20, మార్చి 2024, బుధవారం

Sri Bala Koteswara Swami Tempe, Govada,

 

               శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ 


చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలిగించే వాతావరణం. 
అలాంటి ప్రశాంత పరిసరాల మధ్యలో దర్శనమిస్తుంది శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ బాలకోటేశ్వర స్వామి కొలువైన గోవాడ దివ్య క్షేత్రం.  
మహేశ్వరుడు కొలువైన అనేక దివ్యధామాలు మనకు భారతదేశం నలుమూలలా కనిపిస్తాయి. ఈ ప్రదేశంలో త్రవ్వకాలు జరిపినా శివలింగాలు వెలుగు చూస్తాయి. అంతగా విశ్వేశ్వరుని పట్ల అచంచల భక్తి భావాలు కలిగిన పవిత్ర భూమి మన భారత భూమి. 
శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ బాలకోటేశ్వర స్వామి ఇక్కడ కొలువు తీరిన గాథ యుగాల క్రిందటిదిగా పేర్కొనాలి. ఈ ఆలయం ఇక్కడ ఏర్పడానికి గల చారిత్రక ఆధారాలను చూద్దాము. 







చారిత్రక నిదర్శనాలు 

గతంలో ఈ ప్రాంతాన్ని చోళుల వంశం లో నుండి విడివడి ఇక్కడ స్థిరపడిన వారు అంటారు. అదే చరిత్రకారులు వీరు కన్నడ ప్రాంతానికి చెందిన పాలకవంశం అయిన చాళుక్య వారసులు అని పేర్కొంటారు. మరికొందరు వీరిని "వెలనాటి చోడులు" అని కూడా పిలుస్తారు. 
చారిత్రక సత్యం ఏది ఏమైనా చందోలు ను రాజధానిగా ఈ ప్రాంతాన్ని పాలించిన వీరు విశాల ప్రాంతాన్ని పాలించారు. తంజావూరు చోళరాజులతో మైత్రి మరియు బంధుత్వాన్ని కలిగి ఉన్నారు. తమ కీర్తిని శాశ్వతంగా నిలిపే ఎన్నో ఆలయాలను ఈ ప్రాంతంలో నిర్మించారు. వాటిల్లో తమ ఆరాధ్య దైవమైన కైలాసనాథుని ఆలయాలు అధికం అని చెప్పాలి. అలాగని వారు ఇతర దేవతారాధనలను అడ్డగించలేదు. అనేక విష్ణు ఆలయాలను, నిర్మించారు. పునరుద్ధరించారు. 
వీరి పాలనలో ఈ ప్రాంతం ఎంత గొప్పగా ఉన్నది అన్న విషయాన్ని ఆ నాటి కావ్యకర్త శ్రీ పాల్కురీ సోమనాధుడు: తన "బసవపురాణం" కావ్యంలో వివరిస్తారు. ఈ ద్విపద కావ్యం లింగాయత్ వ్యవస్థాపకుడు, సంఘసంస్కర్త , కవి మరియు తత్వవేత్త అయిన "శ్రీ బసవేశ్వర" జీవిత గాథను తెలియజేస్తుంది. 
















