7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Radha Sapthami special

                                             కిరణార్చన 

 భగవంతుని ప్రార్ధించటం, వివిధ అర్చనలు, పూజలు, ఆరాధనలు, మరెన్నో సేవలు చేయడం మానవులుగా మనందరం నిత్యం  చేస్తున్నదే !
పర్వ దినాలలో, ప్రత్యేక రోజులలో మరెన్నో విశేష సేవలు, ఉత్సవాలు సర్వేశ్వరునికి జరిపిస్తుంటాము.
కానీ లోకాలకు వెలుగును ప్రసాదిస్తూ, ప్రత్యక్ష నారాయణునిగా కీర్తించబడుతున్న "కిరణుడు" తనకు ఇంతటి హోదాను ప్రసాదించిన లోక పాలకునికి, లోకేశ్వరునికి అరుణారుణ కిరణాలతో అర్చన చెయ్యడం ఒక మనోహర దృశ్యం.
అలాంటి మంగళకరమైన, నేత్రపర్వమైన దర్శనాన్ని మనందరికీ అనుగ్రహించిన వదాన్యులు ఒకప్పుడు ఈ దేశాన్ని పాలించిన అనేక రాజ వంశాల రాజులు, వారి ప్రోత్సాహంతో  తమ నైపుణ్యానికి మెరుగులు దిద్దుకొన్న నేర్పరులైన శిల్పులు.
పరిమిత వనరులతో, పూర్తిగా మానవ అద్ధ్యయన సామర్ధ్యాల మీద ఆధారపడి, ఎన్నో రోజులు నిరీక్షణ చేసి, రాజులు తమపైన పెట్టుకొన్న నమ్మకాన్నిసఫలీకృతం చేయడమే కాకుండా తాము అనుకొన్న లక్ష్యాన్ని చేరుకొన్న ఆనాటి శిల్పాచార్యుల కార్య దీక్షాపరాయణత్వవం అభినందనీయం!!!
వారి నిర్విరామ కృషి ఫలితమే నేడు మనం అనేక ఆలయాలలో వీక్షించగలుగుతున్న అద్భుత దృశ్యం .... దివాకరుని నిత్య కిరణార్చన.
భారత దేశంలోని  అనేకానేక ఆలయాలలో శ్రీ సూర్య భగవానుడు తన కిరణాలతో అక్కడి అర్చనా మూర్తిని అభిషేకించడం మనందరికీ తెలిసిన విషయమే !
ఈ కిరణార్చన కూడా వివిధ రకాలుగా ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
కొన్ని ఆలయాలలో ప్రతి నిత్యం, కొన్ని చోట్ల విశేష దినాలలో, మరి కొన్ని ప్రదేశాలలో ప్రత్యేక రోజులలో పడే ఈ కిరణాలు ఎక్కువగా ఉత్తరాయణ మరియు దక్షిణాయనంలో పడతాయి.
ఇక ఆలయాలలో అధిక భాగం సర్వేశ్వరుని ఉండగా, తరువాత శ్రీ హరి నిలయాలు, వినాయక, అమ్మవారివి ఉండగా సూర్య ఆలయాలలో యిది తప్పని సరిగా కనిపించే దృశ్యం.
ఆలయ నిర్మాణ విషయాల గురించిన కుతూహలంతో జరిపిన అన్వేషణలో ఈ ప్రత్యేకత కలిగిన  చాలా ఆలయాల వివరాలు తెలుసుకోగలిగాను.
విరాట్ ఆలయ నిర్మాణాలు కలిగిన తమిళ నాడు లోనే కాదు మన రాష్ట్రంలోని అనేక ఆలయాలలో కూడా ఈ ప్రత్యేకత కనపడటం విశేషంగా చెప్పుకోవాలి.
 సంబంధిత అధికారులు పూనుకొని వీటి గురించి బహుళ ప్రచారం చేసి ప్రాముఖ్యం లోనికి తేవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
మొదటగా మన రాష్ట్రంలో కిరణార్చన జరిగే ఆలయాల వివరాలు తెలుసుకొందాము.
