23, ఫిబ్రవరి 2014, ఆదివారం

Thirukodithanam - Sri Maha Vshnu Temple


     తిరుక్కోడిట్టానం - శ్రీ అద్భుత నారాయణ ఆలయం 





చెంగనూర్ పరిసర ప్రాంతాలలో ఉన్న పంచపాండవ నిర్మిత ఆలయాలుగా పేరొందిన అయిదు ఆలయాలలో నాలుగవది "తిరుక్కోడిట్టానం". మాద్రి కుమారులలో ఒకరైన సహదేవుడు నిర్మించిన ఆలయంగా ప్రసిద్ది చెందినది. ఆలయంతో ముడిపడి ఉన్న పురాణ గాధ ఏకాదశి వ్రత మహిమను తెలిపేది. 
తొలి యుగ సమయంలో సూర్య వంశానికి చెందినా రుక్మాంగదుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించేవాడట. ప్రజలను కన్నబిడ్డల మాదిరి చూసుకొనే ఆయన మహా విష్ణు భక్తుడు. 
పరమాత్మ పూజ కోసం ఒక పూల తోటను ఏర్పాటు చేసుకొన్నాడు. త్రిలోక సంచారి అయిన నారద మహర్షి రాజు వద్దకు వచ్చారు. నిరంతర నారాయణ జప దారి, బ్రహ్మ పుత్రుడు, జ్ఞాని అయిన దేవఋషికి  తగిన స్వాగత సత్కార్యాలు చేసి ఆయన కంఠంలో తన ఉద్యాన వనంలోని పూలతో అల్లిన దండను అలంకరించాడు మహారాజు. 
అక్కడ నుండి నారదుడు ఇంద్ర సభకు వెళ్ళగా దేవేంద్రుడు ఆ మాలను చూసి "ఇంతటి రమణీయ పుష్పాలు నా నందనోద్యానవనంలో కూడా లేవు కదా!" అనుకోని, వివరాలు మహర్షి నుండి సేకరించారు. మరుసటి రోజున తన దేవ సేవకులను భూలోకానికి పంపి రుక్మాంగదుని తోట నుండి పూలను తెప్పించుకొన్నాడు. ఇలా ప్రతి రోజు జరగ సాగింది. 
పుష్పాలు ఎలా రాత్రికి రాత్రి మాయమవుతున్నాయో తెలియక రాజు బందోబస్తును అధికం చేసారు. దేవ సైనికులు అదృశ్య రూపంలో తస్కరించుకొని పోతూనే ఉన్నారు. 
ఒక శీతా కాలపు నాటి రాత్రి కాపలా వారు చలికి తట్టుకోలేక దొరికి ఎండు కొమ్మలతో చలి మంట వేసుకొన్నారు.వాటిల్లో కొన్ని అరుదైన మూలికా శక్తులు ఉండటంతో వెలువడిన పొగ వలన దేవ సేవకులు తమ అదృశ్య శక్తులను కోల్పోయి రాజ సైనికులకు పట్టుబడినారు.
వారిని విచారించిన రుక్మాంగదుడు "ఇంద్రుడు కోరితే నేనే పుష్పాలను ఇవ్వనా ? ఇలా చేయటం ఏమిటి ?" అని మందలించి విడుదల చేసారు.
కానీ వారు దేవ లోకానికి వెళ్ళలేక పోయారు.మూలికల నుండి వెలువడిన పొగ వారి శక్తులను పూర్తిగా హరించినది.వారి శక్తులను తిరిగి పొందటానికి మార్గం ఏమిటని అడిగిన రాజుతో దేవసైనికులు " ఏకాదశి నాడు ఉపవాసం ఉండి హరి నామ స్మరణ చేసి, ద్వాదశి నాడు ఉపవాస విరమణ ద్వారా సంపాదించుకొన్న పుణ్యం ఎవరైనా ధార పోస్తే తమ శక్తులు తిరిగి పొందగల"మని తెలిపారు.హరి భక్తుడైన రాజుకు కూడా ఏకాదశి వ్రతం గురించి తెలియదు.
అనుకోకుండా ఆ రోజు ఏకాదశి.రాజు తన సైనికులను రాజ్యం నలుమూలలకు పంపి వెతికించగా వారికి  ఒక వృద్దుడు ఉపవాసమున్నట్లుగా తెలిసి, అతనిని రాజు వద్దకు పట్టుకొని పోయారు.
రుక్మాంగదుడు ఆ వృద్దుని పుణ్యం ధారపోసే విషయం అడుగగా " నాకు ఆహరం దొరకక అభోజనం గా ఉండిపోయాను. దాని వలన ఏదన్నా పుణ్యం సంక్రమిస్తే అది ఇవ్వడానికి అభ్యంతరం లేదు" అని పలికాడు. అనడమే కాకుండా తన పుణ్యాన్ని మొత్తం ధారపోసాడు.
 ఆ పుణ్య ఫలం వలన దేవ సైనికులు ఇంద్ర లోకానికి వెళ్లి పోయారు.
తెలియక చేసిన దానికే ఇంతటి ఫలితం ఉంటే భక్తి శ్రద్దలతో ఆచరిస్తే ఎంతటి భగవత్ కృపకు పాత్రులు కావచ్చో అని తలపోసిన రాజు తన రాజ్యంలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఏకాదశి వ్రతం చేసుకోవాలని శాసనం చేసాడు.తను కూడా చేసి ఎన్నో అద్భుత శక్తులు పొంది దేవ దానవ సమరంలో దానవ సంహారంలో సహకరించారు.వయో భారంతో పాలనా భాద్యతలను వారసులకు అప్పగించి ఈ ప్రాంతాలకు వచ్చి నిరంతరం హరి నామ స్మరణలో ఉండసాగాడు.
అతని భక్తికి సంతుష్ట్టుడైన శ్రీ హరి సాక్షాత్కారం ప్రసాదించారు.
అలా శ్రీ మన్నారాయణుడు తిరు క్కోడి ట్టానంలో కొలువు తీరారు అన్న విషయం తెలుసుకొన్న సహదేవుడు కురుక్షేత్ర సంగ్రామంలో సొంత మేన మామ అయిన శల్యుని అంతం చేసినందున వెంటాడుతున్న పాపం ఈ స్వామే తొలిగించగలడు అని నమ్మి ఆలయాన్ని పునః నిర్మించి చాలాకాలం సేవించుకొన్నాడు.