శ్రీ బసవేశ్వర పరమేశ్వరుని పట్ల తనకు గల భక్తి భావాన్ని "వచన " అనే విధానంలో ప్రజల లోనికి తీసుకొని వెళ్లారు. శివ గాయక భక్తులైన నయనారుల మాదిరి ఈయన కూడా నాటి కన్నడ ప్రాంతంలో ప్రజలను ప్రభావితులను చేయగలిగారు. 
ఇక అసలు విషయానికి వస్తే ఇంతటి ప్రభావాల వలన వెలనాటి చోడులు నిర్మించిన అనేక ఆలయాలు కాలప్రభావంతో మరుగున పడిపోయాయి. భూమిలో కలిసి పోయాయి. 
అలాంటి ఒక ఆలయంలోని లయకారుని లింగమే నేడు గత శతాబ్ద కాలంగా గోవాడలో శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ బాల కోటేశ్వర స్వామిగా పూజలు అందుకొంటున్నది. 
సుమారు వంద సంవత్సరాలకు పూర్వం కీర్తిశేషులు శ్రీ కూచిపూడి తిరుపతి రాయుడు పేరుమోసిన మోతుబరి. అనేక ప్రజల ఉపయోగార్థం మరియు సంక్షేమార్థం అనేక పనులను చేయించేవారు. అలాంటి ఒక కార్యక్రమం చేపట్టారు. నేటి గుంటూరు నగరానికి సమీపంలో ఉన్న బుడంపాడు గ్రామంలో ఒక మంచినీటి చెఱువును తవ్వించడానికి నిర్ణయించారు. తవ్వుతున్నప్పుడు పానువట్టంతో పాటు బ్రహ్మ సూత్రంతో దివ్యకాంతులు వెదజల్లుతూ లింగరాజు లభ్యమయ్యారు. ఏనాటి లింగమో ! చెక్కుచెదరకుండా శోభాయమానంగా దర్శనమివ్వడంతో రాయుడు గారు తమ గ్రామానికి తీసుకొనివచ్చారు. ఆ కాలంలో గోవాడ ఒక బ్రాహ్మణ అగ్రహారం. వేదవేదాంగాలను అభ్యసించిన బ్రాహ్మణోత్తములు నివసించేవారు. వారిని సంప్రదించి 1907 వ సంవత్సరంలో లభించిన ఉత్తమ లింగాన్ని శ్రీ బాల కోటేశ్వర స్వామి పేరిట ప్రతిష్టించారు. క్రమక్రమంగా ఆలయం అభివృద్ధి చెందసాగింది. అనేక నూతన నిర్మాణాలు జరిగాయి. 
1930 వ సంవత్సరం నుండి భక్తులకు లభించిన దివ్యానుభావాల కారణంగా ప్రభలతో అయిదు రోజుల పాటు మహా శివరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. నేటికీ కోటప్పకొండలో సమానమైన ప్రభలు గోవాడలో కనపడతాయి అంటే ఈ ఉత్సవాల వెనుక భక్తుల పాత్రను శ్రీ బాల కోటేశ్వర స్వామి పట్ల వారి భక్తి విశ్వాసాలను అర్ధం చేసుకోవచ్చును. 







 ఆలయ విశేషాలు 

తూర్పు ముఖంగా ఉన్న ప్రధాన ఆలయానికి పడమర వైపున ప్రవేశ ద్వారం ఉంటుంది. పచ్చని పొలాల మధ్య సువిశాల ప్రాంగణంలో అనేక దేవతా మూర్తులు దర్శనమిస్తారు. తూర్పున అయిదు అంతస్థుల రాజ గోపురం నిర్మించారు. 
ప్రాంగణం లోనికి ప్రవేశించగానే శ్రీ వినాయకుడు, శ్రీ జ్ఞాన సరస్వతి దేవి, గౌతమ బుద్ధుడు, శ్రీ షిర్డీ సాయిబాబా, శ్రీ అభయాంజనేయ స్వామి ఉపాలయాలు కనిపిస్తాయి. 
తూర్పువైపున వటవృక్షం క్రింద అనేక నాగ ప్రతిష్టలు ఉంటాయి. రాహుకేతు పూజలకు ప్రసిద్ధి ఈ ఆలయం. మరో పక్కన పద్మాసన భంగిమలో శ్రీ గంగాధరుడు. 
అక్కడే నింగిని తాకేలా ఏర్పాటు చేసిన ధ్వజస్థంభం, బలిపీఠాలు ఉంటాయి. 
విశాల ఆస్థానమండపం పూజాదులు, హోమాలు నిర్వహించడానికి అనువుగా నిర్మించబడినది. నందీశ్వరుడు గర్భాలయంలో లింగరూపంలో ఉన్న శ్రీ బాల కోటేశ్వర స్వామివారి ఆజ్ఞకు ఎదురుచూస్తున్నట్లుగా కనిపిస్తారు. విశేషం ఏమిటంటే చక్కని చందాన, విభూతి, కుంకుమ, పుష్ప అలంకరణలో శ్రీ బాల కోటేశ్వర స్వామి బ్రహ్మ సూత్రం కలిగిన లింగ రూపంలో దర్శనమిస్తారు. 
ఇరుపక్కలా ఉన్నరెండు సన్నిధులలో శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రుడు, శ్రీ  పార్వతీదేవి కొలువై భక్తులను అనుగ్రహిస్తారు. 
శ్రీ బాల కోటేశ్వరస్వామి వారి ఆలయంలో మరో విశేషం కనపడుతుంది.