ప్రఖ్యాత సూర్య దేవాలయము శ్రీకాకుళం పట్టణంలోని అరసవిల్లిలో ఉన్నది అని అందరికి తెలిసిన విషయమే !
కళింగ రాజులు క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో నిర్మించిన ఈ చారిత్రాత్మిక దేవాలయంలో శ్రీ సూర్య భగవానుడే ప్రధాన అర్చనా మూర్తి.
సంవత్సరంలో రెండు సార్లు ఉదయారుణ కిరణాలు స్వామి వారిని తాకుతాయి.
ఉత్తరాయణంలో వచ్చే రధ సప్తమినాడు, తిరిగి దక్షిణాయనంలో  సెప్టెంబర్ - అక్టోబర్ మధ్యకాలంలో మరోసారి ఈ విశేషం చోటు చేసుకొంటుంది.
భారత దేశం లో ఉన్న ఒకే ఒక్క మత్స్య అవతార క్షేత్రంగా పేరొందినది శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం. 
చిత్తూరు జిల్లా లోని నాగులాపురం లో ఉన్న ఈ ఊరుని ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యాధీశుడు అయిన శ్రీ కృష్ణ దేవరాయలు తన తల్లి నాగులాంబ పేరుమీద నిర్మించారు. 
ఎంతో సుందర శిల్పాలకు నిలయమైన ఈ ఆలయంలో మూలవిరాట్టు చాలా లోపలికి పడమర ముఖంగా ఉంటారు. 
ప్రతి సంవత్సరం మార్చి నెల ఇరవై అయిదు, ఇరవై ఆరు, ఇరవై ఏడు తారీఖులలో సయం సంధ్యా సమయంలో సూర్య కిరణాలు తోలి రోజున స్వామి పాదాలను( పాదాల భాగం చేపకు ఉన్నట్లుగా ఉంటుంది ), మలి రోజున నాభిని,
కడపటి రోజున ముఖాన్ని తాకుతాయి. 
ఇలా నిర్మించిన ఆలయం కూడా ఇదొక్కటే అని భావించవచ్చును. 
పాత గుంటూరు జిల్లా ( నేటి గుంటూరు మరియు ప్రకాశం)లో ప్రసిద్ది చెందిన పంచ భావన్నారాయణ ఆలయాలలో ఒకటి పెదగంజాం ఊరిలో ఉన్నది. 
ఇక్కడ ఉత్తరాయణం ( మార్చి ), దక్షిణాయనం (అక్టోబర్ ) లో మూడు రోజుల పాటు తోలి కిరణాలు మూల విరాట్టును అర్చిస్తాయి. 
నవనందుల క్షేత్రం అయిన నంద్యాల పట్టణ పరిసరాలలో ఉన్న ప్రధమ నంది ఆలయంలోని ప్రధాన అర్చనా మూర్తులైన శివ, పార్వతి, గణపతులకు కార్తీక మాసంలో సాయం సంధ్యా సమయంలో సూర్య భగవానుడు తన కిరణాలతో అర్చిస్తాడు. ఇది పడమర ముఖంగా ఉండే ఆలయం. 
నవ నందులలో ఒకటైన సూర్య నంది క్షేత్రంలో ప్రతి నిత్యం తొలి కిరణాలు నేరుగా లింగాన్ని తాకుతాయి. 
కార్తీక మాసంలో ఉదయాన్నేఉదయుడు  ప్రధమ అర్చన తన కిరణాలతో చేసే మరో ఆలయం కర్నూలు జిల్లా గుడివేములకు దగ్గరలోని దుర్గా భోగేశ్వరం. 
ప్రధమ నంది ఆలయం 
కృష్ణా జిల్లాలో కృష్ణా నది సాగరంలో సంగమించే పవిత్ర స్థలం అయిన సంగమేశ్వరం ( నాగాయ లంక సమీపంలో)లో ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో శివ రాత్రి పర్వదినం నుండి ఒక అపురూప దృశ్యం ఆవిష్కృతమవుతుంది. 
నాటి నుండి పదిహేను రోజులపాటు తొలి అర్చన ఆదిత్యునదే !
