14, ఆగస్టు 2013, బుధవారం

Sri Chengalamma Parameswari, Sullurupet

        సకల అభీష్టప్రదాయని - శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి 


                                                                                             
భారత దేశంలో శ్రీ వైష్ణవం, శైవం తరువాత అత్యంత విశ్వసమైన ఆరాధనా విధానాలలో శక్తి ఆరాధన ఒకటి.
  ముమ్మూర్తులా ముగురమ్మల మూలపుటమ్మ,సృష్టికి మూలమైన దేవిని సర్వ శక్తిదాయనిగా సర్వ జీవ కోటిని రక్షించే ఆది శక్తిగా నిర్ణయించి కొలవడం అనాది నుండి వస్తున్నది.
గ్రామ గ్రామాన వెలసి, గ్రామానికొక నామం ధరించిన, సహస్ర నామదారిని ప్రజలను కన్న బిడ్డల మాదిరి కాపాడుతున్నది.
జగన్మాతకు ఉన్న అనేకానేక ఆలయాలలో కొన్నిభక్త లోకంలో విపరీతమైన విశ్వాసాన్ని కలిగించాయి. అమ్మ ఎక్కడైనా అమ్మే ! కాని భక్తులకు కలిగిన అనుభవాలే వారిలో నమ్మకాన్ని పెంచాయి.
అలా అమ్మ ఇక్కడ స్థిర నివాసముంటున్నది అనే భావన, అపూర్వ అనుభూతి కలిగించే ఆలయాలలో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం ఒకటి.













మన రాష్ట్ర దక్షిణ భాగాన నెల్లూరు జిల్లాలో తమిళనాడుకి సరిహద్దులో ఉన్న సూళ్ళూరు పేటలో కొన్ని వందల సంవత్సరాలుగా పూజలందుకొంటున్నది శ్రీ చెంగాలమ్మ. 








ఆలయ చరిత్ర :

పదో శతాబ్ద కాలంలో ఈ గ్రామం పేరు "శుభ గిరి". ఒక గొల్ల పల్లె. రోజు మాదిరే పశువులను మేతకు తోలుకువెళ్లారు. 
సాయంత్రం తిరిగి ఇళ్ళకు మళ్లే సమయంలో సమీపంలోని కాళంగి నదిలో ఈతకు దిగిన కొందరు నీటి ప్రవాహ వేగానికి సుడిలో చిక్కుకొని  కొట్టుకొనిపోతూ, ఒక శిలను పట్టుకొని, ఆ ఆసరాతో ఒడ్డుకు చేరుకొన్నారు. 
 నీటి ఉదృతి తగ్గిన తరువాత చూస్తే అష్ట భుజాలతో వివిధ ఆయుధాలు ధరించి పాదాల క్రింద దానవుని దునుముతున్న దేవి విగ్రహం ఊరి వారికి కనిపించినది. ఒడ్డుకు తెచ్చి ఒక రావి వృక్షం క్రింద తూర్పు ముఖంగా ఉంచారు. 
మరునాడు చూడగా మూర్తి దక్షిణ దిక్కుగా తిరిగి ఉండి ఎన్ని ప్రయత్నాలు చేసినా కదలలేదు.
















ఇదేమిటని గ్రామస్తులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. నాటి రాత్రి గ్రామ పెద్దకు కలలో అమ్మవారు కనిపించి, తాను అక్కడే ఉండదలచానని చెప్పడంతో చిన్న ఆలయాన్ని నిర్మించారు. అసుర సంహారిణి అయినా శాంత మూర్తిగా కొలువుతీరడం వలన "తెన్ కాశీ" ( దక్షిణ కాశి ) అని పిలిచేవారు. కాల క్రమంలో అదే "చెంగాలి" గా "చెంగాలి పేట"గా పిలవబడి, చివరకి ఆంగ్లేయుల పాలనలో సూళ్ళూరు పేట గా మారిందంటారు. ఊరి పేరు వెనక మరో కారణం కూడా చెబుతారు. ఏడు సంవత్సరాలకొకసారి జరిగే ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయం వద్ద "సుడి మాను" తిప్పటం ఒక ఆచారంగా వస్తోంది. అదే సూళ్ళూరు పేటగా రూపాంతరం చెందినదని అంటారు. 
కారణం ఏదైనా శ్రీ చెంగాలమ్మ తల్లి కోలువైనందునే ఊరికి ఈ పేరొచ్చినది అన్నది స్పష్టం. 

ఆలయ విశేషాలు :