 
సహజంగా ప్రతి శివాలయంలో నవగ్రహ మండపం ఉండటం విధాయకం. ఇక్కడ కూడా. కాకపోతే మొదటి నుండి లేదు. భక్తులు, ఆలయ పెద్దలు కలిసి 1988లో అష్టకోణ మండపాన్ని నిర్మించి, అందులో నవగ్రహాలను పీఠ, వాహన మరియు సతీ సమేతంగా ప్రతిష్టించారు. ఆ విధంగా  చూస్తే గోవాడలోని నవగ్రహ మండపం ప్రత్యేకమైనది. మండప వెలుపల ప్రత్యేక అద్దాల సన్నిధిలో  వాయస వాహనంతో కలిసి శ్రీ శనేశ్వరుడు దర్శనమిస్తారు. ఏలినాటి, అర్ధాష్టమ శని ప్రభావం ఎదుర్కొంటున్నవారు ప్రత్యేక పూజలు జరిపించుకొంటారు. 

ఆలయ పూజలు మరియు ఉత్సవాలు 

ప్రతినిత్యం నాలుగు పూజలు జరిగే ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల దర్శనార్ధం తెరిచి ఉంటుంది. 
శ్రీ వినాయక చవితి, శ్రీ సుబ్రహ్మణ్య షష్టి, శ్రీ దేవీ నవరాత్రులు, మహాశివరాత్రి, శ్రీ రామనవమి, శ్రీ హనుమజ్జయంతి, ఉగాది ఆదిగాగల పర్వదినాలలో పెద్దఎత్తున భక్తులు తరలి వస్తారు. 
ముఖ్యంగా అయిదు రోజుల పాటు నిర్వహించే మహాశివరాత్రి తిరునాళ్ళు గోవాడ ను జనసముద్రంగా మార్చివేస్తాయి. దూరప్రాంతంలో స్థిరపడిన గ్రామస్థులు శివరాత్రి ఉత్సవాలలో పాల్గొనడానికి వస్తారు. చుట్టుపక్కల గ్రామాలూ, పట్టణాల నుంచి కూడా భక్తులు తిరునాళ్లను చూడటానికి వస్తారు. 
చుట్టూ పచ్చని పంట పొలాలతో ప్రశాంత వాతావరణం మధ్యన దేవతా వృక్షాలుగా కీర్తించబడే మారేడు, జమ్మి, తెల్ల జిల్లేడు, గన్నేరులతో   నిండిన ప్రాంగణం, అనేక దేవీదేవతల స్థిరనివాసం, మహేశ్వరుడు అమ్మవారితో కలిసి కొలువైన దివ్య క్షేత్రం గోవాడ నిరంతరం ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతుంది. 
గోవాడ కు తెనాలి, గుంటూరు, పొన్నూరు నుండి సులభంగా రహదారి మార్గంలో చేరుకోవచ్చును. వసతి సౌకర్యాల కొరకు తెనాలి లేదా గుంటూరు పట్టణాల మీద ఆధారపడాలి. గోవధకు సమీపంలోని చందోలు లో శ్రీ బగళాముఖీ అమ్మవారి ఆలయం, పొన్నూరులో శ్రీ సాక్షి భావన్నారాయణ స్వామి ఆలయం  ఎత్తైన శ్రీ ఆంజనేయ మరియు శ్రీ గరుత్మంతుని ఆలయాలతో పాటు మరికొన్ని పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. గుంటూరు నుండి పొన్నూరు వెళ్లే దారిలో వచ్చే చేబ్రోలు దేవాలయాల గని. శ్రీ పంచ ముఖ బ్రహ్మ ఆలయంతో సహా అనేక పురాతన ఆలయాలు ఉన్నాయి. 
ఒక ప్రణాళికతో ప్రయాణం చేసినట్లయితే వీటన్నింటినీ ఒక రోజులో దర్శించుకోవచ్చును. 

నమః శివాయ !!!! 