మన రాష్ట్రంలో ఉన్న మరో పురాతనమైన సూర్యదేవాలయం శ్రీ మణి కుండల శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం,
కర్నూలు జిల్లా నందికోట్కూరు లో ఉన్నది. ధనుర్మాసంలో ప్రతినిత్యం ఉషోదయాన కిరణాలు ప్రధాన అర్చనా మూర్తిని తాకుతాయి. 
శాత వాహనుల నిర్మాణమైన వరంగల్ వెయ్యి స్తంభాల ఆలయంలో ఒక ప్రత్యేకత దర్శనమిస్తుంది. 
ఒక అద్భుత నిర్మాణ విశేషాల నిలయం అయిన ఇక్కడ దక్షిణాయనంలో దక్షిణం నుండి, ఉత్తరాయణంలో ఉత్తరం నుండి కిరణాలు గర్భాలయంలో పడతాయి. 
విజయనగర రాజులు నిర్మించిన అనేక ఆలయాలలో శ్రీ లక్ష్మి చెన్న కేశవ స్వామి ఆలయం, మార్కాపురం ఒకటి. 
ప్రతి డిసెంబర్ నెల ఇరవై మూడో తారీఖు నుండి పన్నెండు రోజుల పాటు ఉదయం ఆరు గంటల నలభై నిముషాల నుండి ఏడు గంటల వరకు సూర్య కిరణాలు గరుడ మండపానికి ఉన్న కిటికీల గుండా నెల మీద పడి పరావర్తనం చెంది మూల విరాట్టును తాకుతాయి. 


కర్ణాటక రాష్ట్ర రాజధాని బంగళూరులో ఉన్న తొమ్మిదో శతాబ్దపు నిర్మాణమైన గవి గంగాధరేశ్వర స్వామి ఆలయంలో సంక్రాంతి పండుగ నాటి సాయం సంధ్యా సమయంలో గంట పాటు కిరణాలు నేరుగా లింగం మీద పడతాయి. 
కర్ణాటకలోనే కేల్లురు నుండి ఐహొలె వెళ్ళే దారిలో ఉన్న సిద్దన కొల్లి గ్రామంలో ఉన్న గుహాలయం, క్రీస్తు పూర్వం నుండి జన బాహుళ్యంలో విశేష ఆదరణ కలిగిన పడమర దిశలో ఉన్నఈ ఆలయంలో సాయం కాలంలో సూర్య కిరణాలు నేరుగా లింగాన్ని అభిషేకిస్తాయి. 
ఈ రోజుకి నా కర్తవ్యం నిర్వర్తించాను, నాకు నేటికి శలవఇవ్వండి అన్నట్లుగా ఉంటుందీ దృశ్యం. 
గదగ్ జిల్లా రామేన హళ్లి గ్రామంలోకొలువుతీరి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలను ఉగాది నాటి ఉదయాన తన కిరణాలతో తాకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతాడు దివాకరుడు. 
బెల్గాం జిల్లా సుందట్టి గ్రామంలోని పదకొండవ శతాబ్దపు శ్రీ పురదేశ్వర స్వామిని కూడా ఉగాది నాడే అర్చిస్తాడు అరుణుడు. 
బంగళూరు నుండి మైసూరు వెళ్ళే దారిలో వచ్చే దొడ్డ మల్లూరులో కన్వ నదీ తీరంలో కొలువు తీరిన శ్ర అప్రమేయ స్వామి ( మహావిష్ణువు )ని వైశాఖ మాసమంతా ఉదయాన్నే అరుణుడు తన కిరణాలతో అభిషేకిస్తాడు. 
భారత దేశంలో ఉన్న ఆరు దోగాడే కృష్ణ విగ్రహాలలో ఒకటి ఇక్కడ ఉన్నది. 
ఉత్తర కర్ణాటకాలోని జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకర స్థాపిత శృంగేరి పీఠం లోని శ్రీ విద్యా శంకర ఆలయంలో పన్నెండు రాశి స్తంభాలుంటాయి. 
సూర్యుడు నెలకొక రాశిలో ఉంటాడు అన్నది అందరికి తెలిసిన విషయమే !