సువిశాల ప్రాంగణంలో ఆలయ సముదాయం నిర్మించబడి ఉంటుంది. 
తూర్పు వైపున స్వాగత ద్వారం, రాజ గోపురం నిర్మించారు. 
ఉప ఆలయాలలో గణపతి, లింగ రూప కైలాసనాధుడు, నాగ దేవతలు కొలువుతీరి దర్శనమిస్తారు. 
నూతనంగా నిర్మించబడిన ప్రధానాలయం ముఖ మండపంలో నవ దుర్గా రూపాలను సుందరంగా మలచి, నిలిపారు. 
గర్భాలయంలో సర్వాలంకరణభూషితగా శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి కొలువై ఉంటారు. 
ఆలయం నిర్మించిన దగ్గర నుండి బలిజ కులస్థులె పూజాదికాలు నిర్వర్తిస్తున్నారు. 
రోజంతా భక్తుల సందర్శనార్ధం తెరిచి ఉండే ఈ ఆలయానికి ఎలాంటి తలుపులు ఉండవు. చాలా సంవత్సరాల క్రిందట ఒక దొంగ ఆలయం లోనికి ప్రవేశించి భంగపడ్డాడట. 
అప్పుడు ఆలయ నిర్వాహకులు తలుపులు చేయించారట. కానీ అమ్మవారు స్వప్నంలో " నాకు నా భక్తులకు మధ్య  ఎలాంటి అడ్డు ఉండకూడదు" అని తెలపడంతో వాటిని ప్రాంగణంలో ఒక చోట ఉంచారట. 
ఎండిపోయి, చెక్కబడిన కలప నుండి ఆశ్చర్యకరంగా మొక్క మొలిచి పెద్ద వృక్షంగా ఎదిగింది. ఇది శ్రీ చెంగాలమ్మ మహత్యమా అన్నట్లుగా వృక్ష మూలంలో అమ్మవారి రూపం సాక్షత్కరించడం ఒక విశేషంగా పేర్కొనవచ్చును.















ఈ వృక్షం దగ్గర నాగ లింగం, నవ గ్రహ మండపం ఉంటాయి. సంతానాన్ని కోరుకొనే దంపతులు ఈ పవిత్ర వృక్షానికి గుడ్డతో ఊయలలు కడతారు. నియమంగా ప్రదక్షిణలు చేస్తారు. 








పూజలు  ఉత్సవాలు :

ప్రతి నిత్యం నియమంగా ఎన్నో రకాల పూజలు, అర్చనలు, సేవలు శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరికి జరుగుతాయి. 
ప్రతి పౌర్ణమికి అమ్మవారికి ప్రీతికరమైన నవ కలశ అభిషేకం, మహా చండీ యాగం ఆర్జిత సేవలుగా భక్తుల సౌకర్యార్ధం నిర్వహిస్తున్నారు. 
వివాహము, ఉపనయనం,పిల్లలకు తొలిసారి చెవులు కుట్టించడం, అక్షరాభ్యాసం లాంటివి జరుపుకోడానికి దేవాలయంలో తగిన ఏర్పాట్లు ఉన్నాయి. విశాల మండపము, వసతి గదులు అందుబాటులో ధరలతో  దేవస్థానం ఏర్పాటు చేసింది. గణపతి నవ రాత్రులు, ఉగాది, మహాశివరాత్రి, నాగుల చవితి సందర్భాలలో భక్తులు వేలాదిగా పాల్గొంటారు. 
దసరా నవ రాత్రులలో ఆలయ శోభ మరింతగా పెరుగుతుంది. 
మన రాష్ట్రం నుండే కాక తమిళ నాడు నుండి కూడా భక్తులు తరలి వస్తారు.










సుళ్ళు ఉత్సవం :

సూళ్ళూరు పేట శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి కి ఏడు సంవత్సరాల కొకసారి మే - జూన్ నెలల మధ్య బ్రహ్మ్హోత్సవాలు జరుపుతారు. ఏడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు సుడిమాను ప్రతిష్ట, బలి హరణ తో ప్రారంభం అవుతాయి. రెండో రోజునుండి నాలుగో రోజు వరకు  సుడి మానుకు చక్రం, నల్ల మేక, పూల మాల, పాలవెల్లి, మనిషి బొమ్మ కట్టి సుళ్ళు తిప్పుతారు. మూడో రోజున మహిషాసుర మర్దన అంటే దున్నపోతు బొమ్మ తలను నరకడం జరుగుతుంది. లోక కంటకుడైన మహిషాసురుని మహాకాళి సంహరించి లోకాలను కాపాడినందుకు ఆనందించిన ప్రజలు అయిదో రోజున కాళింది నదిలో అమ్మవారికి ఘనంగా తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఆఖరి రోజున పరమేశ్వరిని  పుష్ప పల్లకిలో ఊరేగిస్తారు. ఈ ఏడు రోజులు అమ్మవారిని గ్రామంలో అశ్వ, సింహ, నంది ఇలా రోజుకో వాహనం మీద  ఊరేగిస్తారు. 
మహిమ గల తల్లిగా, కోరిన వారాలను ప్రసాదించే పరమేశ్వరిగా కొలువుతీరిన శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరీ ఆలయం , నెల్లూరు పట్టణానికి వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న సూళ్ళూరు పేట లో ఉన్నది. 
చెన్నై వెళ్ళే రైళ్ళలో అధిక శాతం సూళ్ళూరు పేటలో ఆగుతాయి. నెల్లూరు, తిరుపతి పట్టణాల నుండి బస్సులు ఉన్నాయి. సూళ్ళూరు పేటలో యాత్రీకులకు కావలసిన అన్ని సౌకర్యాలు లభిస్తాయి. 
శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం ఇక్కడే ఉన్నది. 
ప్రసిద్ది చెందిన నేలపట్టు విదేశీ పక్షుల కేంద్రం, పులికాట్ సరస్సు ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాయి. 
సూళ్ళూరు పేటలో మరో అద్భుత పురాతన దర్శనీయ ఆలయం శ్రీ అలఘు మల్ల హరి దేవాలయం. శ్రీ కృష్ణ పరమాత్మ సత్య భామ, జాంబవతి సమేతంగా కొలువైన ఒకే ఒక్క ఆలయమిది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...