14, మార్చి 2024, గురువారం

Sri Trimoorthi & Trishakthi Temple, Nandyal


                                         అరుదైన ఆలయం 





 శ్రీ గురుభ్యోనమః 

శ్రీ అరుణాచలేశ్వరాయ నమః 
అందరికి నమస్కారం 
గొప్ప చెప్పుకోవడం కాదు కానీ నేను నా ఆలయ సందర్శన ప్రయాణం లో నేటికి సుమారుగా మూడు వేలకు పైగా దేవాలయాలను దర్శించుకోగలిగాను. 
వీటిల్లో చిత్రమైన ఆలయాలు అంటే దుర్యోధన, శకుని కూడా పూజలు అందుకొనే క్షేత్రాలు కూడా ఉన్నాయి. కానీ ఒక ప్రత్యేక విశేష అస్సలు భక్తాదరణ లేని నిత్య పూజలకు కూడా దాతల దయ మీద ఆధారపడవలసిన  ఒక ఆలయాన్ని ఈ మధ్య నంద్యాల లో దర్శించడం జరిగింది.
ఏ ఊరు వెళ్లినా మార్నిన్గ్  వాక్ మాత్రం మానను.
ఆ రోజు కూడా నడుచుకుంటూ  చామ కాలువ వైపుకు వెళ్ళాను. ఇంతకు ముందు నంద్యాల వెళ్లిన సందర్భాలలో స్థానికంగా ఉన్న నవ నంది క్షేత్రాలను సందర్శించుకునే అవకాశం లభించింది. అదే విధంగా అహోబిళం, గుండ్ల బ్రహ్మేశ్వరం, ఓంకారం, పాణ్యం, కాల్వ బుగ్గ క్షేత్రాలను దర్శించుకొన్నాను.
నడుస్తూ వెళుతున్న నన్ను ఒక బోర్డు ఆకర్షించింది. రాసిన విషయం ఆకర్షించినది. త్రిమూర్తుల, త్రిశక్తుల దేవాలయం, శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి  దేవస్థానం. బీజాక్షరంలో.  చిత్రంగా ప్రత్యేకంగా  అనిపించింది. ఆకర్షించింది. 
















స్నానం చేసిన తరువాత ఆలయానికి వెళ్ళాను. ప్రధాన రహదారి పక్కనే ఒక చెట్టు క్రింద ఉంటుందీ ఆలయం. ప్రధాన ద్వారం నుండి లోపలి అడుగు పెడితే ఎదురుగా రాతి ధ్వజస్థంభం. దాని మీద శ్రీ గణపతి శిల్పం. రాయలసీమలో అధికశాతం ఆలయాలలో రాతి ధ్వజస్థంభం లేదా దీప స్థంభం ఉంటుంది. కొన్ని చోట్ల రాతి స్థంభం మరియు ధ్వజస్థంభం రెండూ ఉంటాయి. 
ఇక్కడి రాతి ధ్వజం మీద నలువైపులా శ్రీ నరసింహ స్వామి విగ్రహాలను సుందరంగా చెక్కారు. ముఖ మండపంలో మనకి ఎడమ పక్కన మరో చిన్న రాతి మండపం క్రింద పరమేశ్వరుడు లింగ రూపంలో ఎదురుగా నందీశ్వరుడు పక్కన చిన్న గద్దె మీద శ్రీ మంగళ గౌరి దేవి కనిపిస్తారు. ఆ వెనుక నవ గ్రహ మండపం శ్రీ ఆంజనేయస్వామి దర్శనమిస్తారు. 









కుడివైపున పీఠం మీద శ్రీ సీతా లక్ష్మణ  ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రుడు స్థానిక భంగిమలో కొలువై ఉంటారు. ప్రత్యేకమైన సంగతి ఏమిటంటే వారి ఎదురుగా శ్రీ త్యాగరాజ  స్వామి గానం చేస్తున్న భంగిమలో ఉపస్థితులై ఉండటం. ఎన్నో రామ మందిరాలను సందర్శించిన నేను ఎక్కడా ఇలాంటిది చూడలేదు. చాలా బాగుంది. చెక్కించినవారి మరియు చెక్కిన వారి ఆలోచన అభినందనలు తెలుపుకొన్నాను. 



గర్భాలయం ద్వారానికి ఇరుపక్కల శ్రీ వినాయకుడు మరియు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉంటారు. ద్వారస్తంభాలకు ద్వారపాలకులను పైన శ్రీ గజలక్ష్మి ఆ పైన ఆలయ దేవతల రూపాలను కూడా అమర్చారు. 











గర్భాలయంలో మొత్తంగా అయిదు విగ్రహాలు ఉంటాయి. శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానం మరియు  త్రిమూర్తులు, త్రిశక్తుల దేవాలయంగా బోర్డు మీద పేర్కొన్నట్లుగా గర్భాలయంలో వారందరి మూర్తులు దర్శనమిస్తాయి. 
అన్నింటికన్నా వెనుక గోడలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి మూల మూర్తి, మధ్యలో ఏక రూపంలో త్రిమూర్తులు. విశేషం ఏమిటంటే ఈ ఏక మూర్తిలో మధ్యలో విధాత బ్రహ్మ దేవుడు ఆయనకీ కుడి పక్కన లోక రక్షకుడు శ్రీ మహావిష్ణువు, ఎడమ పక్కన లయకారుడు మహేశ్వరుడు ఉంటారు. ఈ మూడు శిరస్సులకు ఒకటే శరీరం. అదీ అన్నింటికన్నా ముఖ్యమైన విషయం. 
ఏక శిలా త్రిమూర్తి రూపానికి ఎదురుగా చిన్న విగ్రహరూపాలలో శ్రీ మహాలక్ష్మి, శ్రీ పార్వతీ దేవి ఇరువైపులా కొలువై ఉండగా మధ్యలో వీణాధారిగా సకల విద్యల తల్లి శ్రీ సరస్వతీ దేవి ఉపస్థితురాలై దర్శనం ఇస్తారు. 





