చారిత్రక విశేషాలు :







ప్రస్తుత ఆలయాన్నిచేర రాజులు తొమ్మిదో శతాబ్దంలో నిర్మించినట్లుగా లభించిన ఆధారాలు తెలుపుతున్నాయి. తదనంతర కాలంలో ఆలయ అభివృద్దికి చోళ, పాండ్య, విజయ నగర రాజ వంశాలు, స్థానిక రాజ వంశాలు, ధన వంతులైన భక్తులు తమ వంతు సహకారాన్ని అందించినట్లుగా ఎన్నో శాసనాలు ఇక్కడ లభించాయి. ఒక్కప్పుడీ ప్రదేశం గొప్ప విద్యా కేంద్రంగా పేరొందినది. అందుకని తిరు ( పవిత్ర / శ్రీ ) గతి ( పాఠశాల ) స్థానం అని పిలిచేవారు. 
కాల క్రమంలో తిరు క్కోడి  ట్టానంగా మారిందని అంటారు. 

ఆలయ విశేషాలు:




సువిశాల ప్రాంగణానికి నలుదిశల చాలా ఎత్తైన ప్రహరి గోడ ఉంటుంది. ఇంతటి బలమైన గోడ కేరళ లోని మరే ఆలయంలో కనపడదు. ఈ గోడ నిర్మాణం గురించి చిత్రమైన కధనాలెన్నొ స్థానికంగా ప్రచారంలో ఉన్నాయి. తూర్పున రెండు అంతస్తుల ప్రవేశ ద్వారం దాటి లోనికి ప్రవేశిస్తే బలి పీఠం, ధ్వజస్తంభం, ఉప ఆలయాలు కనపడతాయి. అత్యంత అరుదైన రెండు వరుసల పై కప్పు కలిగిన వర్తులాకార శ్రీ కోవెల ప్రత్యేక మైనదిగా పేర్కొనాలి. 
ప్రధాన అర్చనా మూర్హ్తి శ్రీ అద్భుత / అమృత నారాయణ పెరుమాళ్ స్తానక భంగిమలో చతుర్భుజునిగా దర్శనమిస్తారు. మూల విరాట్టుకు కుడి పక్కన శివ రూపమైన శ్రీ దక్షిణా మూర్తి, వెనుక శ్రీ నారసింహ విగ్రహాలు ఉంటాయి. ఈ రెండు మూర్తులను దర్శించుకోడానికి ప్రత్యేక ద్వారాలుండవు. గర్భాలయానికి చేసిన రంధ్రాల గుండానే చూసే అవకాశం ఉన్నది. 
శ్రీ నారసింహ విగ్రహాన్ని విజయ నగర రాజుల ప్రతిష్టగా తెలుస్తోంది. 
చెక్కతో నిర్మించిన ముఖ, నమస్కార మండప స్థంభాల పైన  రమణీయంగా మలచిన చెక్కడాలను చెక్కారు. ముఖ్యంగా శివ తాండవ, శ్రీ రామ పట్టాభిషేక, యోగ నారసింహ రూపాలు ఇంత కాలమైన చెక్కు చెదరకుండా ఉండి ఆశ్చర్యం కలిగిస్తాయి.గర్భాలయ వెలుపలి గోడలకు సహజ వర్ణాలతో చిత్రించిన పురాణ గాధల చిత్రాలు ఆకట్టుకొంటాయి. 
ఇవన్ని పదునాలుగు నుండి పదహారవ శతాబ్దాల కాలానికి చెందినవని ద్రువీకరంచబడినది. 