ఆ నెలలో కిరణాలు ఆ రాశి స్తంభం మీద పడతాయి. 
దక్షినాది నుండి పశ్చిమానికి వెళితే గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీ నగర్, గోకుల్ రోడ్లోని మారుతీ మందిరంలో సంక్రాంతి నాడు దినకరుడు తన ప్రియ శిష్యుని తన కిరణాలతో ఆశీర్వదిస్తారు. 
సుందర సాగర తీరాల రాష్ట్రం అయిన గోవా లో పురాతన మహాదేవ మందిరం తంబ్ది సుర్ల లో ఉన్నది. ఇక్కడ ప్రతి నిత్యం ప్రాతః కాలంలో తొలి అర్చన సూర్య కిరణాలతోనే జరుగుతుంది. 
మహా రాష్ట్ర లోని కొల్హాపూర్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి మందిరం అష్టా దశ పీఠాలలో ఒకటిగా పేరొందినది. 
దక్షిణాయన, ఉత్తరాయణ కాలాల్లో మూడు రోజుల పాటు కశ్యపాత్మజుడు తన కిరణాలతో లోక పావనిని అభిషేకిస్తాడు. 

అదే రాష్ట్రంలో పేరొందిన అష్ట వినాయక క్షేత్రాలలో భాగమైన భల్లాలెశ్వర, పాలి ( ముంబయికి పన్నెండు కిలోమీటర్లు ), అదె విధంగా పూణే కు యాభై కిలో మీటర్ల దూరంలో ఉన్న రంజన్ గాం
 లోని మహా గణపతి ఆలయంలోనూ  దక్షిణాయనంలో ప్రతి నిత్యం కిరణాలు ప్రధాన అర్చనా మూర్తిని అబిషేకిస్తాయి.
ఉత్తర ప్రదేశ్ లోని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపబడినవి దేవఘర్ లో అయిదో శతాబ్దంలో గుప్త రాజులు నిర్మించబడిన ఆలయాలు. 
వీటిల్లో అరుదైనది దశావతార మందిరం. 
పడమర దిశలో ఉండే ఇక్కడి ప్రధాన మూర్తి పైన సాయం సమయంలో తన కిరణాలను ప్రసరించి లోక రక్షకునికి తన అంజలి ఘటిస్తాడు సూర్యనారాయణుడు. 
అద్భుతమైన శిల్పాలను ఇక్కడ వీక్షించ వచ్చును. 
మద్య ప్రదేశ్  పరలి లోని శ్రీ వైద్య నాధాలయం జ్యోతిర్లింగాలలో ఒకటి. 
బ్రాహ్మి,వేణి మరియు సరస్వతి నదుల సంగమ క్షేత్రం మైన ఇక్కడి గర్భాలయానికి ఉన్న కిటికీల గుండా ప్రతి రోజు కిరణాలు సర్వేశ్వరుని తాకుతాయి. 
తిరిగి దక్షిణానికి వస్తే ప్రత్యేక ఆలయాల రాష్ట్రం కేరళ లో ఎర్నాకులంకు దగ్గరలోని ప్రముఖ శైవ క్షేత్రం వైకం. 
ఇక్కడి శ్రీ కోవెల పైన ఉన్న స్వర్ణ గోపురాన్ని వృక్ష్చిక మాసం (నవంబర్- డిసెంబర్ ) లో  అరుణారుణ కిరణాలతో శోభాయమానంగా మారుతుంది. 
అరుదైన ఈ దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు వేలాదిగా విచ్చేస్తారు.   

ఇక ఆలయాల రాష్ట్రం అయిన తమిళ నాడులో లెక్కలేనన్ని ఆలయాలలో ఉదయుడు తన కిరణాలతో నిత్యం, ప్రత్యేక, దక్షిణాయన, ఉత్తరాయణ కాలాలలో వివిధ రకాలుగా  గర్భాలయాలొ కొలువు తేరిన మూల విరాట్టులను అర్చిస్తుంటాడు.
ముఖ్యమైన వాటిని గురించి తెలుసుకొందాము.