యాభై  సంవత్సరాల క్రిందట ఇలాంటి ప్రత్యేక రూపాలతో ఆలయం నిర్మించాలన్న తలంపు కీర్తి శేషులు శ్రీ ముత్యాలపాటి నరసింహులు గారికి ఎందుకు వచ్చిందో !
అప్పట్లో ఈ ప్రాంతంలో పేరుగాంచిన నాదస్వర విడవాసులు, నాదబ్రహ్మ ఆలిండియా రేడియో ఆర్టిస్టు శ్రీ ముత్యాలపాటి నరసింహులు గారు. వారికి శ్రీ అహోబిల శ్రీ నారసింహ స్వామి పట్ల గల అచంచల భక్తి  ఒక శ్రీ లక్ష్మీ నారసింహ ఆలయాన్ని నిర్మించడానికి ప్రేరేపించింది. వివిధ ఆలోచనలు, అనేక ప్రేరణలు చివరికి నరసింహులు గారు ఇలాంటి ఒక ప్రత్యేక ఆలయాన్ని నిర్మించేలా చేశాయి. 
వారు తమ నాదస్వర విద్యలో గొప్ప పేరు సంపాదించారు. ఎన్నో బిరుదులూ, సన్మానాలు పొందారు. చివరికి తాను ఆరాధించిన స్వామిలో కలిసిపోయారు. 
ప్రస్తుతం వారి సతీమణి శ్రీమతి బాలనాగమ్మ గారు ఆలయ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. కానీ నిధుల కొరతతో అవి అంత సజావుగా సాగడం లేదు. అర్చకులు లేని ఆలయానికి అన్నీ నాగమ్మ గారే !
వెళ్లి వారికి ఆలయం మరియు నిర్మించిన భర్త గురించి తెలిపి, ఆర్ధిక సహాయం కోరడం  ఇవే ఆమె నిత్యకృత్యాలు. 
ఆలయాన్ని సందర్శించుకొని, ఆమె చెప్పిన విశేషాలను మనసులో పెట్టుకొని తోచిన పైకాన్ని ఇచ్చి భారమైన మనస్సుతో వెలుపలికి వచ్చాను. 
నా ఈ పోస్ట్ చూసిన వారు , చదివిన వారు ఆలయ నిర్వహణకు  తమకు తోచిన ఆర్ధిక సహాయం శ్రీ బాలనాగమ్మ గారి ని సంప్రదించి పంపగలరని చేతులు జోడించి వేడుకొంటున్నాను. ఆమె నెంబర్  : 9959803074. 
మీరిచ్చే ప్రతి రూపాయి ఒక హిందూ ఆలయ నిర్వహణకు, భావి తరాలకు అందించడానికి దోహదపడుతుంది అని ఆ పరమేశ్వర సాక్షిగా చెప్పగలను. 

ఓం నమో నరసింహాయ నమః !!!!





 

11, మార్చి 2024, సోమవారం

Pata Shivalayam, Vijayawada

 

           శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి ఆలయం 

                                    ( విజయవాడ పాత శివాలయం )


పావన కృష్ణానది మహారాష్ట్రలో ఉద్భవించినది మొదలు ఆంధ్రప్రదేశ్ లో సాగర సంగమం చేసే వరకు ప్రవాహ మార్గాన్ని సస్యశ్యామలం చేయడమే కాకుండా తన తీరాలను ఆధ్యాత్మిక క్షేత్రాలుగా రూపొందించుకొన్నది. 
ఈ కారణంగా కృష్ణా తీరాలలో హిందూ ఆలయాలే కాదు బౌద్ధుల మరియు జైనుల నివాస ఆనవాళ్లు కూడా పెక్కు చోట్ల కనిపిస్తాయి. 
ముఖ్యంగా హిందూ దేవాలయాలు లెక్కకు మిక్కిలిగా నెలకొని ఉండటం చూడవచ్చును. వివిధ దేవీదేవతలు స్థిరవాసాలైన ఈ ఆలయాలలో ఒకటి విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రి పైన కొలువైన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధి. 