మహా భారత విశేషాలు:



సతీ సంగమం చేస్తే మరణం తప్పదు అన్న ముని శాపానికి పాండవుల తండ్రి పాండు రాజు మరణించినది, తన మూలంగానే భర్త మరణం సంభవించినది అని ఆయనతో మాద్రి సహగమనం చేసినది ఇక్కడే అన్నది స్థానిక నమ్మకం. మాద్రి కుమారుడైన సహా దేవుడు ఆలయ నిర్మాణం చేసాడు అన్నది దీనికి బలాన్ని ఇస్తోంది. 
అందుకే నవంబర్ నెలలో జరిపే ఆలయ ప్రతిష్టా మహోత్సవాలలో తొమ్మిదో రోజున మాద్రి సహగమనానికి ప్రతీకగా "దీపోత్సవం " నిర్వహిస్తారు. 
నేతిలో ముంచిన అరటి ఆకులను, ఇతర కొన్ని వృక్ష సంభందిత పదార్ధాలతో చితిని పేర్చి, హృదయాలను కదిలించే విధంగా విషాదం పలికించే వాద్యాల మధ్య దానిని అగ్నికి ఆహుతి చేస్తారు. తప్పక వీక్షించవలసిన ఉత్సవమిది!!

సమయ పాలన :

కేరళ ఆలయాలలో ఆలయ వేళలను ఖచ్చితంగా పాటిస్తారు. 
ప్రధాన ఆలయం మూసివేసి ఉన్నా ప్రాంగణం లో సంచరించే అవకాశం భక్తులకు లభిస్తుంది చాలా చోట్ల ! కారణాలు ఏమిటన్నది వివరంగా తెలియరాలేదు.తిరుక్కోడితానం ఆలయంలో   కనీసం ప్రవేశించే  అవకాశం కూడా లేనే లేదు. ఆలయం తెరిచే వరకు బయట ఉండ వలసినదే ఎవరైనా ! ఈ ఆలయ ప్రధాన ద్వారానికి ఎదురుగా పుష్కరణి ఒడ్డున ఐదు అడుగుల రాతి స్థంభం మీద మూడు అడుగుల మనిషి విగ్రహం చేతిలో శంఖం పట్టుకొని ఉన్నది కనపడుతుంది. దీనికి సంభందించిన కధ ఇలా ఉన్నది.   






ఒక నాటి రోజున నంబూద్రి మధ్యహాన్నపూజలు చేసి ఆలయాన్ని మూసి గృహానికి వెళ్లి పోయారట. కొద్ది సమయానికి చెంగానస్సేర్రి ని పాలించే రాజు పరమాత్మ దర్శనార్ధం మంది మార్బలంతో విచ్చేసారట. ఆలయ "మారన్" (కాపలాదారు) రాజుగారి రాకను గుర్తించి, ఆ విషయాన్ని ఇంట్లో ఉన్న నంబూద్రి కి తెలపాలన్న తొందర పాటుతో మిగిలిన విషయాలు మరచి శంఖం వూదాడట. అంతే అందరూ చూస్తుండగానే రక్తం కక్కుకోని మరణించాడట. 
జరిగిన దానిలో తన తప్పిదనం ఉండటంతో మారన్ కుటుంబానికి తగిన సహాయం చేసిన రాజు సంఘటనను తెలిపే ఈ శిల్పాన్ని ఇక్కడ ఉంచారట. ఆలయం తెరిచినదాకా ఉండి స్వామిని సేవించుకొని వెళ్లారట. 








పూజలు - ఉత్సవాలు :

ఉదయం నాలుగు గంటల నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉండే ఆలయంలో నిత్యం తొమ్మిది రకాల పూజలు నియమంగా జరుగుతాయి. 
ఏకాదశి, ద్వాదశి, అష్టమి, పూర్ణిమ రోజులలో శ్రీ అద్భుత నారాయణ స్వామికి, పదిహేను రోజుల కొకసారి వచ్చే చతుర్ధి రోజులలో వినాయకునికి, షష్టి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 
శివాలయాలలో పక్షానికి ఒకసారి చతుర్దశి నాడు జరిగే ప్రదోష పూజలు ఇక్కడి శ్రీ దక్షిణా మూర్తికి జరుపుతారు. 

దివ్య దేశం :

నమ్మాళ్వార్ గానం చేసిన పాశురాలతో తిరుక్కోడిట్టానం శ్రీ వైష్ణవ నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటిగా గుర్తింపు పొందినది. ఈ క్షేత్రం చెంగనూర్ కు ఇరవై కిలోమీటర్ల దూరంలో, చెంగానస్సేరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఆటోలో చేరుకోవచ్చును. 
జై శ్రీ మన్నారాయణ !!!!




1 కామెంట్‌:

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...