విల్లు పురం జిల్లాలో విరించిపురం లో  రమణీయమైన శిల్ప సంపదకు నిలయమైన పదమూడు వందల స్తంభాలమీద కులోత్తుంగ చోళ రాజు నిర్మించిన శ్రీ మార్గభందేశ్వర స్వామి ఆలయం భాస్కర క్షేత్రం.
ఫాల్గుణ మాసం ( మార్చి - ఏప్రిల్ )లో నెలంతా ఉదయాన కిరణాలు లింగాన్ని అభిషేకిస్తాయి.
ప్రయాణంలో కలిగే ఇబ్బందులను తొలిగించే వానిగా స్వామి ప్రసిద్ది.
ఇప్పటికి స్థానికులు ప్రయాణంలో కాపాడమని ఈ స్వామిని పూజించిన తరువాత ప్రయాణాన్ని మొదలుపెడతారు.
పరిహార క్షేత్రం.


ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఆలయమిది.
అదే జిల్లాలో ఉన్న పనయపురం శ్రీ పానఘట్టేశ్వర స్వామి ఆలయం శతాబ్దాల నాటిది.
చైత్ర మాసంలో నెలరోజుల పాటు ఆదిత్యుడు ఆది దంపతులను తన కిరణాలతో అభిషేకిస్తాడు.
చెన్నై బంగళూరు రహదారిలో వచ్చే పునమలై శ్రీ వైదీశ్వర స్వామి ఆలయం తొండై మండల నవ గ్రహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ది.
మాసి నెల ( ఫిబ్రవరి - మార్చి ) ఇరవై ఒకటి నుండి అయిదు రోజులు ఉదయం ఆరు గంటలకు కిరణార్ఛన జరుగుతుంది.
అలానే అదే ఊరిలో ఒన్న శ్రీ వరద రాజ పెరుమాళ్ కోవెలలోనూ అవే రోజులలో అదే సమయంలో కిరాణార్చన జరుగుతుంది.
చెన్నైకి సమీపంలోని తిరువేర్కాడు శ్రీ కరుమారియమ్మన్ కు ఉత్తరాయణం మరియు దక్షిణాయనంలో అంటే ఫాల్గుణ, భాద్రప్రద మాసాలలో తొలి అర్చన సూర్యునదే !
రామనాథ పురం జిల్లా ఉప్పూరు లో ప్రసిద్ది చెందిన శ్రీ వెయిల్ ఉగంత వినాయగర్ కు  దక్షిణాయనంలో దక్షిణం నుండి ఉత్తరాయణంలో ఉత్తరం నుండి సంవత్సరం పొడుగునా నియమంగా
 సూర్యుడు విఘ్ననాయకుని అర్చిస్తాడు.
నగర్ కొయిల్ కి ముప్పై కిలో మీటర్ల దూరంలో ఉన్నతిరువట్టారు శ్రీ వైష్ణవ నూట ఎనిమిది దివ్య తిరుపతులలో ఒకటి.
పన్నెండు వందల సంవత్సరాల పైచిలుకు చరిత్ర కలిగిన ఈ ఆలయ నామూనాలోనే ట్రావెంకూర్ రాజులు ప్రముఖ అనంత పద్మ నాభ స్వామి ఆలయాన్ని తిరువనంతపురంలో నిర్మించారని అంటారు.
పహరాలి, కోటాయి మరియు తమిర పారాణి నదుల సంగమ క్షేత్రం తిరువట్టారు.
పడమర ముఖంగా ఉండే ఆలయంలో కొలువైన శ్రీ ఆది కేశవ పెరుమాళ్ని మార్చి మరియు నవంబరు నెలలో సాయం సంధ్యా సమయంలో సూర్య నారాయణుడు తన కిరణాలతో అభిషేకిస్తాడు.
చక్కని శిల్ప సంపద ఈ ఆలయ విశేషం.