శ్రీ మల్లేశ్వర స్వామి సమేతంగా సమస్త శివ పరివారం కొలువైన ఈ క్షేత్ర పురాణ గాథ తొలి యుగం నాటిదిగా తెలుస్తోంది. ద్వాపర యుగంలో పాండవ మధ్యముడైన అర్జునునికి కైలాసనాధుడైన పరమశివునికి యుద్ధం జరిగిన స్థలం ఇదేనని ఆ కారణంగా విజయవాటిక అన్న పేరు వచ్చింది అంటారు. అనంతర కాలంలో విజయవాడ గా మారింది అని చెబుతారు. కిరాతక రూపంలో ఉన్న మహేశ్వరునితో పోరు సల్పిఅర్జనుడు  "విజయ" నామం పొందిన ప్రదేశం ఇదే అని పురాణాలు పేర్కొంటున్నాయి. పరమేశ్వరుని నుండి పాశుపతాస్త్రం పొందిన అర్జనుడు ఇంద్ర కీలాద్రి పర్వత పాదాల వద్ద శ్రీ విజయేశ్వర స్వామిని ప్రతిష్టించారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా శ్రీ బ్రహ్మాస్త్రా దేవి సన్నిధి ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  
తెలుగు రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం అమ్మల గన్న అమ్మ శ్రీ కనక దుర్గమ్మ ! ప్రతి నిత్యం వేలాదిగా దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు దర్శనానికి వస్తుంటారు. పర్వదినాలలో, నవ రాత్రులలో, భవాని దీక్షల సమయంలో ఆ సంఖ్య లక్షలలో ఉంటుంది. 
వ్యాపారానికి, విద్యలకు ప్రసిద్ధికెక్కిన విజయవాడ నగరంలో మరెన్నో పురాతన ఆలయాలు కలవు. ఇంద్రకీలాద్రి పర్వత పాదాల వద్ద ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం వాటిల్లో ఒకటి. 
విజయవాడ ఒన్ టౌన్ లో ఉన్న ఈ  పురాతన ఆలయం పాత శివాలయంగా ప్రసిద్ధి. పర్వత పాదాల వద్ద ఉండటం , పాండవ మధ్యముని పూజలు అందుకోవడంతో గతంలో "పాద శివాలయం" అని పిలిచేవారట. కాలక్రమంలో పాత శివాలయం గా పిలవబడుతోంది. కొన్ని వందల సంవత్సరాల పురాతన చరిత్ర మరియు పౌరాణిక పాశస్త్యం కలిగిన దేవాలయాన్ని పాత శివాలయం అని పిలవడం సమంజసమే అనిపిస్తుంది. 
విశేష పౌరాణిక చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయం శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవాలయం. 









పురాణ గాథ 

ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాస సమయంలో కృష్ణాతీరంలో శ్రీ కనక దుర్గాదేవి సమేత శ్రీ మల్లేశ్వరస్వామి వార్లను సేవించుకొన్నారని తెలుస్తోంది. వారు కొంత కాలం ఇక్కడే నివసించారని ఆ సమయంలో పాండవాగ్రజుడు శ్రీ ధర్మరాజు పర్వత పాదాల వద్ద ఒక శివలింగాన్ని ప్రతిష్టించారట. అదే నేటి పాత శివాలయం. 
అనంతరకాలంలో అర్జనుడు ఇంద్రకీలాద్రి వద్ద తపస్సుచేసి పరమేష్ఠి నుండి పాశుపతాస్త్రం పొందారన్నది వేరే కథ. ఇక్కడ తపసు చేసిన సమయంలో పార్ధుడు నిత్యం ధర్మరాజ ప్రతిష్ఠిత శ్రీ మల్లేశ్వర స్వామిని నిత్యం పూజించేవారట. 
ఈ వివరాలన్నీ అనేక మంది పెద్దలు రచించిన క్షేత్ర గాథలలో కనిపిస్తాయి. 








