24, నవంబర్ 2013, ఆదివారం

Tirupati

                 తిరుపతి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయాల విశేషాలు 

శ్రీ హరి నామ సంకీర్తనలతో ప్రతిధ్వనించే పవిత్ర క్షేత్రం తిరుమల తిరుపతి.
కలియుగ వైకుంఠము గా కీర్తింపబడే పరమ పుణ్య ధామం.
దశావతారాలా లేక పురాణాలలో పేర్కొన్న అనేకానేక అవతారాలా !
రూపం మారవచ్చును. కాని ముఖ్యోద్దేశం భక్త జన సంరక్షనే !
అందుకే శ్రీ వేంకటేశ్వరుడు సకల రూప అవతారం. కలియుగ దైవం.
మరి ఆయనకు అత్యంత సన్నిహితంగా మసలి నిరంతరం స్వామి సేవలో ఉండిపోవాలని కోరుకొన్న ఒకే ఒక అనుచరుడు అంజనీ పుత్రుడు శ్రీ ఆంజనేయుడు.


అన్ని విష్ణు క్షేత్రాలలో కేసరీ నందనునిది  ప్రత్యేక స్థానం.
కాని తిరుమల తిరుపతిలో వాయు సుతునిది సమున్నత స్థానం.
సప్త గిరులలో, నడక దారిలో, దిగువ తిరుపతిలో కనపడేన్ని హనుమత్ సన్నిధులు మరెక్కడా కానరావు.
అన్ని ఒక ఎత్తైతే తిరుపతి పట్టణంలో ప్రఖ్యాతి గాంచిన శ్రీ గోవింద రాజ స్వామి ఆలయ నలుదిక్కులా ఉన్న అనేక సంజీవ రాయని ఆలయాలు విశేషమైనవి. ఎంతో చారిత్రక సమాచారాన్ని అందించే భండారాలు అవి. ఒకరకంగా వీటిని నాలుగు పక్కలా ఉన్న క్షేత్ర రక్షక నిలయాలుగా పేర్కొనాలి. 


కనిపించే ఆలయాలలో కొన్ని శ్రీ గోవింద రాజ స్వామి ఆలయం కన్నా చాల సంవత్సరాల ముందు నిర్మించినవి. 
ఒకప్పుడు తిరుపతి చిన్న గ్రామంగా ఉన్న సమయంలో రక్షణగా పల్లవ రాజుల కాలంలో  సుమారు ఏడు లేదా ఎమిదో శతాబ్దాలలో కట్టించిన పురాతన మారుతి మందిరాలు నాలుగు శ్రీ గోవింద రాజ స్వామి ఆలయానికి నాలుగు మూలలలో ఉండి నేటికీ భక్తులను ఆకర్షిస్తున్నాయి. 
                                  
ప్రధాన ఆలయానికి దారి తీసే మార్గానికి ఎదురుగా ఉన్న శ్రీ హనుమంతుని మందిరం నాలిగింటిలో ప్రముఖంగా కనపడుతుంది. 
విజయనగర నిర్మాణ రీతులను ప్రదర్శించే ఇందులో నిలువెత్తు రూపంలో భక్తాంజనేయుడు ముకుళిత హస్తాలతో పడమర ముఖంగా స్థానక భంగిమలో దర్శన మిస్తారు. 
స్వామివారికి నియమంగా ఎన్నో అలంకారాలు, అర్చనలు ప్రతి నిత్యం జరుగుతాయి. చక్కని శిల్పాలు, పెద్ద ప్రదక్షిణా ప్రాంగణం ఉంటాయి. 
ఈ సన్నిధిని ఆగ్నేయ మూలలో ఉన్నదిగా పరిగణించవచ్చును. 




ఇక్కడనుండి ఉత్తరంగా రధాన్ని దాటి వెళితే వచ్చే నాలుగు కాళ్ళ మండపం వద్ద ఈశాన్య మూల ఉన్న పురాతన రామ బంటు మందిరం చేరుకోవచ్చును. 
పడమర ముఖంగా కొలువు తీరిన శ్రీ వీరాంజనేయ స్వామి దక్షిణ దిక్కును అంటే ప్రధాన ఆలయాన్ని చూస్తుంటారు. 
నిత్య పూజలు జరుగుతాయి. 


ఇక్కడ నుండి గాంధీ రోడ్లో పడమర దిక్కుగా వెళితే పక్క పక్కనే ఉన్న రెండు రామ భక్తుని ఆలయాలు కనపడతాయి. 
వీటిని శ్రీ హథీ రాంజీ మఠ పీఠాదిపతులు ప్రతిష్టించినట్లుగా తెలుస్తోంది. 


వాటిని దాటి కృష్ణా పురం థానా నాలుగు వీధుల కూడలికి చేరుకొంటే అక్కడ మరో పురాతన మందిరం ఉంటుంది. 
బయట ద్యానంజనేయ రూపాన్ని నాలుగు పక్కల చెక్కిన స్థూపం ఉంటుంది. పక్కనే నవగ్రహ మందిరం. 

లోపల శ్రీ ఆంజనేయుడు తూర్పు ముఖంగా కొలువు తీరినా  దృష్టి మాత్రం దక్షిణం వైపే!
అంటే శ్రీ గోవింద రాజ స్వామి ఆలయాన్ని చూస్తుంటారు.  
ఇక్కడ పంచ నారాయణ రూపాలయిన శ్రీ వెంకట నారాయణ, శ్రీ ఆది నారాయణ, శ్రీ అమర నారాయణ, శ్రీ శంకర నారాయణ, శ్రీ వీర నారాయణ మూర్తులను ప్రతిష్టించారు. 



ఈ మందిరాన్ని వాయువ్య మూలలో ఉన్నదిగా చెప్పుకోవాలి.
నిత్య పూజలు జరుగుతాయి.
పూర్వం ఈ కూడలే తిరుపతికి ముఖ ద్వారంగాను, ఇక్కడి నుండే అలిపిరికి జట్కాలు లభించేవని పెద్దలు చెబుతుంటారు.
అక్కడి నుండి దక్షిణంగా బేరి వీధిలో వెళితే అక్కడ శ్రీ వరద రాజ స్వామి మందిరం పక్కనే మరో మనోజుని మందిరం ఉంటుంది.
పురాతన ఆలయ స్థానంలో నూతనంగా నిర్మించారు.
చిన్న విగ్రహ రూపంలో శ్రీ దాసాంజనేయుడు ఎదురుగా ఉన్న తన స్వామినే చూస్తుంటారు.
దీనిని ప్రధాన ఆలయానికి నైరుతి మూలలో ఉన్నక్షేత్ర రక్షకునిగా భావించ వచ్చును.
ఇక్కడా ప్రతి నిత్యం పూజలు జరుగు తాయి.





                                      
ఈ నాలుగు మందిరాల గురించిన పూర్తి చారిత్రక విశేషాలను భక్తులకు అందుబాటులో ఉంచితే ఉపయోగకరంగా ఉంటుంది. 
జై ఆంజనేయ !


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...