ఇదే నాగర్ కోయిల్ కి అయిదు కిలో మీటర్ల దూరంలో ఉన్న పరక్కాయి లో వెలసిన అరుల్ముగు మధుసూధన పెరుమాళ్ పాద పద్మాలను మార్చి నెలలో ఇరవై అయిదు మరియు ఇరవై ఆరు తారీఖులలో కిరణాలతో అర్చిస్తాడు అరుణుడు.
తిరునెల్వేలి జిల్లా లో తమిర పారాణి నదీ తీరంలో ఉన్న నవ తిరుపతులలో ఒకటైన శ్రీ వైకుంఠమ్ కూడా శ్రీ వైష్ణవ నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి.  అదే విధంగా శ్రీ వైష్ణవ నవ గ్రహ క్షేత్రాలలో ఇది సూర్య క్షేత్రం.
సూర్యుడు ఇక్కడ శ్రీ మహా విష్ణువు దర్శనాన్ని అపేక్షిస్తూ తపమాచారించారని స్థల పురాణం. పాండ్య రాజులు నిర్మించిన ఈ విరాట్ ఆలయం విశిష్ట శిల్ప నిలయం.


ఎంతో లోపలికి ఉండే గర్భాలయంలో కొలువైన శ్రీ వైకుంఠ పతి పెరుమాళ్ ని ఉత్తరాయణంలో (మార్చి), దక్షిణాయనంలో ( సెప్టెంబర్ )లో మూడు రోజులు చొప్పున నేరుగా తాకుతాయి.
తిరునెల్వేలి కన్యాకుమారీ లకు మద్యలో ఉన్న హరిహర క్షేత్రం శంకరన్ కోయిల్ లో కూడా ఉత్తరాయణంలో (మార్చి), దక్షిణాయనంలో ( సెప్టెంబర్ )లో కిరణాభిషేకం జరుగుతుంది. పాండ్య రాజులు తొమ్మిదో శతాబ్దంలో నిర్మించిన అద్భుత ఆలయాలలో ఇది ఒకటి.
తంజావూరు జిల్లలో ఉన్న శ్రీ యోగానాదేశ్వర ఆలయం, తిరువిసనల్లూరులో చైత్ర మాసంలో మూడు రోజులు కిరణాలు లింగాన్ని తాకుతాయి. ఆలయ దక్షిణ గోడ మీద చెక్కిన ఏడువందల సంవత్సరాలనాటి రాతి గడియారం ఒక విశేషం.
తిరుచురాపల్లి లో ప్రసిద్ద రాక్ ఫోర్ట్ పైన తాయుమానవర్ మీదా మార్చి నెల ఇరవై మూడు నుంచి మూడు రోజులు
కిరణార్చనే !
మైలాడుత్తురై కి అయిదు కిలో మీటర్ల దూరంలో ఉన్న పరిహార క్షేత్రమైన తిరు అన్నియూర్ ( పొన్నూరు)లో కొలువైన శ్రీ అపత్ సహయేశ్వర స్వామికి ఫాల్గుణ మాసంలో అయిదు రోజులు వరసగా కిరాణాభిషేకం జరుగుతుంది. ఎన్నో ప్రత్యేకతలున్న ఆలయమిది.
కారేకాళ్ దగ్గరలోని తిరుతలచ్చేరి శ్రీ పర్వతేశ్వర స్వామికి ప్రతి మాస శివరాత్రికి కిరణాభిషేకం ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఈరోడ్ జిల్లా లో భవాని నది కావేరీతో సంగమించే పవిత్ర స్థలమైన భవాని లో ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామి వారితో పాటు అమ్మవారు శ్రీ వేద నాయకి, శ్రీ  సుబ్రమణ్య స్వామి వారలకు కూడా ఫిబ్రవరి నెలలో మూడు రోజులు కిరణార్చన నియమంగా జరుగుతుంది.
ఇదే జిల్లా లో కొదుముది లో ఉన్న  త్రిమూర్తి కోవెలలో వెలసిన శ్రీ కొడుముది నాదర్, శ్రీ అంబాల్ మరియు శ్రీ వీరనారాయణ పెరుమాళ్ కు ఉత్తరాయణంలో, దక్షినాయణంలో మూడేసి రోజుల చొప్పున జరిగే కిరాణాభిషేకం తప్పక చూడవలసిన దృశ్యం.