ఆలయ ప్రత్యేకతలు  

పాత శివాలయ సందర్శన ఒక పుణ్య తీర్థ క్షేత్రాల సందర్శనతో సమానం అని పిలవాలి. కారణం ఏమిటంటే ఎన్నో ఉపాలయాల సమాహారం ఈ క్షేత్రం. ప్రతి ఉపాలయానికి ఒక ప్రత్యేకత కలిగి ఉండటం విశేషం. 
శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి క్షేత్రపాలకుడు. 
శ్రీ గణపతి, శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ షణ్ముఖుడు, శ్రీ ధర్మశాస్త, శ్రీ భూదేవి శ్రీదేవీ సమేత శ్రీ వేంకటేశ్వరుడు, శ్రీ లక్ష్మీనరసింహుడు, శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రుడు, శ్రీ ఆంజనేయుడు, శ్రీ రామా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి, శ్రీ చండికేశ్వరుడు, శ్రీ షిర్డీ సాయిబాబా, శ్రీ కేతేశ్వర మహారాజ్ ఆదిగాగల దేవీదేవతలు వివిధ సన్నిధులలో దర్శనమిస్తారు. 
చాలా తక్కువగా కనిపించే మరో కొన్ని విశేషాలు విజయవాడ పాత శివాలయంలో కనిపిస్తాయి. 
శివ లింగాలలో అతి పవిత్రమైనది, ఇష్టకామ్యాలను నెరవేర్చింది బ్రహ్మ సూత్రం ఉన్న లింగం అని పెద్దలు సెలవిచ్చారు. బ్రహ్మ సూత్రం ఉన్న లింగాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. పాత శివాలయంలో ప్రధాన గర్భాలయంలో కొలువైన శ్రీ మల్లేశ్వర స్వామి వారి తో సహా శ్రీ చంద్రమౌలీశ్వర స్వామి, శ్రీ మృత్యుంజయేశ్వర స్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామిగా వివిధ నామ లింగాల రూపాలలో సర్వేశ్వరుడు దర్శనమిస్తారు. విశేషం ఏమిటంటే ఈ అయిదు లింగాలు వివిధ బ్రహ్మ సూత్రాలు కలిగి ఉండటం. అనేక శివలింగాలు నెలకొని ఉన్న ప్రముఖ దేవాలయాలలో కూడా ఇలాంటి లింగాలు కనిపించవు. మరో ప్రత్యేకత ఏమిటంటే శ్రీ మృత్యుంజయేశ్వర లింగానికి భక్తులు స్వహస్తాలతో అభిషేకం చేసుకొనే అవకాశం లభిస్తుంది. 














ఎవరైనా జాతక రీత్యా కుజ దోష ప్రభావం కలిగి ఉంటే నివారణార్ధం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 
ఆలయ ప్రాంగణంలో శ్రీ ధర్మశాస్త సన్నిధి పక్కన అశ్వద్ధ వృక్షం ఉంటుంది. అక్కడ నాగ ప్రతిష్టలు కనపడతాయి. 
శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి సన్నిధిలో ఒక పక్కన గణపతి మరో పక్కన అమ్మవారు ఉపస్థితులై ఉంటారు.  ఇదికూడా మరెక్కడా కనిపించని విశేషమే !
శ్రీ భ్రమరాంబా దేవి విడిగా ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉంటారు. చతుర్భుజాలతో, ఉపస్థిత భంగిమలో ప్రసన్నవదనగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకరాచార్యుల వారు అమ్మవారి సన్నిధిలో శ్రీచక్రాన్ని స్థాపించారు. అమ్మవారికి ఒక పక్కన శ్రీ మహాలక్ష్మి మరో పక్కన శ్రీ సరస్వతి దేవి కొలువై దర్శనమివ్వడం అరుదుగా కనిపించే విశేషం. ఆలయ ఆగ్నేయ మూల ఉన్న శ్రీ కాత్యాయని ఇష్ట కామేశ్వరి దేవి సన్నిధి వద్ద నేతి దీపం వెలిగించి, దానిని చేతిలో ఉంచుకొని అమ్మవారి ఆలయానికి ప్రదక్షిణాలు చేస్తే గుణవంతుడు, కోరుకొన్నవాడు భర్తగా లభిస్తారన్నది తరతరాల విశ్వాసం. 
శ్రీ రామేశ్వర స్వామి లింగాన్ని రామేశ్వరం నుండి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి లింగాన్ని వారణాశి నుండి   తీసికొనివచ్చి ప్రతిష్టించినట్లు తెలుస్తుంది. 

