంగతే!
ఇక్కడ ఆయన తన సోదరుడైన  యమధర్మ రాజు వాహనం అయిన "మహిషం" (దున్నపోతు ) మీద కూర్చొని భక్తులకు అభయ వర ప్రధానం చేస్తున్న భంగిమలో దర్శనమిస్తారు.


అపమృత్యు భయాన్ని, అన్ని గ్రహ సంబంధిత దోషాలను తొలగించే వాడని స్థానికుల నమ్మకం.
రెండో మందిరంలో స్థానికంగా "భేరూ నాథ్" గా పిలిచే శ్రీ కాల భైరవ స్వామి కొలువు తీరి ఉంటారు.
ఈయనకు ప్రత్యేక రూపం అంటూ ఉండదు.
రాతికి వెండి రంగు అలిమి దానిమీద ముఖాన్ని రూపొందించారు.  పక్కనే ఆయుధం అయిన గద కూడా ఉంటుంది.


ఒక ప్రణాళిక ప్రకారం నిర్మించిన మందిర భవన సముదాయంలో విచ్చేసే సాదు సంతులు సేదతీరడానికి విశ్రాంతి గదులు, ప్రజలు, విద్యార్ధులు విషయజ్ఞానం పెంచుకోడానికి ఎన్నో గ్రంధాలతో కూడిన పుస్తక భాండారం, ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగిన వారు పాలుపంచుకోడానికి శ్రీ మాధవ సత్సంగ భవనము ఉన్నాయి.
ఆరోగ్యమే మహా భాగ్యం మరియు  మానవ సేవే మాధవ సేవ  అన్న నానుడులను పూర్తిగా నమ్మిన ట్రస్ట్ పెద్దలు అనారోగ్యంతో భాదపడే వారి కొరకు ఉచిత వైద్య శాలను ఏర్పాటు చేసారు.
ప్రతినిత్యం ఎందరో రోగులు స్వస్థత పొందటానికి ఇక్కడికి వస్తుంటారు.
అనుభవజ్ఞులైన నిపుణులైన  వైద్యులు ప్రతి రోజు కొంత సమయం ఇక్కడ రోగులకు అందుబాటులో ఉంటారు.
ట్రస్ట్ పెద్దల ముందు చూపును అభినందించాలి.
 ఎలాంటి ఆర్ధిక ఒడుదుడుకులకు లోను కాకుండా నికర ఆదాయం వచ్చేందుకు మందిర బయట దుకాణాలను నిర్మించి అద్దెకు ఇచ్చారు.
ఉదయం ఆరుగంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు నిరంతరాయంగా భక్తుల కొరకు తెరిచి ఉండే మందిరంలో నియమంగా నాలుగు హారతులు, వివిధ పూజలు జరుపుతారు.
గణేశ చతుర్ధి, శివరాత్రి, దేవి నవ రాత్రులు, దీపావళి, హోళీ, శ్రీ హనుమత్జయంతి, శ్రీ రామ నవమి మరియు కృష్ణాష్టమి లాంటి పర్వ దినాలలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు.
ఈ ఆలయం కోట నగర రైల్వే స్టేషన్కు అత్యంత సమీపంలో ఉంటుంది.
దేశం లోని అన్ని నగరాల నుండి రైలు సౌకర్యం కలదు.
అన్ని వసతులు లభిస్తాయి.
జై శ్రీరాం !!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...