ఈ ఆలయంలో స్థానక భంగిమలో ఉండే సుందర నటరాజ ఉత్సవ మూర్తి ప్రత్యేక ఆకర్షణ.
 
ప్రముఖ స్కంద క్షేత్రం పళని నుండి కోయంబత్తూర్ వెళ్ళే దారిలో కావేరీ నదీ తీరంలో కడత్తూర్ కి ఏడు కిలో మీటర్ల దూరంలో ఉన్న మధు తుక్కాలం లో వెలసిన శ్రీ అర్జునేశ్వర స్వామి వారి సన్నిధిలో ఒక అద్భుత దృశ్యం ప్రతి నిత్యం ఆవిష్కృతమవుతుంది.
నదీ జలాల మీద సూర్య కిరణాలు పడి పరావర్తనం చెంది లింగానికి కొత్త అందాలను అద్దుతాయి.
సేలం దగ్గరలోని తారు మంగళం శ్రీ మహాదేవ ఆలయంలో మరో విధమైన నిర్మాణ చాతుర్యాన్ని చూడవచ్చును.
ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు నుండి మూడు రోజులు సాయంత్రాలలో గోపురానికున్న కిటికీల గుండా కిరణాలు గర్భాలయానికి చేరి లింగాన్ని అభిషేకిస్తాయి.
పంచ భూత క్షేత్రాలలో ఒకటిగాను, ప్రముఖ హరిహర నిలయంగాను పేరొందిన చిదంబరానికి సమీపంలోని మేళ కదంబూరు శ్రీ కుట్టు మన్నార్ కోయిల్ కి ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్న శ్రీ అమృతకటేశ్వర స్వామికి కూడా
 ఉత్తరాయణంలో, దక్షినాయణంలో మూడేసి రోజుల చొప్పున కిరణార్చన జరుగుతుంది.
ఏడో శతాబ్దానికి చెందిన పది హస్తాలతో నంది మీద తాండవమాడే నటరాజ స్వామి ఉత్స విగ్రహాన్ని ఇక్కడ దర్సించుకోవచ్చును.
నాగ పట్టినం కి సమీపంలోని శిక్కాల్ శివాలయంలో ఉప దేవతగా కొలువుతీరిన కుమారా స్వామికి ప్రతి రోజు కిరణాలతోనే ప్రధమ అభిషేకం అర్చన.
సప్త ముక్తి క్షేత్రాలలో ఒకటి అయిన కంచి కి ముప్పై కిలో మీటర్ల దూరంలో ఉన్న చెయ్యేరు శ్రీ వేదపురీశ్వర స్వామికి ప్రతి రధ సప్తమికి కిరణాలతో జరిగే అభిషేకం కాకుండా ఒక ప్రత్యేక ప్రదేశంలో నిలుచొని ఎనిమిది ద్వారాలను  అనేక ఉప దేవతల సన్నిధులను, ఆలయ విమానాన్ని, ఆలయ వృక్షాన్ని సందర్సించుకోగలటం ఒక అద్భుత నిర్మాణ చతురతగా పేర్కొన వచ్చును.
మన దేశంలోనే కాదు దక్షిణ ఈజిప్ట్ అబుసిమ్బెల్ (abusimbel) లో రాజా రామ్సే విగ్రహం మీద గత మూడు వేల సంవత్సరాలుగా క్రమం తప్పకుండా అక్టోబర్ ఇరవై రెండున అలానే ఫెబ్రవరి ఇరవై రెండున సూర్య కిరణాలు పడుతున్నాయి.
స్థానిక భాషలో రా అన్నా అమున్ర అన్నా సూర్య భగవానుడు అనే !
ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష దైవం గా పూజించబడుతున్న శ్రీ సూర్య నారాయణ స్వామిని నిత్యం ధ్యానిద్దాము.
అపురూప ఆలయాలను నిర్మించినవారిని తలుచుకొందాము. 
జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతం
తమోరిం సర్వ పాపఘ్నమ్ ప్రణతోస్మి దివాకరం !!!!!






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...