ఆలయ విశేషాలు 

తూర్పు ముఖంగా ఉన్న ఆలయానికి స్థూపాకారంలో నిర్మించిన నాలుగు అంతస్థుల రాజ గోపురం సుందరంగా   కనిపిస్తుంది. ప్రత్యేకమైన శిల్పకళ కనపడదు. 
ప్రస్తుత ఆలయాన్ని క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దం (808 నుండి 847 సంవత్సరాల మధ్యకాలంలో) లో రాష్ట్రకూట రాజులు నిర్మించినట్లు శాసనాధారాలు తెలుపుతున్నాయి. ఆ తరువాత ఎన్నో రాజవంశాలు, పాలకులు ఆలయాభివృద్దికి తమవంతు కృషి చేసినట్లుగా క్షేత్ర గాథ ద్వారా తెలియవస్తోంది. 
రాజగోపురం దాటి ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే ఎదురుగా బలి పీఠం ధ్వజస్థంభం కనిపిస్తాయి. గతంలో ధ్వజస్థంభం పునః ప్రతిష్టాసమయంలో త్రవ్వకాలు జరపగా శ్రీ కాలభైరవ విగ్రహం లభించినది. శ్రీ కాలభైరవుని అక్కడే ప్రతిష్టించారు. 
చిన్న ప్రాంగణంలో కిక్కిరిసినట్లు ఉంటాయి ఉపాలయాలు. అక్కడే అనేకమంది బ్రాహ్మణులు జపాలు చేస్తూ కనిపిస్తారు. భక్తులు తమ జాతకరీత్యా ఏర్పడిన గ్రహ దోషానికి ఇక్కడ జపాలు, దానాలు మరియు శాంతులు జరిపించుకొంటుంటారు. ప్రతి నిత్యం ముఖ్యంగా సోమవారాలలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
ప్రదక్షిణాపధంలో వరుసగా ఉపాలయాలు వస్తాయి. ఈ ఆలయానికి ఉన్న మరో విశేషం ఏమిటంటే ఉత్తర ద్వారం కలిగి ఉండటం. అనగా ప్రతినిత్యం ఉత్తర ద్వార దర్శనం లభిస్తుంది. ఆ ద్వారం పక్కనే కొద్దిగా లోపలి ఆలయంలో లభించిన శాసనాలు ఉంటాయి. 
ఆంధ్రప్రదేశ్ లో అతి తక్కువగా కనిపించే శ్రీ చెండికేశ్వర స్వామి సన్నిధి ఇక్కడ గోముఖి వద్ద ఉంటుంది. పక్కనే నాగ శిల్పాలు, పంచలోహ ఓంకారం మరియు త్రిశూలం ఉంటాయి. ఇవన్నీ వివిధ కాలాలలో నిర్మించడం వలన ఒకవరుసలో ఉన్నా కూడా ఒక క్రమపద్ధతి కనపడదు. కిక్కిరిసినట్లుగా ఉంటుంది.  అయినా ఇందరు దేవీదేవతలు ఒకే ప్రాంగణంలో దర్శించుకొని భాగ్యం ముందు ఇవన్నీ కూడా పట్టించుకోవలసిన అవసరం ఈ మాత్రం లేదు. అక్కడ లభ్యమయ్యే ప్రశాంతతను, ఆధ్యాత్మిక పరిమళాన్ని ఆస్వాదించడమే మనం చేయవలసినది. 

ఆలయ ఉత్సవాలు 

భక్తుల దర్శనార్ధం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉండే ఆలయంలో నియమంగా అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు మరియు ఆరగింపులు జరుగుతాయి. 
పౌర్ణమికి, అమావాస్యకు, మాస శివరాత్రికి, త్రయోదశికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 
కార్తీక మాస పూజలు, శివరాత్రి, నవ రాత్రులు, గణపతి నవ రాత్రులు, శ్రీ నృసింహ జయంతి, సుబ్రహ్మణ్య షష్ఠి, శ్రీ రామనవమి, శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్బంగా విశేష పూజలు చేయించుకోడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఉగాది సందర్బంగా వేలాది మంది స్థానిక భక్తులు వస్తుంటారు. 




భవానీ మరియు శ్రీ అయ్యప్ప దీక్షా సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. 
ప్రతి నిత్యం వేదమంత్రాలతో శోభిల్లే ఆలయంలో మాఘ మాసంలో ఆది దంపతుల కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తారు. చైత్ర మాసంలో వసంత నవ రాత్రులు ఘనంగా చేస్తారు. 
నిత్య ఉత్సవ క్షేత్రమైన విజయవాడ పాత (పాద) శివాలయ సందర్శన భక్తులలో ఆధ్యాత్మిక అనుభూతులను నింపుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

నమః శివాయ !!!!



 


 




































































Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...